Breaking News

దేశీయంగా మూడు వ్యాక్సిన్‌లు అభివృద్ధి.. ప్రధాని కీలక ప్రకటన


స్వాతంత్ర దినోత్సవ వేళ జాతినుద్దేశించి ప్రసంగించిన ప్రధాని నరేంద్ర మోదీ.. తన ప్రసంగంలో అనేక అంశాలను ప్రస్తావించారు. కరోనా వైరస్ కారణంగా దేశంతోపాటు ప్రపంచం విపత్కర పరిస్థితులు ఎదుర్కొంటోందని అన్నారు. ప్రస్తుతం వ్యాక్సిన్ కోసం ముమ్మర ప్రయోగాలు సాగుతున్నాయని అన్నారు. దేశీయంగా మూడు వ్యాక్సిన్‌లు అభివృద్ధి వివిధ దశల్లో ఉందన్నారు. వ్యాక్సిన్ తయారీకి ఒకసారి శాస్త్రవేత్తల నుంచి అనుమతి లభించిన తర్వాత పెద్ద ఎత్తున ఉత్పత్తి ప్రారంభిస్తామని అన్నారు. వీలైనంత తక్కువ సమయంలో దేశంలోని ప్రతి ఒక్కరికీ వ్యాక్సిన్ అందజేయడానికి రోడ్ మ్యాప్‌ను రూపొందిస్తామని అన్నారు. భవిష్యత్తు భారతావనికి చిన్నారులే కీలకమని, కోవిడ్ కారణంగా వేడుకలకు వారు దూరంగా ఉన్నారని అన్నారు. కరోనా వైరస్ ప్రతి ఒక్కర్నీ అడ్డుకుంటోందన్నారు. ఇలాంటి సమయంలో ‘సేవ పరమో ధర్మ’గా భావించి కరోనా యోధులు దేశం కోసం తమ ప్రాణాలను ఫణంగా పెట్టి పోరాడుతున్నారని, వారికి నా కృతజ్ఞతలు తెలియజేస్తున్నాను అని అన్నారు. ‘భారత్‌ తయారీ వస్తువులను ప్రపంచం ఆదరించేలా ఉత్పత్తి చేద్దాం. ఒకనాడు భారత వస్తువులు అంటే విశ్వవ్యాప్తంగా గౌరవం ఉండేది. మళ్లీ భారత వస్తువులకు పూర్వ వైభవం తెచ్చే ప్రయత్నం చేద్దామని పిలుపునిచ్చారు. భారత్‌ అంటే నాణ్యమైన వస్తువుల అడ్డా అన్న గౌరవాన్ని తెచ్చుకుందామని, మన వస్తువులను మనమే గౌరవించకుంటే ప్రపంచం ఎలా గౌరవిస్తుందన్నారు. ‘పీపీఈ కిట్లు, ఎన్‌ 95 మాస్కులు కూడా వెతుక్కోవాల్సిన పరిస్థితి ఉండేది, నాలుగు నెలల్లో స్వయం సమృద్ధి సాధించి ఇతర దేశాలకూ ఎగుమతి చేస్తున్నాం. మన యువతకు కొత్త అవకాశాలు కల్పించే ప్రయత్నం చేస్తున్నాం. వోకల్‌ ఫర్‌ లోకల్‌ అనే మాటను నిలబెట్టుకుందాం’ అని మోదీ అన్నారు.


By August 15, 2020 at 11:18AM


Read More https://telugu.samayam.com/latest-news/india-news/three-coronavirus-vaccines-are-at-different-stages-of-trials-in-india-says-modi/articleshow/77558950.cms

No comments