Breaking News

ప్రణబ్ పరిస్థితి కాస్త మెరుగుపడింది.. చికిత్సకు స్పందిస్తున్నారు: అభిజీత్ ముఖర్జీ


మాజీ రాష్ట్రపతి ఆరోగ్య పరిస్థితి కాస్త మెరుగుపడిందని, ప్రస్తుతం నిలకడగా ఉందని ఆయన కుమారుడు అభిజిత్ ముఖర్జీ ఆదివారం వెల్లడించారు. ఈ మేరకు ట్వీట్ చేసిన అభిజిత్.. చికిత్సకు స్పందిస్తున్నారని తెలిపారు. ‘నాన్న చికిత్స పొందుతున్న హాస్పిటల్‌కు శనివారం వెళ్లి ఆయనను చూశాను.. ‘దేవుడి దయ, అందరి ప్రార్ధనలతో పరిస్థితి మెరుగుపడింది.. ఇంతకు ముందుకంటే స్థిరంగా ఉన్నారు.. చికిత్సకు ప్రతిస్పందిస్తున్నారు! త్వరలోనే మన మధ్య తిరిగి వస్తాడని మేము గట్టిగా నమ్ముతున్నాం. ధన్యవాదాలు’ అని ట్విట్టర్‌లో పేర్కొన్నారు. ‘క్లిష్టమైన వైద్య పరిభాషలో కాకుండా, నాకు అర్థమైనదేమంటే గత రెండురోజులుగా మా నాన్నగారి ఆరోగ్య పరిస్థితి క్లిష్టంగానే ఉన్నప్పటికీ.. అది మరింత దిగజారలేదు. వెలుతురుకు ఆయన కళ్లు కొద్దిగా ప్రతిస్పందిస్తున్నాయి.’అని మూడు రోజుల కిందట శర్మిష్ఠా ట్వీట్ చేశారు. మెదడులో రక్తం గడ్డకట్టడంతో ఈనెల 10న ఆసుపత్రిలో చేరిన ప్రణబ్‌కు సోమవారం శస్త్రచికిత్స చేశారు. అయితే మంగళవారం ఆయన ఆరోగ్య పరిస్థితి విషమించింది. ప్రణబ్‌ కొవిడ్‌-19తో కూడా బాధపడుతున్నట్టు పరీక్షల్లో తేలింది. గురువారం కూడా ఆయన అపస్మారక స్థితిలోనే ఉన్నట్టు తెలియవచ్చింది. అయితే ప్రణబ్‌ ఆరోగ్యంపై వస్తున్న వివిధ పుకార్లను కుమారుడు అభిజిత్‌, శర్మిష్ఠ ఖండించారు. బుధవారం రాత్రి ప్రణబ్ ముఖర్జీ కన్నుమూశారంటూ ప్రముఖ జర్నలిస్టు రాజ్‌దీప్ సర్దేశాయ్.. ఓ ట్వీట్ పెట్టారు. వాస్తవానికి ప్రణబ్ ముఖర్జీ చనిపోలేదు. కానీ పొరపాటున తనకు వచ్చిన సమాచారాన్ని రాజ్‌దీప్ సర్దేశాయ్ ట్వీట్ ద్వారా పంచుకున్నారు.


By August 16, 2020 at 01:59PM


Read More https://telugu.samayam.com/latest-news/india-news/farmer-president-pranab-mukherjees-condition-much-better-stable-says-son-abhijit-mukherjee/articleshow/77572072.cms

No comments