Breaking News

టిక్‌టాక్, వీచాట్ బ్యాన్.. అమెరికాలో రేపటి నుంచి అమల్లోకి!


కరోనా వైరస్ వ్యాప్తి విషయాన్ని చైనా దాచిపెట్టి, ప్రపంచాన్ని మోసం చేసిందనే పలు దేశాలు ఆరోపణలు గుప్పిస్తున్నాయి. ఇక, అమెరికా విషయానికి వస్తే ఈ వైరస్‌ చైనా ల్యాబ్‌లోనే తయారయ్యిందని దుయ్యబట్టింది. డ్రాగన్‌పై అమెరికా అధ్యక్షుడు ఒంటికాలితో లేస్తున్నారు. చైనాపై గుర్రుగా ఉన్న డొనాల్డ్‌ ట్రంప్‌ ఆ దేశానికి ఊహించని ఝలక్ ఇచ్చారు. చైనాకు చెందిన టిక్‌టాక్‌, వీచాట్‌ యాప్‌లను నిషేధిస్తున్నట్టు తాజాగా అమెరికా ప్రకటించింది. ఆదివారం నుంచి ఈ రెండు యాప్‌ల డౌన్‌లోడ్‌లను నిలిపివేయనున్నట్లు అమెరికా వాణిజ్య విభాగం శుక్రవారం పేర్కొంది. దేశ భద్రతను దృష్టిలో ఉంచుకొని టిక్‌టాక్‌, వీచాట్‌ యాప్‌లను నిషేధిస్తూ నిర్ణయం తీసుకున్నట్టు అమెరికా వాణిజ్య విభాగం కార్యదర్శి విల్‌బర్‌ రోస్‌ వెల్లడించారు. అంతేకాదు, తమ పౌరుల వ్యక్తిగత సమాచారాన్ని కూడా చైనా సేకరిస్తోందని ఆయన పేర్కొన్నారు. అయితే, యాజమాన్యం మార్పిడి విషయం పరిష్కారమైతే నిషేధం ఎత్తివేసే అంశాన్ని పరిశీలిస్తామని రోస్ తెలిపారు. మరోవైపు, బైట్‌డ్యాన్స్‌ లిమిటెడ్‌కు చెందిన టిక్‌టాక్‌ 100 మిలియన్ల అమెరికా పౌరుల సమాచారాన్ని యాక్సిస్‌ చేస్తున్న నేపథ్యంలో భద్రత నిపుణులు ఇప్పటికే ఆందోళన వ్యక్తం చేశారు. కాగా టిక్‌టాక్‌ను కొనుగోలు చేసేందుకు తాజాగా సాఫ్ట్‌వేర్‌ దిగ్గజం ఒరాకిల్‌ కార్పొరేషన్‌ చర్చలు జరుపుతోంది. టిక్‌టాక్‌ యూఎస్‌ కార్యకలాపాలను సొంతం చేసుకునేందుకు ఐటీ దిగ్గజం మైక్రోసాఫ్ట్‌ జరిపిన చర్చలు విఫలమయ్యాయి. దీంతో టిక్‌టాక్‌ యూఎస్‌ విభాగాన్ని దక్కించుకునేందుకు ఒరాకిల్‌ పావులు కదుపుతోంది. అత్యంత ప్రజాదరణ పొందిన ‘టిక్‌టాక్’పై నిషేధం విధిస్తూ ఆగస్టు 7న ఎగ్జిక్యూటివ్ ఉత్తర్వులపై అమెరికా అధ్యక్షుడు డొనాల్డ్ ట్రంప్ సంతకం చేసిన విషయం తెలిసిందే. ఈ ఉత్తర్వులు 45 రోజుల్లోగా అమల్లోకి వస్తాయని పేర్కొన్నారు. ‘జాతీయ భద్రతను కాపాడటానికి టిక్ టాక్ యజమాన్యంపై కఠిన చర్యలు తీసుకోవాలి’అని ఎగ్జిక్యూటివ్ ఉత్తర్వుల్లో పేర్కొన్నారు. వినియోగదారులకు చెందిన ఇంటర్నెట్, ఇతర నెట్‌వర్క్ కార్యకలాపాల పూర్తి సమాచారాన్ని టిక్ టాక్ సంగ్రహిస్తుందని ఉత్తర్వుల్లో పేర్కొన్నారు. దీని వల్ల చైనా కమ్యూనిస్ట్ పార్టీ నుంచి అమెరికన్ల వ్యక్తిగత, యాజమాన్య సమాచారానికి ముప్పు ఉందని అన్నారు. ప్రభుత్వ ఉద్యోగులు, కాంట్రాక్టర్ల స్థానాలను ట్రాక్ చేయడానికి, బ్లాక్ మెయిల్ కోసం ప్రజలపై పత్రాలను రూపొందించడానికి, కార్పొరేట్ గూఢచర్యాన్ని నిర్వహించడానికి టిక్‌టాక్ నుంచి వచ్చిన డేటాను చైనా ఉపయోగించుకోవచ్చని తెలిపారు. కాగా, టిక్‌టాక్‌, వీచాట్‌, పబ్జీతో పాటు వందకు పైగా చైనా యాప్‌లను భారత్‌ నిషేధించిన విషయం తెలిసిందే.


By September 19, 2020 at 07:32AM


Read More https://telugu.samayam.com/latest-news/international-news/usa-bans-social-media-apps-tiktok-and-wechat-citing-security-concerns/articleshow/78198155.cms

No comments