Breaking News

పాాక్‌కు మరో షాక్.. తాలిబన్ నేతను అంతర్జాతీయ ఉగ్రవాదిగా గుర్తించిన ఐరాస


పాకిస్థాన్‌కు చెందిన మరో తీవ్రవాద సంస్థ నేత అంతర్జాతీయ ఉగ్రవాదిగా పేర్కొంటూ ఐక్యరాజ్యసమితి ఆంక్షలు విధించింది. తెహ్రీక్-ఇ-తాలిబన్ పాకిస్థాన్ నేత ముఫ్తీ నూర్ వాలీ మెహసూద్‌ను అంతర్జాతీయ ఉగ్రవాదిగా పేర్కొంటూ ఆంక్షల కమిటీ తీర్మానాన్ని ఆమోదించింది. తీర్మానం 2368(2017)లో 2, 4 పేరాల్లో అల్-ఖైదాతో అనుబంధ సంస్థ తరపున లేదా మద్దతుతో ఉగ్రవాదులకు నిధులు, ప్రణాళిక, సౌకర్యాలు, కార్యకలాపాలకు పాల్పడినట్టు పేర్కొంది. ఐరాస భద్రతా మండలి నిర్ణయాన్ని అమెరికా స్వాగతించింది. గతేడాది లష్కరే తొయిబా చీఫ్ మసూర్ అజార్‌ను అంతర్జాతీయ ఉగ్రవాదిగా ఐరాస గుర్తించింది. ‘తెహ్రీక్ ఇ తాలిబన్ పాకిస్థాన్ నేత నూర్ వాలీ మెహసూద్‌ను అంతర్జాతీయ ఉగ్రవాదిగా గుర్తించడాన్ని స్వాగతిస్తున్నాం.. పాకిస్థాన్‌లో అనేక భయంకర ఉగ్రదాడుల వెనుక టీటీపీ హస్తం ఉంది.. నూర్ వలీని ఉగ్రవాదిగా పేర్కొంటూ 2019 సెప్టెంబరులోనే తాము నిషేధించాం’ అని అమెరికా జాతీయ భద్రతా సలహాదారు ట్వీట్ చేశారు. పాక్ తాలిబన్‌గా గుర్తింపు పొందిన టీటీపీ.. పలు ఆత్మాహుతి దాడులకు పాల్పడి వందలాది మంది మరణానికి కారణమయ్యింది. టీటీపీని ఇంతకు ముందు డిపార్ట్‌మెంట్ ఆఫ్ స్టేట్.. ప్రత్యేక అంతర్జాతీయ ఉగ్రవాదిగా గుర్తించింది. టీటీపీ నేత ముల్లాహ్ ఫజల్లూహ్ చనిపోయిన తర్వాత 2018 జూన్‌లో అతడి స్థానంలో ముఫ్తీ నూర్ వలీ మోహసూద్ బాధ్యతలు చేపట్టాడు. నూర్ వలీ నాయకత్వంలో అనేక ఉగ్రదాడులు పాకిస్థాన్‌లో జరిగినట్టు అమెరికా నివేదిక తెలిపింది. ఐరాస తాజా నిర్ణయంతో ఉగ్రవాదులకు పాకిస్థాన్ స్వర్గంగా మారిందని అంతర్జాతీయ సమాజం పదే పదే హెచ్చరికలు ఎదుర్కొంటున్న పాక్‌కు మరో ఎదురుదెబ్బ. ఇప్పటికే లష్కరే తొయిబా, జైషే మొహమూద్ లాంటి ఉగ్రవాద సంస్థలకు కొమ్ముకాస్తోన్న పాకిస్థాన్.. వారికి నిధులు కూడా సమకూర్చినట్టు తేలడంతో ఎఫ్ఏటీఎఫ్ గ్రే లిస్ట్‌లో కొనసాగుతోంది.


By July 17, 2020 at 07:57AM


Read More https://telugu.samayam.com/latest-news/international-news/un-designates-tehrik-e-taliban-pakistan-leader-noor-mehsud-as-global-terrorist/articleshow/77010507.cms

No comments