Breaking News

కరెన్సీ నోట్లపై వారి ఫోటోలు కూడా... నాగబాబు మరో ట్వీట్


ప్రముఖ సినీ నటుడు, జనసేన నాయకుడు నాగబాబు గత కొన్ని రోజులుగా ట్విట్టర్ వేదికగా ఆసక్తికర వ్యాఖ్యలు చేస్తూనే ఉన్నారు. గాంధీ, గాడ్సే అంటూ వివాదాస్పద వ్యాఖ్యలు చేసి కేసుల్లో ఇరుక్కున్న ఆయన మరోసారి సోషల్ మీడియాలో పోస్టు పెట్టారు. ఈ సారి ఆయన భారత కరెన్సీ నోటుపై ఉన్న గాంధీ బొమ్మను ప్రస్తావిస్తూ పరోక్ష వ్యాఖ్యలు చేశారు. భారత కరెన్సీ నోట్ల మీద సుభాష్ చంద్ర బోస్,అంబేద్కర్, భగత్ సింగ్,చంద్ర శేఖర్ ఆజాద్,లాల్ బహదూర్ ,పీవీ నరసింహారావు,అబ్దుల్ కలాం,సావర్కార్,వాజపేయ లాంటి మహానుభావుల చిత్రాలను కూడా చూడాలని ఉందన్నారు. ఎందుకంటే స్వతంత్ర భారత ఆవిర్భావానికి కృషి చేసిన మహానుభావులని జనము మర్చిపోకూడదని ఒక ఆశ అంటూ నాగబాబు ట్వీట్‌లో పేర్కొన్నారు. అంతేకాకుండా ఈ విషయంలో మరోసారి మహాత్ముడి ప్రస్తావన కూడా తీసుకొచ్చారు. గాంధీ గారు బ్రతికి ఉంటే ఆయన కూడా తనతో పాటు దేశానికి సేవ చేసిన దేశభక్తులని గౌరవించమని తప్పకుండా చెప్పేవారన్నారు. దేశం కోసం జీవితాల్ని త్యాగం చేసిన మహానుభావుల పేర్లు తప్ప మొహాలు గుర్తు రావడం లేదన్నారు నాగబాబు. భావితరాలకు కరెన్సీ నోట్ల పై వారి ముఖ పరిచయం చెయ్యాల్సిన బాధ్యత ప్రభుత్వాలపై ఉందంటూ మరో ట్వీట్ చేశారు. నాగబాబు చేసిన ఈ తాజా ట్వీట్‌కు ఫ్యాన్స్ మద్దతిస్తున్నారు. చాలా కరెక్ట్‌గా మాట్లాడారంటూ సపోర్ట్ చేస్తున్నారు. చాలామంది చెప్పలనుకున్నదాన్ని మీరు ధైర్యంగా చెప్పారంటూ కితాబిస్తున్నారు. అయితే ఓ నెటిజన్ మాత్రం గాడ్సే పేరు మర్చిపోయారా అంటూ నాగబాబుకు చురకలంటించారు. ఇంకొందరు ఔత్సాహికులు కరెన్సీ నోట్లపై భగత్ సింగ్, సుభాష్ చంద్ర బోస్ ఫోటోల్ని ప్రింట్ చేసి ఉన్న ఫోటోల్ని షేర్ చేశారు. మరి తాజాగా చేసిన ఈ ట్వీట్‌తో నాగబాబు ఎలాంటి పరిస్థితులు ఎదుర్కొంటారో చూడాలి.


By May 23, 2020 at 10:30AM


Read More https://telugu.samayam.com/telugu-movies/cinema-news/naga-babu-konidela-comments-on-why-only-gandhi-photo-in-currency-notes/articleshow/75911140.cms

No comments