Breaking News

కశ్మీర్‌లో ఎదురుకాల్పులు.. ఇద్దరు ఉగ్రవాదులను హతమార్చిన సైన్యం


జమ్మూ కశ్మీర్‌లో జరిగిన ఎదురుకాల్పుల్లో మరో ఇద్దరు ఉగ్రవాదులు హతమయ్యారు. బుధవారం తెల్లవారుజామున షోపియాన్ జిల్లాల్లో జరిగిన ఈ ఎన్‌కౌంటర్‌లో ఇద్దరు గుర్తుతెలియని ఉగ్రవాదులు హతమైనట్టు అధికారులు వెల్లడించారు. ఆపరేషన్ ఇంకా కొనసాగుతోందని జమ్మూ కశ్మీర్ పోలీసులు తెలిపారు. షోపియాన్ జిల్లా సుగూ ప్రాంతంలో ఈ ఎన్‌కౌంటర్ చోటుచేసుకుంది. ఏ సమయంలో జరిగిందనే అంశంపై ఎలాంటి స్పష్టత లేదు. సుగూ ప్రాంతంలో ఉగ్రవాదులున్నట్టు సమాచారం అందుకున్న సైన్యం అక్కడకు చేరుకుని నిర్బంధ తనిఖీలు చేపట్టింది. ఈ సమయంలో ఉగ్రవాదులు కాల్పులు జరపడంతో వెంటనే అప్రమత్తమైన సైన్యం ఎదురుకాల్పులు ప్రారంభించింది. ఆర్మీ, సీఆర్పీఎఫ్, జమ్మూ కశ్మీర్ పోలీసులు సంయుక్తంగా ఈ ఆపరేషన్ చేపట్టినట్టు తెలుస్తోంది. ఈ ఘటనపై పూర్తి వివరాలు ఇంకా తెలియాల్సి ఉంది. మూడు రోజుల కిందట షోపియాన్ జిల్లా రెబాన్, పింజోరాలో జరిగిన వేర్వేరు ఎన్‌కౌంటర్‌లలో తొమ్మిది మంది లష్కరే తొయిబా ఉగ్రవాదులు హతమైన విషయం తెలిసిందే. కాగా, మరోసారి దాయాది సరిహద్దుల్లో కాల్పుల విరమణ ఉల్లంఘనకు పాల్పడింది. రాజౌరి జిల్లా నౌషేరా సెక్టార్ వద్ద నియంత్రణ రేఖ వెంబడి బుధవారం ఉదయం 7.30 ప్రాంతంలో పాక్ సైన్యం కాల్పులకు తెగబడింది. పాక్ రేంజర్ల చిన్న చిన్న ఆయుధాలతో కాల్పులకు పాల్పడగా.. సైన్యం వీటిని సమర్థంగా తిప్పికొట్టింది. నియంత్రణ రేఖ వెంబడి పదే పదే కాల్పులకు తెగబడుతూ.. ఉగ్రవాదుల చొరబాటుకు పాక్ సహకరిస్తోంది. ఇటీవల కాలంలో పాకిస్థాన్ మరింత రెచ్చిపోతోంది.


By June 10, 2020 at 09:16AM


Read More https://telugu.samayam.com/latest-news/india-news/two-unidentified-terrorists-have-been-killed-in-encounter-in-sugoo-area-of-shopian/articleshow/76294680.cms

No comments