Breaking News

డ్రోన్లతో ఉగ్రవాదులకు ఆయుధాలు సరఫరా.. సరిహద్దుల్లో పాక్ పన్నాగం


సరిహద్దుల్లో దాయాది పాకిస్థాన్‌ పన్నాగాలు కొనసాతున్నాయి. రాత్రివేళ నియంత్రణ రేఖ వెంబడి చక్కర్లు కొడుతున్న పాక్ డ్రోన్లు, ఉగ్రవాదుల కోసం ఆయుధాలను జారవిడుస్తున్నట్టు జమ్మూ కశ్మీర్‌ పోలీసులు వెల్లడించారు. తాజాగా, అఖ్నూర్‌లోని ఓ గ్రామంలో దాడులకు వినియోగించే రైఫిల్స్‌, ఒక పిస్తోల్‌ గుర్తించినట్టు తెలిపారు. పాకిస్థాన్‌కు చెందిన డ్రోన్లు సెప్టెంబరు 20న రాత్రివేళ ఓ గ్రామంలో ఆయుధాలు జారవిడుస్తున్నట్టుగా అందిన నిర్ధిష్ట సమాచారం ఆధారంగా ఆ ప్రాంతంలో పోలీసులు సోదాలు నిర్వహించారు. ఈ సందర్భంగా జాద్‌ సొహాల్‌ గ్రామం నుంచి రెండు ఏకే-47 రైఫిల్స్‌, ఒక పిస్తోల్‌, మూడు ఏకే మ్యాగజైన్లు, 90 రౌండ్లు స్వాధీనం చేసుకున్నట్టు పోలీసులు పేర్కొన్నారు. జమ్మూకు 35 కిలోమీటర్ల దూరంలోని అఖ్నూర్ సరిహద్దు నివాల్ ఖండ్ వద్ద ఆయుధాలు, పేలుడు పదార్థాలను కూడా స్వాధీనం చేసుకున్నట్టు తెలిపారు. ఈ ఆయుధాలను కశ్మీర్‌‌లోని ఉగ్రవాదులకు అందిస్తున్నట్టు భావిస్తున్నామని పోలీసులు తెలిపారు. ప్రాథమిక దర్యాప్తు ఆధారంగా దీని వెనుక జైషే మొహమూద్‌ ఉగ్రవాద సంస్థ ఉన్నట్టు సీనియర్‌ అధికారి శ్రీధర్‌ పాటిల్‌ తెలిపారు. ఇటీవల సాంబ, హిరాన్‌నగర్, కథువా సరిహద్దుల్లో పాక్ డ్రోన్లు భారత్ సరిహద్దుల్లో చక్కర్లు కొట్టినట్టు అధికారులు వెల్లడించారు. జమ్మూలో భారీ విధ్వంసానికి పాక్ కుట్ర పన్నినట్టు అధికారులు భావిస్తున్నారు. ఈ నేపథ్యంలో బీఎస్ఎఫ్, ఆర్మీ, పోలీసులు పరిస్థితిని పర్యవేక్షిస్తున్నారు. కొద్ది వారాల్లో దసరా, దీపావళి పండగల నేపథ్యంలో పాక్ దుష్టపన్నాగానికి ప్రయత్నిస్తోంది. గతేడాది కూడా పంజాబ్‌ సరిహద్దు సమీపంలో పాకిస్థాన్‌కు చెందిన డ్రోన్లు చక్కర్లు కొట్టడం కలకలం రేపింది. అప్పట్లో బీఎస్‌ఎఫ్‌ సిబ్బంది అప్రమత్తమయ్యారు. పంజాబ్‌ పోలీసులు కూడా గతేడాది అక్టోబర్‌లో డ్రోన్లు ఏకే 47 రైఫిల్స్, గ్రనేడ్‌లు, శాటిలైట్‌ ఫోన్లు జారవిడుస్తున్నట్టు చెప్పిన విషయం తెలిసిందే.


By September 23, 2020 at 07:30AM


Read More https://telugu.samayam.com/latest-news/india-news/pakistan-uses-drones-to-drop-weapons-at-night-across-loc-in-jammu-and-kashmir/articleshow/78266740.cms

No comments