Breaking News

కేంద్ర మాజీ మంత్రి హన్స్‌రాజ్ భరద్వాజ్ కన్నుమూత


సీనియర్ నేత, కేంద్ర మాజీ మంత్రి (83) అనారోగ్యంతో ఆదివారం సాయంత్రం కన్నుమూశారు. గత కొద్ది రోజులుగా మూత్రపిండాల వ్యాధితో బాధపడుతున్న ఆయనను కుటుంబసభ్యులు బుధవారం ఢిల్లీలోని మాక్స్ హాస్పిటల్‌లో చేర్పించారు. అయితే, హన్స్‌రాజ్ పరిస్థితి విషమించడంతో ఆదివారం సాయంత్రం తుది శ్వాసవిడిచారు. వైద్యులు ఆయనను కాపాడటానికి చివరిదాకా చేసిన ప్రయత్నాలు ఫలించలేదు. కార్డియాక్ అరెస్ట్‌తో హన్స్‌రాజ్ భరద్వాజ్ చనిపోయినట్టు వైద్యులు వెల్లడించారు. సోమవారం సాయంత్రం 4.00 గంటలకు నిఘమ్‌బోధ్ ఘాట్‌లో భరద్వాజ్ భౌతికకాయానికి అంత్యక్రియలు నిర్వహించనున్నట్టు ఆయన కుమారుడు అరుణ్ తెలిపారు. హన్స్‌రాజ్ భరద్వాజ్‌కు భార్య, ఓ కుమారుడు, ఇద్దరు కుమార్తెలు ఉన్నారు. ఫిబ్రవరి 29నే 60వ వివాహమహోత్సవ వేడుకలను జరుపుకోవడం విశేషం. కాంగ్రెస్ సీనియర్ నేత మృతిపై ప్రధాని నరేంద్ర మోదీ, కేంద్ర న్యాయశాఖ మంత్రి రవిశంకర్ ప్రసాద్, కాంగ్రెస్ అధ్యక్షురాలు సోనియా గాంధీ, రాహుల్ గాంధీ, కర్ణాటక ముఖ్యమంత్రి యడియూరప్ప తదితరులు తీవ్ర విచారం వ్యక్తం చేసి, సంతాపం తెలియజేశారు. హరియాణాలోని రోహతక్ జిల్లా సంప్లాలో 1937 మే 17 జన్మించిన హన్స్‌రాజ్.. ఐదుసార్లు రాజ్యసభ సభ్యుడిగా 1982 నుంచి 2009 వరకు పనిచేశారు. అంతేకాదు, 14ఏళ్లపాటు కేంద్ర న్యాయశాఖ మంత్రిగా పనిచేసి రికార్డ్ నెలకొల్పారు. స్వతంత్ర భారత చరిత్రలో అశోక్ కుమార్ సేన్ తర్వాత అత్యధిక కాలం న్యాయశాఖ మంత్రిగా పనిచేసిన రెండో వ్యక్తిగా భరద్వాజ్ చరిత్ర సృష్టించారు. రాజీవ్ గాంధీ, పీవీ నరసింహారావు, మన్మోహన్ సింగ్‌ల హయాంలో కేంద్ర న్యాయశాఖ మంత్రిగా బాధ్యతలు నిర్వర్తించారు. 2009 నుంచి 2014 వరకు కర్ణాటక, కేరళకు గవర్నర్‌గా పనిచేసిన భరద్వాజ్.. కర్ణాటకలో మైనింగ్ మాఫియాపై కఠిన చర్యలు తీసుకున్నారు. భరద్వాజ్ కేంద్ర న్యాయశాఖ మంత్రిగా ఉన్నప్పుడే బోఫోర్స్ కుంభకోణంలో ప్రధాన నిందితుడు ఒట్టావియో ఖత్రోచికి క్లీన్ చిట్ లభించింది.


By March 09, 2020 at 09:19AM


Read More https://telugu.samayam.com/latest-news/india-news/former-law-minister-and-congress-veteran-leader-hansraj-bharadwaj-passes-away/articleshow/74545076.cms

No comments