Breaking News

ప్రజా రాష్ట్రపతి డాక్టర్ అబ్దుల్ కలాం‌కి సలాం.. నేడు మిస్సైల్ మ్యాన్ ఐదో వర్దంతి


శాస్త్ర సాంకేతిక పరిశోధకునిగా, ప్రజా రాష్ట్రపతిగా, విద్యార్థులకు మార్గనిర్దేశకునిగా, రచయితగా అసమాన ప్రతిభా పాటవాలు చూపిన మహోన్నత వ్యక్తి డాక్టర్ ఆవుల్ ఫకీర్ జైనలుబ్దీన్ అబ్దుల్ కలాం. మనందరికి ఏపీజే అబ్దుల్ కలాంగా సుపరిచితం. ‘మిస్సైల్ మ్యాన్’గా గుర్తింపు పొంది భారతదేశ సాంకేతిక సామర్థ్యాన్ని ప్రపంచానికి చాటి చెప్పిన అసామాన్య ప్రజ్ఞాశాలి. రామేశ్వరం నుంచి రాష్ట్రపతి భవన్ వరకు.. పేపర్ బాయ్ నుంచి ప్రెసిడెంట్ వరకు సాగిన ఆయన జీవన ప్రస్థానం మనందరికీ స్ఫూర్తిదాయకం. ఎంత ఎదిగినా ఒదిగి ఉండాలనే ఆయన స్వభావం ఎందరికో మార్గనిర్దేశం. ‘కలలు కనండి.. వాటిని సాకారం చేసుకోండి’ అని కలాం చెప్పిన మంచి మాట యువతలో ఆత్మవిశ్వాసం నింపుతుంది. శాస్త్రవేత్తగా జీవితాన్ని ప్రారంభించిన కలాం తర్వాత అంతరిక్ష పరిశోధనల్లో భారత్‌కు ఎన్నో విజయాలు అందించారు. అగ్ని, పృథ్వీ వంటి ఎన్నో క్షిపణులు ఆయన ఆధ్వర్యంలోనే నింగిలోకి దూసుకెళ్లాయి. బాలిస్టిక్ క్షిపణుల అభివృద్ధికి ఏర్పాటైన ప్రాజెక్ట్ డెవిల్ అండ్ ప్రాజెక్ట్ వాలియెంట్ (VALIAN)కు కలాం డైరెక్టర్‌గా పనిచేశారు. జులై 1992 నుంచి డిసెంబర్ 1999 వరకు ప్రధాన మంత్రి శాస్త్రీయ సలహాదారుగా పనిచేశారు. రక్షణ పరిశోధన అభివృద్ధి సంస్థ ముఖ్యకార్యదర్శిగానూ సేవలందించారు. పోఖ్రాన్ అణు పరీక్షల్లో కీలక పాత్ర పోషించారు. భారత 11వ రాష్ట్రపతిగా పనిచేసిన కలాం.. ‘పీపుల్స్ ప్రెసిడెంట్’గా ఖ్యాతి గడించారు. నిరాడంబర జీవితం గడిపి రాష్ట్రపతి పదవికే ఆయన వన్నె తెచ్చారు. రాజకీయాల నేపథ్యంలో రెండోసారి రాష్ట్రపతి పదవి చేపట్టడానికి ఆసక్తి చూపని కలాం.. పదవీకాలం ముగిసిన అనంతరం విద్యార్థి లోకానికి అత్యంత చేరువయ్యారు. దేశ, విదేశాల్లో ఎన్నో యూనివర్సిటీల్లో తన ఉపన్యాసాలతో విద్యార్థులను ఉత్తేజపరిచారు. 2015 జులై 27 మేఘాలయ రాజధాని షిల్లాంగ్‌లో ఐఐఎం విద్యార్థులకు పాఠం చెబుతూ కుప్పకూలిపోయారు. ఎవరికీ అందనంత దూరానికి వెళ్లిపోయారు. ఈ నిరంతర కృషీవలుణ్ని దేశ అత్యుత్తమ పురస్కారం ‘భారతరత్న’ సహా ఎన్నో జాతీయ, అంతర్జాతీయ అవార్డులు వరించాయి. ఐక్యరాజ్య సమితి సైతం కలాం జన్మదినోత్సవాన్ని అంతర్జాతీయ విద్యార్థి దినోత్సవంగా ప్రకటించి ఆయన్ని గౌరవించింది. అలాంటి మహోన్నత వ్యక్తి జన్మించిన ఈ గడ్డపై పుట్టడం మనందరికి గర్వకారణం. తిరిగిరాని లోకాలకు వెళ్లినా ఈ మహోన్నత వ్యక్తి సేవల్ని భారత జాతి ఎన్నటికీ మరిచిపోలేదు. ఓ మధ్యతరగతి కుటుంబంలో జన్మించి.. నిరంతర శ్రమతో ఉన్నత శిఖరాలు అధిరోహించిన ఆయన జీవిత ప్రస్థానం నిజంగా అద్భుతం. దేశం కోసం బ్రహ్మచారిగా ఉండిపోయిన ఆయన.. అనితర సాధ్యమైన విజయాలను తన ఖాతాలో వేసుకున్నారు.


By July 27, 2020 at 10:29AM


Read More https://telugu.samayam.com/latest-news/india-news/people-president-of-india-dr-apj-abdul-kalam-5th-death-anniversary/articleshow/77191013.cms

No comments