Breaking News

మూడున్నర లక్షల దాటిన కరోనా మరణాలు.. అమెరికాలో లక్ష మందికిపైగా మృతి


కోరల్లో చిక్కుకుని ప్రపంచ దేశాలు విలవిలలాడుతున్నాయి. మహమ్మారి దెబ్బకు అగ్రరాజ్యాలు అల్లాడిపోతుంటే.. చిన్న దేశాల పరిస్థితి దయనీయంగా మారింది. గత కొద్ది రోజులుగా వైరస్ దెబ్బకు చిగురుటాకులా వణుకుతున్న అమెరికాలో మహమ్మారి కాస్త శాంతించిన ఛాయలు కనిపిస్తున్నాయి. వైరస్‌ వ్యాప్తి పూర్తిస్థాయిలో నియంత్రణలోకి రాకపోయినా.. గత వారంతో పోలిస్తే కొత్త కేసులు, మరణాల సంఖ్య తక్కువగా నమోదవుతోంది. మొత్తం ప్రపంచవ్యాప్తంగా కరోనా వైరస్ పాజిటివ్ కేసుల సంఖ్య 56,84,208 మంది ఇప్పటి వరకూ వైరస్ బారినపడ్డారు. వీరిలో 352,210 మంది ప్రాణాలు కోల్పోయారు. ఒక్క అమెరికాలోనే మరణాల సంఖ్య లక్ష దాటింది. మొత్తం 24.30 లక్షల మంది కోలుకోగా.. ఇంకా, 28.48 లక్షల మంది వైరస్‌తో బాధపడుతున్నారు. ఇక, ప్రపంచ దేశాలను తన కనుసైగలతో శాసించగల అమెరికా.. కరోనా వైరస్ విషయంలో మాత్రం చేష్టలుడిగిపోయింది. అమెరికా అప్రమత్తతను, ఆరోగ్య వ్యవస్థను వెక్కిరిస్తూ మృత్యు శాసనాన్ని రాస్తోంది. కరోనా దెబ్బకు అమెరికాలో ప్రాణాలు కోల్పోయిన వారి సంఖ్య లక్ష దాటింది. ప్రపంచంలో సంభవించిన మొత్తం కరోనా మరణాల్లో 28 శాతానికిపైగా అక్కడే నమోదయ్యాయి. కేసుల విషయంలోనూ అమెరికానే తొలిస్థానంలో ఉంది. ఇప్పటివరకు అక్కడ 17.25 లక్షల మందికిపైగా వైరస్‌ బారిన పడ్డారు. కొవిడ్‌ దెబ్బకు ప్రపంచ ఆర్ధిక రాజధాని న్యూయార్క్‌ ఎక్కువగా నష్టాన్ని చవిచూసింది. ఒక్క ఆ రాష్ట్రంలోనే 29 వేలకుపైగా మరణాలు నమోదయ్యాయి. కేసుల్లోనూ అగ్రస్థానం కూడా ఆ రాష్ట్రానిదే. అక్కడ 3.7 లక్షల మందికి వైరస్‌ సోకింది. మహమ్మారి దెబ్బకు న్యూజెర్సీలో 10 వేలమందికిపైగా ప్రాణాలు కోల్పోయారు. వాస్తవానికి కరోనా సంక్షోభం మొదలైన తొలినాళ్లలో డొనాల్డ్‌ ట్రంప్‌ నిర్లక్ష్య ధోరణి కొంపముంచింది. వైరస్‌ విజృంభిస్తున్నా.. లాక్‌డౌన్‌ వంటి చర్యలకు మొగ్గుచూపలేదు. ఆర్థిక వ్యవస్థను కాపాడుకునేందుకే ట్రంప్‌ ప్రాధాన్యమిచ్చారు. దీంతో ఒక్కోరోజు వేలల్లో మరణాలు నమోదయ్యాయి. పరిస్థితులు విషమించడంతో ఎట్టకేలకు జన సంచారంపై నిషేధాజ్ఞలు విధించారు. ఇటీవల వైరస్‌ వ్యాప్తి కాస్త తగ్గుముఖం పట్టడంతో పలు రాష్ట్రాల్లో ఆంక్షలను సడలించారు. అటు ఐరోపా దేశాల్లోనూ పరిస్థితి కుదుటపడుతోంది. ఇటలీ, స్పెయిన్‌లో మరణాలు తగ్గుముఖం పట్టాయి. కొత్తగా వైరస్ సోకతున్నవారి సంఖ్య కూడా తగ్గింది. బ్రెజిల్‌లో మాత్రం కొవిడ్‌ ఉద్ధృతి కొనసాగుతోంది. అక్కడ మొత్తం కేసుల సంఖ్య 3.94 లక్షలకు చేరగా.. ఇప్పటి వరకూ 23 వేల మంది బలయ్యారు. అమెరికా తర్వాత పాజిటివ్ కేసులు ఈ దక్షిణ అమెరికా రాష్ట్రంలోనే నమోదువుతున్నాయి. ఇక, రష్యాలో గత 24 గంటల్లో 174 మంది కరోనాతో మృత్యువాతపడ్డారు. ఆ దేశంలో ఇప్పటివరకు ఒక్కరోజులో చోటుచేసుకున్న అత్యధిక మరణాలివే కావడం గమనార్హం. దాదాపు 9 వేల కొత్త కేసులు నమోదవడంతో రష్యాలో మొత్తం బాధితుల సంఖ్య 3.62 లక్షలు దాటింది. మొత్తం 3,807 మంది ప్రాణాలు కోల్పోయారు. బ్రిటన్‌లో మృతుల సంఖ్య 37 వేలకు చేరింది. చైనాలోనే కొవిడ్‌ లక్షణాలేవీ కనిపించనప్పటికీ పాజిటివ్‌గా తేలుతున్నవారి సంఖ్య రోజు రోజుకూ పెరుగుతోంది. ఐరోపాలోని ఇటలీలో 32,955, స్పెయిన్‌లో 22,117, ఫ్రాన్స్‌లో 28,530, బెల్జియంలో 9,334 జర్మనీలో 8,498 మంది, మెక్సికలో 8,142 కరోనా కాటుకు బలయ్యారు. ఈ దేశాల్లో బాధితుల సంఖ్య కూడా లక్షల్లోనే ఉంది. స్పెయిన్‌లో 283,339, బ్రిటన్ 265,227, ఇటలీలో 230,555, ఫ్రాన్స్‌లో 182,722, జర్మనీలో 181,288, టర్కీలో 158,762, ఇారన్ 139,511, పెరూ 129,752, కెనడా 86,647, బెల్జియం 42,979 మంది వైరస్ బారినపడ్డారు.


By May 27, 2020 at 08:30AM


Read More https://telugu.samayam.com/latest-news/international-news/globally-more-than-3-52-lakhs-have-died-due-to-coronavirus-us-tolls-one-lakh/articleshow/76023623.cms

No comments