Breaking News

పుణే: ఇద్దరు పిల్లలతో కలిసి ఉరేసుకుని భార్యాభర్తలు ఆత్మహత్య


ఒకే కుటుంబానికి చెందిన నలుగురు ఉరేసుకుని బలవన్మరణానికి పాల్పడిన ఘటన మహారాష్ట్రలోని పుణేలో చోటుచేసుకుంది. పుణేలోని సుఖ్‌సాగర్ నగర్ ప్రాంతంలో గురువారం రాత్రి ఈ ఘటన చోటుచేసుకుంది. భార్య, భర్త, వారి ఇద్దరు పిల్లలతో కలిసి ఆత్మహత్యకు పాల్పడ్డారు. బాధితులను అతుల్ దత్తాత్రేయ షిండే (33), జయ అతుల్ షిండే (32), రుగ్వేద అతుల్ షిండే (6), అంత్రా అతుల్ షిండే (3)గా గుర్తించారు. తొలుత పిల్లలకు ఉరేసి తర్వాత భార్యాభర్తలు ఉరేసుకున్నట్టు తెలుస్తోంది. గత రెండు రోజులుగా వీరు ఇంటి నుంచి బయటకు రాకపోవడం, ఎలాంటి కదలికలు లేకపోవడం సహా బంధువులు ఫోన్ చేసినా స్పందించకపోవడంతో ఇరుగుపొరుగువారికి అనుమానం వచ్చింది. దీంతో పోలీసులకు సమాచారం ఇచ్చారు. గురువారం రాత్రి అక్కడకు చేరుకున్న పోలీసులు.. బలవంతంగా తలుపులు తెరిచి చూడగా.. నలుగురూ ఉరికి వేలాడుతూ కనిపించారు. మృతదేహాలను కిందకు దించిన పోలీసులు.. పోస్ట్‌మార్టం కోసం హాస్పిటల్‌కు తరలించారు. భారతి యూనివర్సిటీ పోలీసులు కేసు నమోదుచేసి దర్యాప్తు చేపట్టారు. ఆర్ధిక ఇబ్బందులతోనే ఆత్మహత్యకు పాల్పడినట్టు అనుమానిస్తున్నారు. అతుల్ షిండే స్కూల్ విద్యార్థుల ఐడీ కార్డులను తయారుచేస్తుంటాడని, కరోనా కారణంగా వ్యాపారం మూతబడిందని బంధువులు తెలిపారు. ఘటనా స్థలిలో ఎలాంటి ఆత్మహత్య లేఖ లభ్యం కాలేదు. బలవన్మరణానికి సరైన కారణాలు తెలియాల్సి ఉంది. దర్యాప్తులో అన్ని విషయాలు తెలుస్తాయని పోలీసులు పేర్కొన్నారు. బాధితుల మొబైల్స్‌ను స్వాధీనం చేసుకుని, కాల్ డేటాను పరిశీలిస్తున్నారు.


By June 19, 2020 at 09:36AM


Read More https://telugu.samayam.com/latest-news/india-news/four-of-a-family-commits-suicide-in-punes-sukhsagar-nagar-in-maharashtra/articleshow/76456911.cms

No comments