Breaking News

అత్యధిక కరోనా కేసులు నమోదయిన దేశాల జాబితాలో ఏడో స్థానానికి భారత్


దేశంలో కరోనా రక్కసి మరింత ఉగ్రరూపం దాలుస్తోంది. రోజు రోజుకూ రికార్డు స్థాయిలో పాజిటివ్ కేసులు నమోదవుతున్నాయి. గడచిన 24 గంటల్లో దేశవ్యాప్తంగా దాదాపు 9 వేల మందికి కొత్తగా వైరస్ నిర్ధారణ అయ్యింది. ఇందులో ఒక్క మహారాష్ట్రలోనే 2,600కుపైగా కేసులు ఉన్నాయి. ఇక, పాజిటివ్ కేసుల్లోనూ కొత్త రికార్డు నమోదయ్యింది. దేశవ్యాప్తంగా కోవిడ్-19 బాధితుల సంఖ్య 1.90 లక్షలు దాటింది. 109 రోజుల్లోనే దేశంలో కరోనా కేసుల సంఖ్య లక్ష దాటితే.. ఆ తర్వాత రెండు వారాల్లో పాజిటివ్ కేసుల సంఖ్య 190,6228కి చేరింది. దీంతో ప్రపంచంలో అత్యధిక కరోనా కేసులు నమోదయిన దేశాల జాబితాలో ఫ్రాన్స్‌ను అధిగమించి భారత్ 7వ స్థానానికి చేరింది. ఆదివారం దేశంలో కొవిడ్‌ దెబ్బకు దాదాపు 300మంది మృత్యువాతపడటంతో, మొత్తం మరణాల సంఖ్య 5,408కి పెరిగింది. గడచిన 12 రోజుల్లో కరోనాతో 2,000 మంది ప్రాణాలు కోల్పోయారు. అయితే, మిగతా దేశాలతో పోల్చితే భారత్‌లో కరోనా మరణాల రేటు 2.9గా ఉండటం కాస్త ఊరట కలిగించే అంశం. వారంలోనే 50వేల పాజిటివ్ కేసులు నమోదయ్యాయి. గత 11 రోజులుగా పాజిటివ్ కేసుల్లో రోజుకో కొత్త రికార్డు నమోదవుతోంది. ఇక, మహారాష్ట్రలో మహమ్మారి ఉద్ధృతి కొనసాగుతోంది. దేశవ్యాప్తంగా నమోదైన మొత్తం కేసుల్లో 44% ఆ ఒక్క రాష్ట్రంలో ఉన్నాయి. ఆ రాష్ట్రంలో పాజిటివ్ కేసుల సంఖ్య 67,000 మార్క్ దాటగా.. ఒక్క ముంబయి మహానగరంలోనే 39,000 మందికిపైగా వైరస్ నిర్ధారణ అయ్యింది. గత 24 గంటల్లో నమోదైన కేసుల్లో 82 శాతం.. మహారాష్ట్ర, ఢిల్లీ, తమిళనాడు, గుజరాత్‌, ఉత్తరప్రదేశ్, పశ్చిమ్ బెంగాల్, రాజస్థాన్‌, కర్ణాటకలోనే ఉన్నాయి. మహారాష్ట్రలో 2,633, ఢిల్లీ 1,295, తమిళనాడు 1,149, గుజరాత్ 438, ఉత్తరప్రదేశ్ 378, బెంగాల్ 371, కర్ణాటక 299, తెలంగాణ 199 కేసులు నమోదయ్యాయి. కరోనా కేసులు, మరణాల్లో ముంబయి నగరంలో అహ్మదాబాద్ పోటీపడుతోంది. ఇప్పటి వరకు ముంబయిలో 757 మంది ప్రాణాలు కోల్పోగా.. అహ్మదాబాద్‌లో 524 మంది చనిపోయారు. ముంబయి మరణాలతో పోలిస్తే ఇది చాలా ఎక్కువ. ముంబయిలో మరణాల రేటు 3.64 శాతంగా ఉంటే.. అక్కడ 6.95గా ఉంది. తమిళనాడులో మొత్తం కేసుల సంఖ్య 22,333కి చేరింది. అక్కడ మొత్తం 173 మంది ఇప్పటి వరకూ ప్రాణాలు కోల్పోయారు. చెన్నైలో ఆదివారం మరో 378 కొత్త కేసులు నమోదయ్యాయి. ఢిల్లీలో 19,844, గుజరాత్‌లో 16,794, రాజస్థాన్ 8,831, మధ్యప్రదేశ్ 8,081, ఉత్తరప్రదేశ్ 8,075, పశ్చిమ్ బెంగాల్ 5,501కి చేరింది.


By June 01, 2020 at 08:29AM


Read More https://telugu.samayam.com/latest-news/india-news/coronavirus-cases-ahead-of-unlocking-highest-one-day-jump-in-india/articleshow/76127954.cms

No comments