Breaking News

భారత్ సరిహద్దుల్లో డ్రాగన్ రెచ్చగొట్టే చర్యలకు పాల్పడుతోంది.. అమెరికా సెనేట్‌లో తీర్మానం


భారత్ సరిహద్దుల్లో చైనా వైఖరిని అగ్రరాజ్యం అమెరికా మరోసారి వేలెత్తిచూపింది. భారత సరిహద్దుల్లో చైనా తీరును అమెరికా సెనేటర్లు జాన్‌ కార్నిన్‌, మార్క్‌ వార్నర్‌లు ఎండగట్టారు. చైనా దుస్సాహసాన్ని ఖండిస్తూ సెనేట్‌లో గురువారం తీర్మానం ప్రవేశపెట్టారు. భారత పెట్రోలింగ్‌ దళాలపై చైనా ఆర్మీ దూకుడు వైఖరి అవలంబిస్తోందని తూర్పారబట్టారు. భారత సరిహద్దుల వెంబడి సైన్యాన్ని మోహరిస్తోన్న చైనా.. ఆ ప్రాంతంలో నిర్మాణాలు చేపడుతూ రెచ్చగొట్టే చర్యలకు పాల్పడుతోందని దుయ్యబట్టారు. చైనా ఇటువంటి చర్యలకు పాల్పడుతున్నప్పటికీ భారత్‌ సంయమనంతో వ్యవహరిస్తున్న తీరును సెనేటర్ కార్నిన్‌ అభినందించారు. భారత్‌కు తాము అండగా ఉంటామని చెప్పారు. భారత్‌ సరిహద్దుల వద్ద కయ్యానికి కాలుదువ్వుతోన్న చైనా తీరు సరికాదని విమర్శించారు. జూన్‌ 15 గాల్వాన్ లోయ వద్ద జరిగిన ఘర్షణలో 20 మంది భారత సైనికులు మృతి చెందారని వార్నర్ గుర్తు చేశారు‌. చైనా చర్యలు రెచ్చగొట్టేలా ఉన్నాయని వ్యాఖ్యానించారు. సరిహద్దుల వద్ద యథాతథ స్థితిని మార్చడానికి దూకుడుగా వ్యవహరిస్తోన్న చైనా ఆర్మీ చర్యలను తీవ్రంగా ఖండిస్తున్నామని వివరించారు. ఈ అంశంపై భారత్‌-చైనా చర్చలు జరిపి పరిష్కారం దిశగా అడుగులు వేయాలని, ఇంతకు ముందున్న విధంగా ఎల్‌ఏసీ వెంబడి పరిస్థితులను చక్కదిద్దుకోవాలని చెప్పారు. రిపబ్లికన్ సెనేట్ మెజారిటీ విప్ జాన్ కార్నిన్, ఇంటెలిజెన్స్ సెనేట్ సెలెక్ట్ కమిటీలో సభ్యుడిగా ఉన్న సెనేటర్ మార్క్ వార్నర్‌లు ఈ తీర్మానం ప్రవేశపెట్టారు. ఈ సందర్భంగా కార్నిన్ మాట్లాడుతూ.. అమెరికా, భారతదేశం మధ్య బలమైన సంబంధం ప్రాముఖ్యత నాకు ప్రత్యక్షంగా తెలుసు అని అన్నారు. ‘సరిహద్దుల్లో సంమయనంతో వ్యవహరిస్తున్న భారత్.. ఇండో-పసిఫిక్ ప్రాంతంలో శాంతికి చేస్తున్న ప్రయత్నాలను నేను అభినందిస్తున్నాను. చైనా దురాక్రమణకు వ్యతిరేకంగా మన భాగస్వామి భారత్‌ను సమర్థించేటప్పుడు మేము వారికి మద్దతు ఇవ్వడం గతం కంటే చాలా ముఖ్యం’ అని అన్నారు.


By August 14, 2020 at 01:16PM


Read More https://telugu.samayam.com/latest-news/international-news/lac-standoff-resolution-to-condemn-chinese-aggression-against-india-introduced-in-us-senate/articleshow/77541105.cms

No comments