Breaking News

హైదరాబాద్: మూడేళ్ల పాప కిడ్నాప్.. సస్పెన్స్ థ్రిల్లర్‌లా సాగిన ఛేజింగ్


హైదరాబాద్‌లో మూడేళ్ల పాప కిడ్నాప్ కలకలంరేపింది. వెంటనే రంగంలోకి దిగిన పోలీసులు గంటల్లోనే కేసును ఛేదించారు. సినీ ఫక్కీలో నుంచి నిజామాబాద్ రూట్‌లో ఛేజ్ చేసి.. పాపను కిడ్నాపర్ల బారి నుంచి కాపాడారు. బోయిన్‌పల్లికి చెందిన స్వరూప, ఆంజనేయులు దంపతుల మధ్య గొడవ జరిగింది. దీంతో స్వరూప మూడేళ్ల పాపను తీసుకుని ఇంటి నుంచి బయటకు వచ్చేసింది. సికింద్రాబాద్ స్టేషన్ దగ్గరికి చేరుకొని అక్కడ ఫుట్ పాత్‌పై నిద్రించింది. స్వరూపను గమనించిన మరో మహిళ మాట కలిపింది.. అర్ధరాత్రి సమయంలో ఇక్కడ ఉంటే ప్రమాదమని.. తన ఇంటికి రావాలని చెప్పి నమ్మించింది. ఆమెను బాచుపల్లి తీసుకెళ్లింది. స్వరూప తన బిడ్డతో రాత్రి అక్కడే బస చేసింది. ఉదయం తాను ఇంటికి వెళతానని చెప్పి స్వరూప బయటికు రాగా.. తాను ఇంటి దగ్గర వదిలిపెడతానని ఆ మహిళ నమ్మబలికింది. ఇద్దరూ కలిసి బస్టాండ్‌కు చేసుకున్నారు. అక్కడ మహిళ తన ప్లాన్‌ను అమలు చేసింది. పాప ఆకలితో ఉంది.. వెళ్లి ఏదైనా తీసుకొని రమ్మని చెప్పి స్వరూపను మహిళ పంపించింది. పాప తినడానికి ఏదైనా తెద్దామని స్వరూప వెళ్లింది. ఆమె తిరిగొచ్చి చూసేసరికి పాపతో పాటు మహిళ కనిపించకపోవడంతో షాకైంది. వెంటనే పోలీసులకు సమాచారం అందించింది.. వెంటనే పోలీసులు బస్టాండ్ సమీపంలో ఉన్న సీసీ కెమెరాలు పరిశీలించారు. పాపను తీసుకుని మహిళ నిజామాబాద్ వెళ్లే బస్సులో వెళ్ళినట్లు గుర్తించారు. వెంటనే హైదరాబాద్ నుంచి నిజామాబాద్ రూట్ అన్ని పోలీస్ స్టేషన్లను అప్రమత్తం చేశారు. అన్ని బస్టాండ్లను అలర్ట్ చేశారు. బస్సు నెంబర్ కూడా అందజేశారు. పోలీసులు వెంటనే రంగంలోకి దిగి ఆ బస్సు కోసం గాలించారు. ఇంతలో రామాయంపేట దాటి వెళ్లి పోతున్న బస్సును గమనించారు. వెంటనే బస్సును ఆపి.. ఆ మహిళ, పాపను గుర్తించి అదుపులోకి తీసుకున్నారు. గంటల వ్యవధిలోనే పోలీసులు కిడ్నాప్ కేస్‌ను ఛేదించారు.


By June 23, 2020 at 07:15AM


Read More https://telugu.samayam.com/latest-news/crime/hyderabad-police-trace-out-3-year-old-girl-kidnap-case-in-hours/articleshow/76521428.cms

No comments