Breaking News

భారత్-చైనా సరిహద్దుల్లో ఉద్రిక్తతల వేళ లడఖ్‌లో పర్యటించిన ఆర్మీ చీఫ్


గత కొద్ది రోజులుగా భారత్, చైనా సరిహద్దుల్లో ఉద్రిక్తతలు చోటుచేసుకున్న వేళ ఆర్మీ చీఫ్ ఎంఎం నరవాణే శుక్రవారం లడఖ్‌లో పర్యటించడం ప్రాధాన్యత సంతరించుకుంది. చైనాతో సరిహద్దుల్లో వివాదాస్పద ప్రాంతాల్లో నెలకున్న పరిస్థితులపై ఆయన సమీక్ష నిర్వహించారు. దేశ సార్వభౌమాధికారం, భద్రత విషయంలో రాజీపడబోమని, దీనికి కట్టుబడి ఉంటామని భారత్ స్పష్టం చేసిన మర్నాడే ఆర్మీ చీఫ్ లడఖ్‌లో పర్యటించడం విశేషం. నార్తర్న్ కమాండ్ చీఫ్ లెఫ్టినెంట్ జనరల్ వైకే జోషి, లేహ్ బేస్డ్ 14 కార్ప్స్ కమాండర్ లెఫ్టినెంట్ జనరల్ హరీందర్ సింగ్ సహా పలువురు ఉన్నతాధికారులతో కలిసి సైన్యం, క్షేత్రస్థాయి పరిస్థితిపై నరవాణే సమీక్షించినట్టు విశ్వసనీయ వర్గాలు తెలిపాయి. నరవాణే లడఖ్ పర్యటనపై టైమ్స్ ఆఫ్ ఇండియా పలుసార్లు ఆర్మీ వర్గాలు సంప్రదించినా దీనిపై స్పందించడానికి నిరాకరించాయి. కానీ, చైనాతో సరిహద్దుల్లో వాస్తవాధీన రేఖ వెంబడి బలగాల మోహరింపు కొనసాగుతోందని, ఇతర ప్రాంతాల నుంచి పెద్ద ఎత్తున అక్కడకు తరలిస్తున్నారని విశ్వసనీయ వర్గాలు వ్యాఖ్యానించారు. సరిహద్దుల్లో పీపుల్స్ లిబరేషన్ ఆర్మీతో ఘర్షణ కొనసాగడంతో ఎలాంటి ఉదాసీనతకు తావులేకుండా యథాతథ స్థితి కొనసాగుతుందని వర్గాలు తెలిపాయి. ‘తరుచూ చైనా సైన్యం కవ్వింపు చర్యలకు పాల్పడటంతో ఉత్తర కమాండ్‌ అప్రమత్తంగా ఉంది.. కానీ, ఉద్రిక్తతలను తగ్గించడానికి చైనాతో సైనిక, దౌత్యవర్గాల ద్వారా చర్చలు జరుగుతున్నాయి.. సరిహద్దు సమావేశం ప్రాంతాల్లో బ్రిగేడియర్ స్థాయి చర్చలు, స్థానిక కమాండర్స్ మధ్య హాట్‌లైన్ ద్వారా చర్చల పరంపర కొనసాగుతోంది.. మరికొన్ని రోజుల్లో సాధారణ పరిస్థితులు నెలకుంటాయని’ పేర్కొన్నాయి. గత కొద్ది రోజులుగా భారత్, చైనాలు సరిహద్దుల్లో అదనపు బలగాలను మోహరిస్తున్నాయి. వివాదాస్పద ప్రాంతాల్లో ఇరు సైన్యాలు గుడారాలు వేసుకుని, ముఖ్యంగా ఎల్ఏసీ వెంబడి తూర్పు లడఖ్‌, పాంగాంగ్ సరస్సు వద్ద చైనా, భారత్ సైన్యాల మధ్య మే నెల ప్రారంభంలో బాహాబాహీ దిగి, ఒకరిపై ఒకరు దాడికి పాల్పడిన విషయం తెలిసింది. అప్పటి నుంచి ఏర్పడిన ఉద్రిక్తతలు కొనసాగుతున్నాయి. దెమ్‌చోక్, చుమార్, దౌలత్ బేగ్ ఓల్డై, గాల్వాన్ లోయ వద్ద బలగాలను మోహరించాయి. చైనా సైన్యం తొలుత ఓ నది వద్ద గుడారాలు వేసి, నిర్మాణాలు ప్రారంభించడంతో గాల్వాన్ లోయ వద్ద సైన్యాన్ని మోహరించినట్టు ఆర్మీ వర్గాలు తెలిపాయి. గాల్వన్ ప్రాంతం 1962 భారత్-చైనా యుద్ధంలో కూడా కీలకంగా వ్యవహరించింది. ఈ వివాదాస్పద ప్రాంతం తమదంటూ చైనా వాదిస్తూ నిర్మాణాలకు ప్రయత్నిస్తోంది. గత కొన్నేళ్లుగా పీపుల్స్ లిబరేషన్ ఆర్మీ కవ్వింపు చర్యలను పునరావృత చేస్తోంది. ఈ ప్రాంతంలో 2013 ఏప్రిల్-మే నెలలో 21 రోజుల పాటు ఇరు సేనల మధ్య ఉద్రిక్తతలు కొనసాగాయి. డీబీఓ సెక్టార్‌లోని దెప్సాంగ్ బుల్గే ప్రాంతంలో చైనా సైన్యం భారత్ భూభాగంలో 19 కిలోమీటర్ల మేర చొచ్చుకొచ్చింది. సింధు నది పరివాహక ప్రాంతంలోని దేమ్‌చోక్ వద్ద కూడా 2018లో 300 నుంచి 400 మీటర్ల మేర మన భూభాగంలో చొచ్చుకురావడంతో ఉద్రిక్తతలు చోటుచేసుకున్నాయి. తర్వాత దీని ఇరు సైన్యాలకు చెందిన దౌత్యవేత్తలు చర్చించడంతో వివాదం సద్దుమణిగింది.


By May 23, 2020 at 08:40AM


Read More https://telugu.samayam.com/latest-news/india-news/amid-heightened-tensions-with-china-army-chief-general-m-m-naravane-visited-ladakh-on-friday/articleshow/75909830.cms

No comments