Breaking News

పెళ్లికి వచ్చిన 15మందికి కరోనా.. వరుడు కుటుంబానికి భారీ జరిమానా


దేశవ్యాప్తంగా కరోనా కేసులు కలకలం రేపుతున్నాయి. రోజురోజుకు భారీగా పెరుగుతున్న కేసులతో జనం భయాందోళనలు వ్యక్తం చేస్తున్నారు. ఇలాంటి సమయంలో కఠినంగా కోవిడ్ నిబంధనలు పాటించాల్సిన వారు సైతం వాటిని పక్కన పెడుతున్నారు. ఇలా ఓ పెళ్లిలో కోవిడ్ నిబంధనలు ఉల్లంఘించి 15 మందికి కరోనా సోకడానికి కారణమైన ఓ కుటుంబానికి అధికారులు భారీ జరిమానా విధించారు. వరుడు కుటుంబానికి ఏకంగా 6 లక్షల రూపాయలు ఫైన్ వేశారు. రాజస్థాన్‌లోని భిల్వారా జిల్లాలో జరిగిందీ ఘటన. జిల్లాకు చెందిన గీసులాల్ రాఠీ ఈ నెల 13న తన కుమారుడికి వివాహం జరిపించాడు. కరోనా కారణంగా పెళ్లికి 50 మంది అతిథులు మాత్రమే పాల్గొనేందుకు అనుమతులు విధించిన విషయం తెలిసిందే. అయితే నిబంధనలు పక్కనపెట్టి గీసులాల్ ఈ పెళ్లికి పెద్ద సంఖ్యలో అతిథులను ఆహ్వానించాడు. వివాహానికి హాజరైన వారిలో 15 మందికి మహమ్మారి సోకినట్లుగా తేలింది. కరోనా సోకిన వీరిలో ఒకరు చనిపోయారు కూడా. దీంతో ఈ ఘటనను తీవ్రంగా పరిగణించిన పోలీసులు ఈ నెల 22న గీసులాల్‌పై కేసు నమోదు చేశారు. మరోవైపు, కరోనా సోకిన వారిని ప్రభుత్వ ఐసోలేషన్ కేంద్రాలకు తరలించి చికిత్స అందించారు. వీరికి కరోనా పరీక్షల నిర్వహణ, చికిత్స, ఆహారం, అంబులెన్స్‌ తదితర వాటికి మొత్తంగా రూ.6,26,600 అయింది. దీంతో ఈ మొత్తాన్ని గీసులాల్ కుటుంబం నుంచి వసూలు చేయాలని నిర్ణయించిన కలెక్టర్ రాజేంద్ర భట్ అధికారులకు ఆదేశాలు జారీ చేశారు. ఆ మొత్తాన్ని వసూలు చేసి ముఖ్యమంత్రి సహాయనిధిలో డిపాజిట్ చేయాలని సూచించారు.


By June 28, 2020 at 07:54AM


Read More https://telugu.samayam.com/latest-news/india-news/man-fined-rs-6-26-lakh-for-inviting-over-50-guests-to-wedding-in-rajasthan/articleshow/76668954.cms

No comments