Breaking News

అణ్వాయుధ నిషేధానికి మార్గం సుగమం.. ఐరాస ఒప్పందానికి 50 దేశాలు ఆమోదం


ట్రీటీ ఆన్ ప్రొహిబిషన్ ఆఫ్ న్యూక్లియర్ వెపన్స్ ( అణ్వాయుధాల నిషేధిత ఒప్పందం)నికి ఇప్పటి వరకు 50 దేశాలు ఆమోదం తెలిపినట్లు ఐక్యరాజ్యసమితి ప్రకటించింది. దీంతో వచ్చే మూడు నెలల్లోనే ఈ ఒప్పందం అమలులోకి రానుంది. ఈ అంతర్జాతీయ ఒప్పందానికి 50దేశాలు ఆమోదం తెలియజేయడం చారిత్రక మైలురాయిగా అభివర్ణించింది. ఈ నేపథ్యంలో ఆమోదం తెలిపిన దేశాలను ఐరాస సెక్రటరీ జనరల్‌ ఆంటోనియో గుటెర్రస్‌ అభినందించారు. అణుదాడులు, అణు పరీక్షల నుంచి బయటపడిన వారికి వందనం చేసిన ఆయన.. అణ్వాయుధాల నిషేధం కోసం వారి చేసిన పోరాటాన్ని ప్రశంసించారు. ఈ ఒప్పందం అమల్లోకి వస్తే అణ్వాయుధాల వాడకం వల్ల కలిగే నష్టాలు, విపత్కర పరిణామాలపై ప్రపంచాన్ని మేల్కొపడం మరింత సులభతరం అవుతుందని ఆయన అభిప్రాయపడ్డారు. ట్రీటీ ఆన్‌ ప్రొహిబిషన్‌ ఆఫ్‌ న్యూక్లియర్‌ వెపన్స్‌(టీపీఎన్‌డబ్ల్యూ) ఒప్పందం అమలు చేయాలంటే ఐరాసలోకి కనీసం 50 సభ్యదేశాలు ఆమోదం తప్పనిసరి. తాజాగా హోండూరస్‌ దీనికి ఆమోదం తెలపడంతో అణ్వాయుధ నిషేధ ఒప్పందం అమలుకు మార్గం సుగమమైంది. దీంతో వచ్చే 90రోజుల్లోనే అంటే 22 జనవరి 2021 నుంచి అణ్వాయుధాల నిషేధం అమలులోకి వస్తుంది. కానీ, అమెరికాతో పాటు అణ్వాయుధాలు కలిగిన శక్తిమంతమైన దేశాలు ఈ ఒప్పందాన్ని తీవ్రంగా వ్యతిరేకిస్తున్నాయి. ఇప్పటి వరకు బ్రిటన్‌, చైనా, ఫ్రాన్స్‌, రష్యాలు కూడా ఈ ఒప్పందంపై సంతకం చేయలేదు. అంతేకాదు ఈ ఒప్పందాన్ని రద్దు చేయాలని అమెరికా బలంగా వాదిస్తోంది. రెండో ప్రపంచ యుద్ధంలో జపాన్‌లోని హిరోషిమా, నాగసాకిపై అమెరికా ప్రయోగించిన అణు బాంబుల ప్రభావం ఇప్పటికీ వెంటాడుతోంది. మానవాళికి మనుగడకు ప్రమాదకరంగా మారిన ఈ అణ్వాయుధాలపై నిషేధం విధించాలని అంతర్జాతీయంగా పౌర సంఘాలు పోరాటం సాగిస్తున్నాయి. ఆ సమయంలోనే నానాజాతి సమితి అంతరించి ఐక్యరాజ్యసమితి ఏర్పడింది. ఈ నేపథ్యంలో 75 ఏళ్ల సుదీర్ఘ నిరీక్షణ తర్వాత అణ్వాయుధ నిషేధం అమలులోకి రానుంది. ఈ ఒప్పందం ప్రకారం, అణ్వాయుధాలు లేదా ఇతర అణు పేలుడు పరికరాలను అభివృద్ధి చేయడం, పరీక్షించడం, తయారు చేయడం, దిగుమతి చేయడం, నిల్వ ఉంచడం వంటివి నిషేధం. ‘అణ్వాయుధాల నిర్మూలనకు అర్ధవంతమైన నిబద్ధతను సూచిస్తుంది.. ఇది ఐక్యరాజ్యసమితికి నిరాయుధీకరణ ప్రాధాన్యతగా మిగిలిపోయింది’ అని గుటెర్రస్ వ్యాఖ్యానించారు. హిరోషిమా, నాగసాకిపై దారుణమైన దాడులు, అణు నిరాయుధీకరణను ఒక మూలస్తంభంగా మారిన ఐరాసకు 75 ఏళ్ల తర్వాత గొప్ప విజయం అని ఐసీఏఎన్ ఎగ్జిక్యూటివ్ డైరెక్టర్ బీట్రైస్ ఫిన్ అన్నారు. ఈ ఒప్పందాన్ని ఆమోదించిన 50 దేశాలు అణ్వాయుధాలు కేవలం అనైతికమైనవి కావు.. చట్టవిరుద్ధం అనే కొత్త అంతర్జాతీయ నిబంధనను రూపొందించడంలో నిజమైన నాయకత్వాన్ని చూపుతున్నాయని వ్యాఖ్యానించారు.


By October 26, 2020 at 07:32AM


Read More https://telugu.samayam.com/latest-news/international-news/fifty-countries-have-ratified-an-international-treaty-to-ban-nuclear-weapons/articleshow/78864551.cms

No comments