Breaking News

12 రోజుల ముందుగానే దేశమంతటా విస్తరించిన నైరుతి.. 2013 తర్వాత తొలిసారి


శుక్రవారం నాటికి దేశమంతటా విస్తరించినట్టు భారత వాతావరణ విభాగం వెల్లడించింది. సాధారణంగా జులై 8 నాటికి విస్తరించాల్సి ఉండగా.. ఈ ఏడాది 12 రోజుల ముందుగానే విస్తరించడం శుభపరిణామం. ఈ ఏడాది మాదిరిగానే 2015లోనూ జూన్ 26 నాటికే రుతుపవనాలు దేశమంతటా విస్తరించాయి. అయితే, 2013 తర్వాత అంతట వేగంతో నైరుతి రుతుపవనాలు దేశంలోని చిట్టచివరి ప్రాంతానికి చేరడం ఇదే తొలిసారి. గడచిన 13ఏళ్లలో నైరుతి రుతుపవనాలు జూన్ 26కి ముందు విస్తరించడం 2013లో ఒక్కసారే జరిగింది. ఆ ఏడాది జూన్ 16కే రికార్డు స్థాయిలో రుతుపవనాలు దేశమంతటా విస్తరించగా.. అనేక వాతావరణ వ్యవస్థల విచిత్రమైన కలయిక కేదార్‌నాథ్ వరదలకు కారణమైంది. దేశంలోని పంజాబ్, హర్యానా, రాజస్థాన్‌లోని మిగతా ప్రాంతాలకు రుతుపవనాలు విస్తరించినట్టు ఐఎండీ తెలిపింది. దేశంలోకి రుతుపవనాలు ప్రవేశించిన కేవలం 26 రోజుల్లోనే చిట్టచివరి ప్రాంతం రాజస్థాన్‌లోని శ్రీగంగానగర్‌కు చేరుకున్నాయి. రుతుపవనాలు ముందుగానే విస్తరించడం వల్ల ఖరీఫ్ సాగు అనుకున్న సమయానికి ప్రారంభమవుతుందని అధికారులు తెలిపారు. ఇటీవల కాలంలో నైరుతి అత్యంత చురుకుగా ఉండటం ఇదే తొలిసారి.. సాధారణంగా రుతుపవనాలు ప్రారంభంలోనే చురుకుగా ఉంటాయి.. కానీ ఈ ఏడాది మాత్రం ఎక్కడా ఎక్కువ కాలం ఆగిపోకుండా విస్తరించాయి’ అని ఐఎండీ రుతుపవనాల విభాగం అధికారి శివానంద్ పాయ్ అన్నారు. హిమాలయ పర్వత పాదాల మీదుగా ఢిల్లీ సహా ఉత్తర భారతమంతా మైదానాలకు నైరుతి రుతపవనాలు విస్తరించాయని, అయితే, కొద్ది రోజులు వర్షాలు పడవని తెలిపారు. అయితే, ఈ ఏడాది జూన్‌లో సాధారణం కంటే 22 శాతం అధికంగా వర్షపాతం నమోదయ్యింది. బంగాళాఖాతంలోని పరిస్థితులు రుతుపవనాల సకాలంలో విస్తరించడానికి దోహదపడ్డాయి. మే మధ్యలో ఏర్పడిన అంపన్ తుఫాను అండమాన్ నికోబార్ దీవుల్లో రుతుపవనాల కదలికలకు సహకరించింది. తర్వాత అరేబియాలో ఏర్పడిన నిసర్గ కారణంగా కేరళ తీరానికి సకాలంలో రుతుపవనాలు చేరుకున్నాయి. తర్వాత బంగాళాఖాతంలో ఏర్పడిన అల్పపీడనం వల్ల మధ్య భారతంలో రుతుపవనాలు వేగంగా విస్తరించడానికి సహకరించింది.


By June 27, 2020 at 07:23AM


Read More https://telugu.samayam.com/latest-news/india-news/soutwest-monsoon-covers-india-12-days-in-advance-fastest-since-2013/articleshow/76655031.cms

No comments