Breaking News

దేశంలో కోవిడ్-19 విజృంభణకు కారణం ఇదే.. కీలక విషయం వెల్లడించిన ఐసీఎంఆర్


దేశంలో మహమ్మారి మరింత ఉద్ధృతమవుతోంది. రోజు రోజుకూ పాజిటివ్ కేసులు రికార్డుస్థాయిలో నమోదవుతున్నాయి. ప్రస్తుతం దేశంలో కోవిడ్ బాధితుల సంఖ్య 32.32 లక్షలు దాటింది. కరోనా కారణంగా 59,616 మంది మృతి చెందారు. అయితే, దేశంలో కరోనా ఇంతగా వ్యాప్తికి కొన్ని ప్రధాన కారణాలు ఉన్నాయని ఇండియన్ కౌన్సిల్ ఆఫ్ మెడికల్ రీసెర్చ్ () డైరెక్టర్ జనరల్ బలరాం భార్గవ తెలిపారు. బాధ్యతా రహితమైన వ్యక్తులు, మాస్కులు ధరించక‌పోవ‌డం, సామాజిక దూరం విస్మ‌రించ‌డం కార‌ణంగా దేశంలో కరోనా వైరస్ మహమ్మారి విస్త‌రిస్తోంద‌ని ఆయన వ్యాఖ్యానించారు. రెండో దశ జాతీయ సెరో సర్వేను ఐసీఎంఆర్ ప్రారంభించిందని, ఇది సెప్టెంబర్ మొదటి వారానికి పూర్తవుతుందని భార్గవ తెలిపారు. యువకులు, వృద్ధులు నిర్ల‌క్ష్యంగా వ్య‌వ‌హ‌రిస్తున్నార‌ని ఖ‌చ్చితంగా చెప్ప‌లేకపోయిన‌ప్ప‌టికీ బాధ్యతా రహితంగా ఉన్న‌వారు, అవగాహన లేనివారు మాస్కులు ధరించడం లేదని, సామాజిక దూరాన్ని పాటించ‌డంలేద‌ని వివరించారు. జాతీయ సెరో సర్వే నివేదికను రెండుసార్లు సమీక్షించామని, ఈ వారం తరువాత ఇండియన్ జర్నల్ ఆఫ్ మెడికల్ రీసెర్చ్‌లో ప్రచురించే అవకాశాలున్నాయ‌ని ఆయన అన్నారు. కోవిడ్-19 వ్యాక్సిన్ అభివృద్ధి శరవేగంగా సాగుతోందని తెలిపారు. ఆక్స్‌ఫర్డ్ యూనివర్సిటీ వ్యాక్సిన్‌ మూడో దశ క్లినికల్ ట్రయల్స్ భారత్‌లో సీరమ్ ఇన్‌స్టిట్యూట్ ప్రారంభించిందన్నారు. అలాగే, భారత్ బయోటెక్, జయడస్ కాడిలా తొలి దశ ప్రయోగాలు ముగిశాయని పేర్కొన్నారు. అంతేకాదు, రష్యా అభివృద్ధి చేసిన స్పుత్నిక్-వి వ్యాక్సిన్ విషయమై సంప్రదింపులు జరుపుతున్నట్టు వివరిచారు. ఇప్పటికే టీకాకు సంబంధించి రష్యా నుంచి ప్రాథమిక సమాచారం అందిందన్నారు. కరోనా వైరస్ వ్యాప్తికి అడ్డుకట్టవేయాలంటే టెస్టింగ్ వేగవంతం చేయాల్సిన అవసరం ఉందన్నారు. ఫేజ్-1లో పెద్ద నగరాలకే వైరస్ పరిమితమయ్యిందని, రెండో దశలో జిల్లా స్థాయికి వైరస్ చేరిందని, మూడో దశలో గ్రామీణ ప్రాంతాలకు విస్తరించినట్టు తెలిపారు. దేశంలో టెస్టింగ్ సామర్థ్యం పెరిగిందని అన్నారు.


By August 26, 2020 at 09:36AM


Read More https://telugu.samayam.com/latest-news/india-news/coronavirus-spread-in-india-due-to-irresponsible-people-not-wearing-masks-says-icmr-director/articleshow/77755550.cms

No comments