Breaking News

పిరమిడ్ వద్ద ధ్యానంలో టాలీవుడ్ సీనియర్ హీరో


టాలీవుడ్ ప్రముఖ నటుడు రంగారెడ్డి జిల్లాలోని మహేశ్వర మహా పిరమిడ్‌ను సందర్శించారు. కడ్తాల్ సమీపంలోని అన్మాన్‌పల్లి శివారులో ఉన్న కేంద్రానికి ధ్యాన మాస్టర్ రాజశేఖర్‌తో కలిసి ఆయన వెళ్లారు. అనంతరం అక్కడ పిరమిడ్‌లో కాసేపు ధ్యానం చేశారు. జగపతి రాక విషయం తెలిసిన అభిమానులు అక్కడికి చేరుకున్నారు. దీంతో కాసేపు పిరమిడ్ వద్ద సందడి నెలకొంది. ఇకపోతే జగపతిబాబు ప్రస్తుతం సినిమాల్లో ప్రత్యేక పాత్రల్లో కనిపిస్తున్నారు. కొన్ని చిత్రాల్లో ఆయన ప్రతినాయకుడిగా కూడా నటించి మెప్పిస్తున్నారు. ఒకప్పుడు ఫ్యామిలీ హీరోగా లేడీ ఫ్యాన్ ఫాలోయింగ్‌ను బాగానే సంపాదించుకున్నారు. జగపతి బాబు ఫిబ్రవరి 12, 1962న మచిలీపట్నంలో జన్మించాడు. మద్రాసులో పెరిగాడు. ఈయన తండ్రి జగపతి ఆర్ట్ పిక్చర్స్ బ్యానర్ అధినేత, దర్శకుడు అయిన వి. బి. రాజేంద్రప్రసాద్. 1989 లో సింహస్వప్నం సినిమా ద్వారా జగపతిబాబు తెలుగు సినిమాకు పరిచయం అయ్యాడు. ఈ సినిమాలో కృష్ణంరాజు కథానాయకుడు. తొలి సినిమాలోనే ద్విపాత్రాభినయం చేసిన మొదటి నటుడు జగపతిబాబు. పెద్దరికం సినిమాతో రాంగోపాల్ వర్మ దృష్టిలో పడ్డ జగపతి ‘గాయం’ హిట్ తో హీరోగా స్థిరపడ్డారు. 1994 లో ఎస్. వి. కృష్ణారెడ్డి దర్శకత్వంలో వచ్చిన శుభలగ్నం సినిమాతో కుటుంబ కథా చిత్రాల ప్రేక్షకులకు దగ్గరయ్యారు. ఎస్. వి. కృష్ణారెడ్డి, జగపతి బాబు కాంబినేషన్లో వచ్చిన మావిచిగురు, పెళ్ళి పీటలు మొదలైన చిత్రాలు కూడా ప్రేక్షకాదరణ పొందాయి. మావిచిగురు సినిమాతో మొట్టమొదటిసారిగా ఉత్తమ నటుడిగా నంది పురస్కారాన్ని అందుకున్నాడు. జగపతి బాబు, సౌందర్య జంట సినిమా ప్రేక్షకులను బాగా ఆకట్టుకుంది. ఇదే దారిలో దాదాపు 80 చిత్రాలలో నటించారు జగపతిబాబు.


By June 17, 2020 at 10:42AM


Read More https://telugu.samayam.com/telugu-movies/cinema-news/tollywood-senior-hero-jagapatibabu-visit-kadthal-pyramid-at-ranga-reddy/articleshow/76418287.cms

No comments