Breaking News

వైద్యో నారాయణ హరి.. జాతీయ వైద్యుల దినోత్సవం


ప్రపంచాన్ని అతలాకుతలం చేస్తున్న కరోనా వైరస్‌పై వైద్యులే ముందుండి పోరాటం చేస్తున్నారు. తమ ప్రాణాలను ఫణంగా పెట్టి లక్షలాది మంది ప్రాణాలను కాపాడుతున్నారు. సమస్త ప్రాణకోటిని కాపాడే ఆ భగవంతుడిని సైతం మహమ్మారి కొన్నాళ్లు భక్తులకు దూరం చేసినా.. తమ ప్రాణాలను అడ్డుగా పెట్టి అనారోగ్యం పాలవుతామని తెలిసినా ప్రజలకు వైద్యం అందించి కాపాడుతున్నారు. పీపీఈ కిట్లతో ఒళ్లంతా ఉక్కిపోతున్నా.. మాస్క్‌లతో ముఖం కమిలిపోతున్నా.. శానిటైజర్లతో చేతులు ఒరిసిపోతున్నా.. తమ వృత్తిపట్ల అంకితభావంతో కరోనా రోగులకు వైద్యం అందించి చిరునవ్వుతో ఇంటికి పంపుతున్నారు. ‘వైద్యో నారాయణో హరి’ అన్నది భారతీయ సంస్కృతి. ప్రాణం పోసేది బ్రహ్మ అయితే.. పునర్జన్మ నిచ్చేది వైద్యులు.. అందు వైద్యో నారాయణ హరి అంటారు. వైద్యు డు దేవుడితో సమానం. కనిపెంచిన తల్లిదండ్రులు, విద్యాబుద్ధులు నేర్పించే గురువు తర్వాత దేవుడిగా భావించేది వైద్యుడినే. ప్రపంచాన్నే తన గుప్పిట బంధించి మానవాళి మనుగడకే పెనుసవాల్‌ విసురుతోంది కరోనా వైరస్‌. ఈ మహమ్మారి నుంచి రక్షించేందుకు ఆరోగ్య యంత్రాంగం పగలు రాత్రీ తేడా లేకుండా కష్టపడుతోంది. ఈ పోరాటంలో పలువురు వైద్యులు సమిధలవుతున్నారు. రోగికి ప్రమాదకరంగా ఉంటే ఏ సమయమైనా ఆస్పత్రికి చేరుకొని చికిత్స అందించాలనే తపనతో ఉంటారు. ఇక, డాక్టర్‌ బీసీ రాయ్‌ అందించిన వైద్య సేవలను గుర్తించిన ప్రభుత్వం.. ఆయన పుట్టిన రోజైన జూలై 1వ తేదీన డాక్టర్స్‌ డేగా జరుపుకోవాలని ప్రకటించింది. పశ్చిమ్ బెంగాల్‌ రెండో ముఖ్యమంత్రిగా పనిచేసిన బీదాన్ చంద్ర రాయ్.. అనేక వైద్య సంస్థల ఏర్పాటులో కీలక పాత్ర పోషించారు. జాధవ్‌పూర్ టీబీ ఆస్పత్రి, చిత్తరంజన్ సేవా సదన్, కమలా నెహ్రూ మెమోరియల్ ఆస్పత్రి, విక్టోరియా ఇన్‌స్టిట్యూషన్, చిత్తరంజన్ క్యాన్సర్ ఆస్పత్రి, చిత్తరంజన్ సేవా సదన్ ఫర్ విమెన్ అండ్ చిల్డ్రన్ తదతర ప్రతిష్టాత్మక సంస్థలన్నీ ఆయన హయాంలో పురుడు పోసుకున్నవే. మహిళలకు సామాజిక సేవ, నర్సింగ్‌లో శిక్షణ ఇప్పించడానికి ఆయన ప్రత్యేక కేంద్రాలను ఏర్పాటు చేశారు. కలకత్తా నగరానికి మేయర్‌ (1931-33)గానూ బిధాన్ రాయ్ పనిచేశారు. స్థానిక పరిపాలనలో కీలక సంస్కరణలు తీసుకొచ్చారు. కలకత్తా యూనివర్సిటీకి వైస్ ఛాన్స్‌లర్(1942-44)‌గా, మెడికల్ కౌన్సిల్ ఆఫ్ ఇండియాకు ఛైర్మన్‌(1939)గా, ఉత్తర ప్రదేశ్ గవర్నర్‌గానూ ఆయన విశేష సేవలు అందించారు. 1882 జులై 1న జన్మించిన బిధాన్ రాయ్ 1962లో అదే రోజున (జులై 1) మరణించడం గమనార్హం. 1962 ఫిబ్రవరి 4న ఈయనకు భారతరత్న వరించింది. బీసీరాయ్ వైద్య రంగంలో అనేక సంస్కరణలు చేపట్టి 1943లో మెడికల్ కౌన్సిల్ ఆఫ్ ఇండియాకు అధ్యక్షునిగా వ్యవహరించారు. వైద్యులు లక్షణం... నిబద్ధత, త్యాగనిరతి అనే పదాలకు ఆయన నిలువెత్తు నిదర్శనం.


By July 01, 2020 at 07:21AM


Read More https://telugu.samayam.com/latest-news/india-news/history-and-importance-of-of-national-doctors-day-celebration-in-india/articleshow/76721158.cms

No comments