Breaking News

చైనా జిత్తులమారి ఎత్తులు.. కీలక ప్రాజెక్టు నుంచి భారత్‌ను తప్పించిన ఇరాన్!


చైనాతో 400 బిలియన్ డాలర్ల భారీ ఒప్పందం కుదుర్చుకోబోతున్న వేళ.. నుంచి మన దేశాన్ని తప్పిస్తూ ప్రభుత్వం నిర్ణయం తీసుకుంది. అమెరికా ఆంక్షలతో తీవ్ర ఆర్థిక సంక్షోభంలో కూరుకుపోయిన ఇరాన్‌కు పెట్టుబడుల ఎర వేసిన డ్రాగన్.. ఆ దేశాన్ని పూర్తిగా తన వైపు తిప్పుకుంది. ఫలితంగా మన దేశ ప్రయోజనాలకు విఘాతం ఏర్పడే పరిస్థితి తలెత్తింది. చాబర్ పోర్టు నుంచి అప్ఘానిస్థాన్ సరిహద్దుల వెంబడి జహేదాన్ వరకు నిర్మించనున్న రైలు మార్గం పనుల నుంచి భారత్‌ను తప్పిస్తూ ఇరాన్ నిర్ణయం తీసుకుంది. ఒప్పందం జరిగి నాలుగేళ్లు గడుస్తోన్నా ప్రాజెక్టు ప్రారంభానికి భారత్ నిధులు ఇవ్వడం లేదని.. దీంతో ఈ రైలు మార్గాన్ని తామే సొంతంగా నిర్మించుకుంటామని ఇరాన్ ప్రకటించింది. మార్చి 2022 నాటికి ఈ ప్రాజెక్టును పూర్తి చేయాలని లక్ష్యంగా పెట్టుకున్నారు. భారత్ సహకారం లేకుండానే ఇరాన్ రైల్వేస్ ఈ ప్రాజెక్టును చేపడతాయని.. దాదాపు 400 మిలియన్ డాలర్లను ఇరానియన్ నేషనల్ డెవలప్‌మెంట్ ఫండ్ నుంచి కేటాయిస్తారని సమాచారం. ఓవైపు అమెరికా ఆర్థిక ఆంక్షలతో తీవ్రంగా సతమతం అవుతోన్న ఇరాన్‌ను తనవైపు తిప్పుకోవడానికి చైనా 25 ఏళ్లపాటు అమల్లో ఉండేలా 400 బిలియన్ డాలర్ల ఆర్థిక, భద్రతాపరమైన ఒప్పందాన్ని కుదుర్చుకుంది. ఈ ఒప్పందం ప్రకారం ఇరాన్‌లోని బ్యాంకింగ్, టెలీకమ్యూనికేషన్లు, నౌకాశ్రయాలు, రైల్వేలు, ఇతర ప్రాజెక్టుల్లో చైనా పెట్టుబడులు పెడుతుంది. బదులుగా చైనాకు ఇరాన్ తక్కువ ధరకే 25 ఏళ్లపాటు ఇంధనాన్ని నిరంతరం సరఫరా చేస్తుంది. సైనిక సహకారాన్ని కూడా ఈ ప్రతిపాదిత ఒప్పందంలో పేర్కొన్నారు. దీని వల్ల ఈ ప్రాంతంలో చైనా బలగాలను మోహరించడానికి వీలు పడుతుంది. చైనా ఇరాన్ ఒప్పందం వల్ల ఈ ప్రాంతంలో భారత ప్రయోజనాలకు విఘాతం ఏర్పడుతుంది. 2016లో ప్రధాని మోదీ టెహ్రాన్ పర్యటన సందర్భంగా చాబర్ ఒప్పందం కుదిరింది. ఇరాన్ అధ్యక్షుడు రౌహనీతోపాటు అప్ఘానిస్థాన్ అధ్యక్షుడు ఘనీ కూడా ఈ ఒప్పందంపై సంతకాలు చేశారు. అప్ఘానిస్థాన్, మధ్య ఆసియాకు ప్రత్యామ్నాయ వాణిజ్య మార్గాన్ని రూపొందించడం కోసం ముఖ్యంగా పాకిస్థాన్‌ను తప్పించడం కోసం భారత్ ఈ త్రైపాక్షిక ఒప్పందాన్ని కుదుర్చుకుంది. ఈ ప్రాజెక్టు కోసం 1.6 బిలియన్ డాలర్ల నిధులతోపాటు భారతీయ రైల్వే నిర్మాణ సంస్థ అనని రకాల సేవలను అందిస్తుందని భారత్ హామీ ఇచ్చింది. భారత ఇంజినీర్లు పలుసార్లు ఇరాన్‌లో పర్యటించారు కానీ.. ఇరాన్‌పై అమెరికా ఆంక్షలు విధించడంతో భారత్ రైల్వే లేన్‌కు సంబంధించిన పనులను ప్రారంభించలేదు.


By July 14, 2020 at 10:38AM


Read More https://telugu.samayam.com/latest-news/international-news/iran-drops-india-from-chabahar-rail-project-as-it-nears-400-billion-deal-with-china/articleshow/76952930.cms

No comments