Breaking News

దేశంలో కరోనా కేసులు.. ప్రపంచంలో 9వస్థానానికి చేరిన భారత్!


దేశంలో తీవ్రత ఇప్పట్లో తగ్గుముఖం పట్టే సూచనలు కనిపించడం లేదు. రోజు రోజుకూ కొత్త కేసుల నమోదులో కొత్త రికార్డులు నమోదవుతున్నాయి. గత 10 రోజులుగా రోజుకు సగటున 6,500పైగా పాజిటివ్ కేసులు నమోదుకావడం ఆందోళనకు గురిచేస్తోంది. గురువారం దేశవ్యాప్తంగా మరో 6,926 మందికి కొత్తగా వైరస్ నిర్ధారణ అయ్యింది. దీంతో దేశంలో మొత్తం కరోనా వైరస్ బాధితుల సంఖ్య 1.65 లక్షలు దాటింది. అంతేకాదు, ప్రపంచంలో అత్యధికంగా నమోదయిన దేశాల జాబితాలో మరో స్థానం ఎగబాకి తొమ్మిదికి చేరింది. ఇప్పటి వరకు మన కంటే ముందున్న టర్కీలో 160,672 కేసులు నమోదు కాగా.. భారత్‌లో 165,358 కేసులు నమోదయ్యాయి. ఇక, దేశవ్యాప్తంగా మహమ్మారి నుంచి 70వేల మందికిపైగా కోలుకోగా.. మరో 89,745 మంది హాస్పిటల్‌లో చికిత్స పొందుతున్నారు. కరోనాతో దేశంలో ఇప్పటి వరకూ 4,711 మంది ప్రాణాలు కోల్పోయారు. వీరిలో అత్యధికంగా మహారాష్ట్రలోనే 1,982 మంది ఉన్నారు. ఇక, మహారాష్ట్రలో మహమ్మారి ఉద్ధృతి కొనసాగుతోంది. దేశవ్యాప్తంగా నమోదైన మొత్తం కేసుల్లో 44% ఆ ఒక్క రాష్ట్రంలో ఉన్నాయి. ఆ రాష్ట్రంలో పాజిటివ్ కేసుల సంఖ్య 60,000 మార్క్ దాటగా.. ఒక్క ముంబయి మహానగరంలోనే 35,486 మందికి వైరస్ నిర్ధారణ అయ్యింది. మహారాష్ట్రలో గురువారం కొత్తగా 2,598 కేసులు నమోదు కాగా.. ఒక్క ముంబయిలోనే 1,467 మంది వైరస్ బారినపడ్డారు. మిగతా రాష్ట్రాల్లోనూ అత్యధిక కేసులు నమోదుకావడం గమనార్హం. గత 24 గంటల్లో ఢిల్లీ 1,024, తమిళనాడు 827, గుజరాత్‌ 367, బెంగాల్ 344, తెలంగాణ 158, ఆంధ్రప్రదేశ్ 128, హర్యానా 123, జమ్మూ కశ్మీర్ 115, కేరళ 84, అసోం 82 మందికి కొత్తగా వైరస్ సోకినట్టు ఆయా రాష్ట్ర ప్రభుత్వాలు వెల్లడించాయి. దేశంలో 2వేలకు పైగా పాజిటివ్ కేసులు నమోదైన రాష్ట్రాల సంఖ్య ప్రస్తుతం 14కు చేరింది. గురువారం దేశవ్యాప్తంగా మరో 186 మంది కరోనాకు బలయ్యారు. వీరిలో అత్యధికంగా మహారాష్ట్రలోనే 85 మంది ప్రాణాలు కోల్పోయారు. దీంతో మహారాష్ట్రలో కరోనా మరణాల సంఖ్య 2వేలకు దగ్గరగా చేరింది. మరణాల రేటు పశ్చిమ బెంగాల్‌లో అత్యధికంగా 8.89%గా ఉంది. ఇక, తమిళనాడులో గురువారం 12 మంది చనిపోయారు. తమిళనాడులో కరోనా వైరస్‌తో ఒకే రోజు ఇంత పెద్ద సంఖ్యలో చనిపోవడం ఇదే తొలిసారి. అక్కడ గురువారం 827 మందికి వైరస్ నిర్ధారణ కాగా.. ఒక్క చెన్నై నగరంలోనే 557 కేసులు గుర్తించారు. తమిళనాడులోనూ పాజిటివ్ కేసుల సంఖ్య 20వేలకు చేరువగా ఉంది. ఉత్తరప్రదేశ్‌లో మొత్తం పాజిటివ్ కేసుల సంఖ్య 7,170 దాటగా.. కేవలం వారం రోజుల వ్యవధిలోనే కేసుల పెరుగుదల 21.2 శాతంగా నమోదయ్యింది. కరోనా కేసులు, మరణాల్లో ముంబయి నగరంతో అహ్మదాబాద్ పోటీపడుతోంది. ఇప్పటి వరకు ముంబయిలో 1,135 మంది ప్రాణాలు కోల్పోగా.. అహ్మదాబాద్‌లో 780మంది చనిపోయారు. ముంబయి మరణాలతో పోలిస్తే ఇది చాలా ఎక్కువ. ముంబయిలో మరణాల రేటు 3.64 శాతంగా ఉంటే.. అక్కడ 6.95గా ఉంది. అత్యధికంగా పాజిటివ్ కేసుల నమోదయిన రాష్ట్రాల జాబితాలో మహారాష్ట్ర, తమిళనాడు తర్వాతి ఢిల్లీ (16,285), గుజరాత్‌ (15,572), రాజస్థాన్ (8,067), మధ్యప్రదేశ్ (7,457), ఉత్తరప్రదేశ్ ఉన్నాయి.


By May 29, 2020 at 07:24AM


Read More https://telugu.samayam.com/latest-news/india-news/coronavirus-india-now-no-9-among-covid-hit-countries-as-cases-cross-1-6-lakh/articleshow/76082178.cms

No comments