మన దేశంలో 26 శాతం మందికి కరోనా: ప్రయివేట్ ల్యాబ్ అధ్యయనం

మన దేశంలో ప్రతి నలుగురిలో ఒకరు కరోనా బారిన పడి ఉంటారని ఓ ప్రయివేట్ ల్యాబ్ అంచనా వేస్తోంది. ఇప్పటి వరకూ చేసిన కరోనా పరీక్షల్లో 28 లక్షల మందికి కోవిడ్ నిర్ధారణ కాగా.. కరోనా సోకిన వారి సంఖ్య అంతకంటే చాలా ఎక్కువని అధ్యయనం వెల్లడించింది. దేశవ్యాప్తంగా 2.7 లక్షల యాంటీబాడీలను విశ్లేషించిన థైరోకేర్.. 26 శాతం మందిలో యాంటీబాడీలను గుర్తించినట్లు స్పష్టం చేసింది. ఇన్ఫెక్షన్ బారిన పడి కోలుకున్నవారిలోనే యాంటీ బాడీలు ఉంటాయనే సంగతి తెలిసిందే. మేం అంచనా వేసిన దాని కంటే ఎక్కువ మందిలో యాంటీ బాడీలు కనిపించాయని డాక్టర్ ఎ. వేలుమణి తెలిపారు. చిన్నారులు సహా అన్ని వయసుల వారిలోనూ యాంటీబాడీలు ఉన్నాయని ఆయన చెప్పారు. ముంబై నగరంలోని మురికి వాడల్లో 57 శాతం మందికి కరోనా సోకి తగ్గిపోయిందని ప్రభుత్వ సర్వేలో తేలిన సంగతి తెలిసిందే. దేశంలోని 600 పట్టణాల్లో గత ఏడు వారాలపాటు థైరోకేర్ సర్వే చేపట్టిందని వేలుమణి తెలిపారు. ఇదే ట్రెండ్ కొనసాగితే డిసెంబర్ చివరి నాటికి మన దేశంలో 40 శాతం మందిలో యాంటీబాడీలు ఉంటాయన్నారు. హైదరాబాద్ నగరంలో 6.6 లక్షల మందికి కరోనా వచ్చి పోయిందని సీసీఎంబీ - సీఎస్ఐఆర్ సంయుక్త అధ్యయనంలో తేలింది. విజయవాడలోనూ 40 శాతం మందికిపైగా కోవిడ్ బారిన పడ్డారని సిరో సర్వైలెన్స్లో తేలింది.
By August 20, 2020 at 10:10AM
No comments