Breaking News

జీవీకే గ్రూప్‌పై సీబీఐ కేసు.. వందల కోట్లలో నిధుల దుర్వినియోగం!


జీవీకే గ్రూప్‌పై కేసు నమోదైంది. చైర్మన్ గునుపాటి వెంకట కృష్ణారెడ్డి, ఆయన కుమారుడు, ముంబై ఎయిర్‌పోర్ట్ ఇంటర్నేషనల్ లిమిటెడ్ ఎండీ అయిన జీవీ సంజయ్ రెడ్డి తదితరులపై సీబీఐ చీటింగ్ కేసు నమోదు చేసింది. 2012-18 మధ్య కాలంలో తప్పుడు మార్గంలో రూ.705 కోట్లు ఆర్జించారనే కారణంతో సీబీఐ కేసు నమోదు చేసింది. ఎయిర్‌పోర్ట్ అథారిటీ ఆఫ్ ఇండియాకు చెందిన కొందరు అధికారుల సహకారంతో ప్రమోటర్లు మోసానికి పాల్పడ్డారని సీబీఐ తెలిపింది. ముంబై ఎయిర్‌పోర్ట్‌ను అభివృద్ధి చేసే క్రమంలో బోగస్ వర్క్ కాంట్రాక్టులు, రిజర్వ్ ఫండ్‌ను దుర్వినియోగం చేయడం, ఖర్చు అంచనాలను పెంచడం ద్వారా నిధులను విత్‌డ్రా చేశారని సీబీఐ స్పష్టం చేసింది. ముంబై ఇంటర్నేషనల్ ఎయిర్‌పోర్ట్ లిమిటెడ్ (ఎంఐఏఎల్) అనేది ఎయిర్‌పోర్ట్స్ అథారిటీ ఆఫ్ ఇండియా (ఏఏఐ), జీవీకే, ఇతర విదేశీ సంస్థల జాయింట్ వెంచర్. ఇందులో జీవీకే ఎయిర్‌పోర్ట్ హోల్డింగ్స్‌‌కు 50.5 శాతం వాటా ఉండగా... ఎయిర్‌పోర్ట్ అథారిటీకి 26 శాతం వాటా ఉంది. ఎయిర్‌పోర్ట్ ఆధునికీకరణ, నిర్వహణ కోసం 2006లో జీవీకేతో ఏఏఐ ఒప్పందం చేసకుంది. దీన్నే ఎంఐఏఎల్‌గా పిలుస్తున్నారు. ఎయిర్‌పోర్ట్ సమీపంలోని 200 ఎకరాల ఏఏఐ భూముల అభివృద్ధి కోసం ఎంఐఏఎల్ రూ.200 కోట్ల బోగస్ వర్క్ కాంట్రాక్టులు ఇచ్చినట్లు చూపించింది. ఫలితంగా రూ.305 కోట్ల నిధులను మళ్లించింది. నేరపూరిత ఉద్దేశాలతో ప్రమోటర్లు ఎంఐఏఎల్‌కు చెందిన రూ.395 కోట్ల మిగులు నిధులను దుర్వినియోగం చేశారని ఎఫ్ఐఆర్‌లో పేర్కొన్నారు. ఎంఐఏఎల్ బోర్డు సమావేశాల తీర్మానాలను సృష్టించిన నిందితులు ఆ నిధులను జీవీకే ప్రధాన కార్యాలయం ఉన్న హైదరాబాద్‌లోని బ్యాంకుల్లో డిపాజిట్ చేశారని ఎఫ్ఐఆర్‌లో పేర్కొన్నారు. ఆ డిపాజిట్లపై జీవీకే గ్రూప్ సంస్థలు రుణాలు, ఓవర్ డ్రాఫ్ తీసుకున్నాయని కూడా సీబీఐ ఆరోపించింది. ఎంఐఏఎల్‌తో సంబంధం లేని ఉద్యోగులకు కూడా జీతాలు చెల్లించాలరని.. దీని వల్ల ఏఏఐకి నష్టం వాటిల్లిందని సీబీఐ తెలిపింది. జీవీకే గ్రూప్‌కి చెందిన కుటుంబ సభ్యులు, బంధువులు, ఉద్యోగులకు ఆర్థిక ప్రయోజనాలు కలిగేలా గ్రూప్ ఉదాసీనంగా వ్యవహరించిందని.. ఫలితంగా ఏఏఐకి నష్టం చేకూరిందని సీబీఐ తెలిపింది. ఎయిర్‌పోర్టులోని ప్రీమియం రిటైల్ ఏరియాలను కుటుంబ సభ్యులకు తక్కువ ధరకే కట్టబెట్టిందని.. ఫలితంగా అద్దెలు, అమ్మకాల రూపంలో ఎంఐఏఎల్‌కు సమకూరాల్సిన ఆదాయంపై తగ్గిందని సీబీఐ తెలిపింది. కుటుంబ సభ్యులు, బంధువులు, ఉద్యోగులకు రైలు, విమాన టికెట్లు బుక్ చేయడానికి తమతోపాటు ఎంఐఏఎల్‌తో ఏమాత్రం సంబంధం లేని వ్యక్తులకు హోటల్ రూమ్‌లు బుక్ చేయడానికి ఎంఐఏఎల్ నిధులను జీవీకే గ్రూప్ వాడిందని ఎఫ్ఐఆర్‌లో సీబీఐ పేర్కొంది.


By July 02, 2020 at 08:17AM


Read More https://telugu.samayam.com/latest-news/india-news/cbi-files-case-against-gvk-group-in-mumbai/articleshow/76741139.cms

No comments