బీజేపీ ఎంపీకి తిరుపతిలో చేదు అనుభవం!

బీజేపీ రాజ్యసభ సభ్యురాలు శశికళ పుష్పకు తిరుపతి చేదు అనుభవం ఎదురైంది. ఆదివారం ఉదయం తన భర్తతో కలిసి శ్రీవారి దర్శనానికి వెళ్లిన ఆమెను అలిపిరి టోల్ గేట్ వద్ద టీటీడీ విజిలెన్స్ సిబ్బంది అడ్డుకున్నారు. ఆమె వాహనంపై ఉన్న బీజేపీ సింబల్ను తొలగించాలని సూచించారు. దీనిపై అధికారులకు పిర్యాదు చేస్తానని ఎంపీ చెప్పగా.. సిబ్బంది ఆమెకు నచ్చజెప్పే ప్రయత్నం చేశారు. కాగా విజిలెన్స్ సిబ్బంది తనతో దురుసుగా ప్రవర్తించారని ఎంపీ ఆరోపించారు. సిబ్బంది తీరును తను సెల్ ఫోన్లో చిత్రీకరించగా.. అడ్డుకున్న సిబ్బంది తన ఫోన్ను లాక్కున్నారని ఎంపీ తెలిపారు. ఎంపీ శశికళ పుష్ప ఈ ఘటనపై తీవ్ర ఆగ్రహం వ్యక్తం చేశారు. సిబ్బంది తనకు లిఖిత పూర్వక క్షమాపణలు చెప్పాలని ఆమె డిమాండ్ చేశారు. తమిళనాడుకు చెందిన శశికళ పుష్పను 2016లో అన్నాడీఎంకే నుంచి బహిష్కరించారు. దీంతో ఆమె ఇటీవలే బీజేపీలో చేరారు. మరి కొద్ది నెలల్లో ఆమె రాజ్యసభ సభ్యత్వం ముగిసిపోనుంది. వచ్చే ఏడాది తమిళనాడు అసెంబ్లీ ఎన్నికలు జరగనున్న నేపథ్యంలో ఆమె బీజేపీలో చేరడం ప్రాధాన్యం సంతరించుకుంది. ఆమె తూత్తుకుడి మేయర్గానూ పని చేశారు.
By March 01, 2020 at 01:36PM
No comments