అదే కొంపం ముంచింది.. రెండేళ్లలోపే కరోనాకు అంతం: డబ్ల్యూహెచ్ఓ కీలక వ్యాఖ్యలు

చైనాలో గతేడాది డిసెంబరు చివరిలో వెలుగుచూసిన కొత్తరకం ప్రాణాంతక కరోనా వైరస్.. ప్రపంచం మొత్తం వ్యాపించింది. ఈ మహమ్మారికి ఎప్పుడు? ఎలా? అంతమవుతోందోనని ఆందోళన చెందుతున్నారు. ఈ నేపథ్యంలో మహమ్మారి నుంచి ప్రపంచం రెండేళ్లలోపు విముక్తి పొందుతుందని ప్రపంచ ఆరోగ్య సంస్థ ఆశాభావం వ్యక్తం చేసింది. ఇది స్పానిష్ ఫ్లూ కంటే వేగంగా అంతమయ్యే సూచనలు ఉన్నాయని శుక్రవారం వ్యాఖ్యానించింది. ఈ మహమ్మారి రెండేళ్లలోపు అంతమవుతుందని ఆశిస్తున్నట్టు డైరెక్టర్ జనరల్ అన్నారు. జెనివాలోని డబ్ల్యూహెచ్ఓ ప్రధాన కార్యాలయంలో ఆయన మాట్లాడుతూ.. కొత్తరకం కరోనా వైరస్ 1918లో విజృంభించిన స్పానిష్ ఫ్లూ మహమ్మారి కంటే వేగంగా అవగాహన చేసుకోవడం సాధ్యమని అన్నారు. నాటి పరిస్థితులతో పోలిస్తే, ఈ రోజున ‘ప్రపంచీకరణ, సాన్నిహిత్యం, అనుసంధానం’ కారణంగా ప్రపంచానికి ప్రతికూలంగా మారిందని, దీని వల్ల కరోనా వైరస్ మెరుపు వేగంతో వ్యాపించడానికి వీలు కల్పించిందని టెడ్రోస్ పేర్కొన్నారు. కానీ, ప్రపంచం ఇప్పుడు చాలా మెరుగైన సాంకేతిక పరిజ్ఞానం ప్రయోజనాన్ని కలిగి ఉందన్నారు. అందుబాటులో ఉన్న సాధనాలను గరిష్ఠంగా ఉపయోగించడం, వ్యాక్సిన్లు వంటి అదనపు సాధనాలు అందుబాటులోకి వస్తే 1918 ఫ్లూ కంటే తక్కువ సమయంలో దాన్ని పూర్తిగా పారద్రోలగలమని భావిస్తున్నాను’ అని పేర్కొన్నారు. ప్రపంచవ్యాప్తంగా కరోనా వైరస్ బాధితుల సంఖ్య 2.30 కోట్లకు చేరుకోగా.. 8 లక్షల మంది ప్రాణాలు కోల్పోయారు. కానీ, ప్రపంచ చరిత్రలోనే అత్యంత ప్రమాదకరమైన మహమ్మారిగా స్పానిష్ ఫ్లూ నిలిచింది. 50 కోట్ల మంది ఈ వైరస్ బారినపడగా.. ఐదు కోట్ల మంది చనిపోయారు. మొదటి ప్రపంచ యుద్ధంలో ప్రాణాలు కోల్పోయినవారి కంటే ఇది ఐదు రెట్లు ఎక్కువ. మహమ్మారి ఐరోపాలో వ్యాపించడానికి ముందు అమెరికాలోనే తొలి బాధితులను గుర్తించారు. మూడు దశల్లో మహమ్మారి విజృంభించింది.
By August 22, 2020 at 08:34AM
No comments