కరోనా లక్షణాలు ఉన్నా టెస్టులో నెగటివ్ వచ్చిందా..?: కేంద్రం కీలక సూచన

మన దేశంలో రికార్డు స్థాయిలో కరోనా కేసులు నమోదవుతున్న వేళ.. వైరస్ను అరికట్టడానికి కేంద్రం కీలక సూచనలు చేసింది. కరోనా లక్షణాలు ఉండి.. ర్యాపిడ్ టెస్టులో నెగటివ్ అని తేలిన వారికి తప్పనిసరిగా ఆర్టీ-పీసీఆర్ టెస్టులు చేయాలని రాష్ట్రాలు, కేంద్రపాలిత ప్రాంతాలకు సూచించింది. పాజిటివ్ కేసులను గుర్తించకపోతే.. బాధితుల ద్వారా ఇతరులకు వైరస్ సోకే ముప్పు ఉండటంతో కేంద్రం ఈ నిర్ణయం తీసుకుంది. దేశంలో నమోదవుతున్న కొత్త కరోనా కేసుల్లో 60 శాతం కేవలం ఐదు రాష్ట్రాల్లోనే నమోదవుతున్నాయని కేంద్రం తెలిపింది. బుధవారం మహారాష్ట్రలో 23,577 కేసుల నమోదు కాగా.. ఆంధ్రాలో 10,418 కేసులను గుర్తించారు. టెస్టులు ఎక్కువగా చేయాలని.. ముఖ్యంగా పాజిటివిటీ రేటు ఎక్కువగా ఉన్న రాష్ట్రాల్లో టెస్టులను పెంచాలని కేంద్రం కోరుతోందని ఆరోగ్య శాఖ వర్గాలు తెలిపాయి. మాస్కులను ఎక్కువగా వాడటం వల్లే కరోనా కేసుల సంఖ్యను తగ్గించగలమని ఆరోగ్య శాఖ అధికారులు తెలిపారు. బుధవారం 1172 మంది కరోనా బారిన పడి చనిపోగా.. వీటిలో 69 శాతం మహారాష్ట్ర, తమిళనాడు, కర్ణాటక, ఢిల్లీ, ఆంధ్రప్రదేశ్ల్లోనే నమోదయ్యాయి. బుధవారం నమోదైన కరోనా మరణాల్లో మహారాష్ట్ర వాటానే 32 శాతం ఉంది.
By September 11, 2020 at 10:03AM
No comments