Breaking News

తమిళనాడు: ఘోర రోడ్డు ప్రమాదం.. ఒకే కుటుంబానికి చెందిన ఆరుగురు మృతి


తమిళనాడులో గురువారం తెల్లవారుజామున ఘోర రోడ్డు ప్రమాదం సంభవించింది. ఈ ప్రమాదంలో ఆరుగురు మృతిచెందగా.. మరో ఇద్దరు తీవ్రంగా గాయపడ్డారు. విల్లుపురం సమీపంలోని తిండివనం దగ్గర ఈ ప్రమాదం చోటుచేసుకుంది. బాధితులు ప్రయాణిస్తున్న వాహనం గుంతలోకి దూసుకెళ్లింది. దీంతో కారులోని ఆరుగురు ప్రాణాలు కోల్పోగా.. ఇద్దరు చిన్నారులు గాయపడ్డారు. మృతులు తిరునాల్వేలి జిల్లా థిసనాయ్‌విలయ్‌కు చెందిన ఓ కుటుంబానికి చెందినవారు. మృతులు మురుగేష్ (40), మరుగురాజ్ (38), సోరి మురుగన్ (35), మలార్ (30), రాజీ, ముత్తు మనీషాగా గుర్తించారు. పోలీసులు తెలిపిన వివరాల ప్రకారం.. గురువారం ఉదయం 6.00 గంటల ప్రాంతంలో ఈ ప్రమాదం జరిగింది. వీరంతా కన్యాకుమారి నుంచి చెన్నైకు వెళ్తున్నట్టు పేర్కొన్నారు. తిండివనం-చెన్నై జాతీయ రహదారిపై పదిరి వద్దకు చేరుకునేసరికి అదుపుతప్పి పక్కనే ఉన్న గుంతలోకి దూసుకెళ్లింది. ఆ సమయంలో మృతుడు రాజీ వాహనం నడుపుతున్నట్టు తెలిపారు. ఆరుగురు ఘటనా స్థలిలో మృతిచెందారని, చిన్నారులు ముత్తు హరీశ్ (6), ముత్తు మనీషా (8) తీవ్రంగా గాయపడినట్టు పోలీసులు పేర్కొన్నారు. ఈ చిన్నారులను చికిత్స కోసం విల్లుపురం మెడికల్ కాలేజ్ హాస్పిటల్‌కు తరలించారు. ఘటనపై కేసు నమోదుచేసిన పోలీసులు.. దర్యాప్తు చేపట్టారు. అతివేగంతోపాటు నిద్రమత్తు ప్రమాదానికి కారణమని ప్రాథమికంగా నిర్ధారించారు. ప్రమాదం గురించి బంధువులకు సమాచారం అందజేసినట్టు తెలిపారు. మృతదేహాలను స్వాధీనం చేసుకున్న పోలీసులు.. పోస్ట్‌మార్టం కోసం తరలించారు.


By July 16, 2020 at 10:06AM


Read More https://telugu.samayam.com/latest-news/india-news/six-of-family-killed-in-car-accident-in-villupuram-in-tamil-nadu/articleshow/76992227.cms

No comments