Breaking News

మనిషి మరణిస్తే చెత్తబండిలో తరలింపు.. మాయ రోగం, మంటగలుస్తున్న మానవత్వం


చైనాలో పుట్టుకొచ్చిన కరోనా వైరస్ మనిషిని వణికిస్తోంది. మనిషికి మనిషిని దూరం చేస్తోంది. తుమ్మినా, దగ్గినా అనుమానంగా చూసే దుస్థితి వచ్చింది. అనారోగ్యం బారిన పడ్డారంటే ఎంత దగ్గరి వారైనా సరే అనుమానించాల్సి వస్తోంది. ఇక ఎవరైనా మరణిస్తే.. నా అనేవాళ్లు కాదు కదా, పాడె మోయడానికి ఆ నలుగురు కూడా కరువైన దీన స్థితి దేశంలో నెలకొంది. కరోనా భయం వెంటాడుతోంది. ఉత్తర ప్రదేశ్‌లోని బలరామ్‌పూర్‌లో విషాద ఘటన చోటు చేసుకుంది. రోడ్డుపై విగతజీవిగా పడి ఉన్న వ్యక్తిని కరోనాతో మరణించాడనే భయంతో మున్సిపల్‌ సిబ్బంది చెత్తను తరలించే వాహనంలో తీసుకెళ్లిపోయారు. మృతదేహాన్ని చెత్తబండిలో తీసుకెళ్తున్న దృశ్యాలను అక్కడే ఉన్న కొంత మంది తమ సెల్‌ఫోన్లలో బంధించారు. ఆ వీడియో సోషల్ మీడియాలో పోస్టు చేయడంతో వైరల్‌గా మారింది. బలరాంపూర్‌కు చెందిన మహ్మద్‌ అన్వర్‌ (42) పనినిమిత్తం స్థానిక ప్రభుత్వ కార్యాలయానికి వెళ్లాడు. ఈ క్రమంలో గేట్‌ వద్దే కుప్పకూలి మరణించాడు. మృతదేహం కిందపడి ఉండగా.. పక్కనే వాటర్‌ బాటిల్‌ ఉన్నట్లు వీడియోలో కనిపిస్తోంది. మృతదేహం వద్ద పోలీసులు కూడా కనిపిస్తున్నారు. పక్కనే అంబులెన్స్‌ కూడా అందుబాటులో ఉంది. ఇంతలో అక్కడికి చేరుకున్న మున్సిపల్‌ కార్పొరేషన్‌ సిబ్బంది చెత్తను తరలించే వాహనంలోకి మృతదేహాన్ని విసిరేసి తీసుకెళ్లారు. ఈ ఘటన అమానుషమని బలరాంపూర్‌ పోలీస్‌ చీఫ్‌ దేవరంజన్‌ వర్మ పేర్కొన్నారు. ఈ ఉదంతంపై విచారణ చేపట్టి నిందితులపై కఠిన చర్యలు తీసుకుంటామని చెప్పారు. బాధితుడు కరోనా వైరస్‌తో మరణించి ఉంటాడనే భయంతోనే మున్సిపల్‌ సిబ్బంది అలా చేసి ఉంటారని ఆయన అభిప్రాయపడ్డారు. పీపీఈ కిట్స్‌ ధరించి మృతదేహాన్ని అంబులెన్స్‌లో తరలించాల్సి ఉందని పేర్కొన్నారు. పోలీసులు, మున్సిపల్‌ సిబ్బంది తీరు సరైంది కాదని వ్యాఖ్యానించారు. అన్వర్‌ నమూనాలు సేకరించి పరీక్షలకు పంపించినట్లు అధికారులు తెలిపారు. ఆయన మరణానికి కారణమేంటి? కరోనా వైరస్‌ సోకిందా? లేదా? అనే దానిపై స్పష్టత రావాల్సి ఉందని వెల్లడించారు. Must Read: Also Read:


By June 13, 2020 at 11:59AM


Read More https://telugu.samayam.com/latest-news/india-news/on-cam-mans-dead-body-taken-in-garbage-van-in-uttar-pradesh/articleshow/76353503.cms

No comments