Breaking News

నితీశ్ సభలో లాలూకు జేజేలు.. తీవ్ర ఆగ్రహం వ్యక్తం చేసిన బీహార్ సీఎం


ఎన్నికల ప్రచారం సందర్భంగా బిహార్ ముఖ్యమంత్రి తీవ్ర అసహనానికి గురయ్యారు. నితీశ్ సభలో లాలూకు అనుకూలంగా నినాదాలు చేయడమే దీనికి కారణం. బుధవారం పార్సా నియోజకవర్గంలో జరిగిన ఎన్నికల ప్రచార సభలో నితీశ్ మాట్లాడుతుండగా కొందరు లాలూ జిందాబాద్ అంటూ నినాదాలు చేశారు. దీంతో సహనం కోల్పోయిన నితీశ్.. ఏం మాట్లాడుతున్నారు అని ఆగ్రహం వ్యక్తం చేశారు. ‘అర్థం లేని మాటలు మాట్లాడేవారు ఎవరో కాస్త చేయి పైకి లేపాలి.. సభలో గందరగోళం సృష్టించొద్దు.. నాకు ఓటు వేయాలనే ఉద్దేశం ఉంటే వేయండి.. లేకపోతే లేదు’ అంటూ నీతీశ్‌‌ మండిపడ్డారు. తన ప్రసంగానికి అంతరాయం కలిగించేలా నినాదాలు చేస్తున్న వారి ప్రవర్తన ఆమోదయోగ్యమైనదేనా అని సభలో ఉన్నవారిని నితీశ్ ప్రశ్నించగా.. దీనికి ఆయన మద్దతుదారులు ‘లేదు’ అని బదులిచ్చారు. ఆ సమయంలో వేదికపై నీతీశ్‌తో పాటు ఇటీవలే ఆర్జేడీ నుంచి జేడీయూలో చేరిన చంద్రిక రాయ్‌ ఉన్నారు. చంద్రిక రాయ్‌ కుమార్తె ఐశ్వర్యను లాలూప్రసాద్‌ కుమారుడు తేజ్‌ ప్రతాప్‌ యాదవ్‌కు ఇచ్చి వివాహం చేసిన విషయం తెలిసిందే. అయితే, ఈ వివాహం తర్వాత తలెత్తిన విబేధాలతో ఆయన ఆర్జేడీని వీడి జేడీయూలో చేరారు. తాము అధికారంలోకి వస్తే తక్షణమే 10 లక్షల ఉద్యోగాలు కల్పిస్తామని ప్రకటించగా.. భూమ్మీద ఉండే ఎవరికీ ఇది సాధ్యం కాదని నితీశ్ కొట్టిపారేస్తున్నారు. ప్రస్తుతం ఉన్న ఉద్యోగులకు జీతాలు చెల్లించడానికే రూ.52,734 కోట్లు ఖర్చవుతోందని, మరో 10 లక్షల మందికి ఉద్యోగాలు కల్పిస్తే అదనంగా రూ.1.11 లక్షల కోట్లు అవసరమవుతాయని బీజేపీ నేత, డిప్యూటీ సీఎం సుశీల్ మోదీ వ్యాఖ్యానించారు. అయితే, లాలూ లేకుండా తొలిసారి బిహార్ ఎన్నికలు జరుగుతుండగా.. మొత్తం బాధ్యతను తేజస్వీ తన భుజస్కంధాలపై వేసుకున్నారు. తేజస్వీ సభలకు జనం భారీగా తరలివస్తున్నారు. అయితే, దీనిని బీజేపీ వర్గాలు కొట్టిపారేస్తున్నాయి. జనం ఆయన సభలకు వచ్చినా ఓట్లు మాత్రం వేయరని, ప్రధాని మోదీ ప్రచారం మొదలైతే పరిస్థితి పూర్తిగా మారిపోతుందని అంటున్నాయి.


By October 22, 2020 at 10:12AM


Read More https://telugu.samayam.com/latest-news/india-news/bihar-cm-nitish-kumar-angry-reaction-at-rally-to-slogans-of-lalu-prasad-zindabad/articleshow/78801607.cms

No comments