లాక్డౌన్ పట్టించుకోని ఎమ్మెల్యే.. రోడ్డుపై మనవడితో ఆటలు.. నోరెత్తని పోలీసులు

దేశవ్యాప్తంగా లాక్డౌన్ కొనసాగుతోంది. పోలీసులు 24 గంటలు రోడ్లపైనే గడిపేస్తున్నారు.. జనాల రోడ్లపైకి రావొద్దు అంటూ జాగ్రత్తలు సూచిస్తున్నారు. కానీ ఇవన్నీ జనాలు పట్టించుకోవడం లేదు.. రోడ్ల మీదకు వస్తున్నారు. కొంతమంది ఆవారాగాళ్లు రోడ్లపై ఇష్టం వచ్చినట్లు తిరుగుతున్నారు. దీంతో అక్కడక్కడా పోలీసులు లాఠీలకు పని చెప్పక తప్పడం లేదు. సామాన్య జనాల సంగతి అలా ఉంటే.. ప్రజలకు మంచి చెప్పాల్సిన ఎమ్మెల్యే లాక్డౌన్ నిబంధనలకు నీళ్లు వదిలారు. కర్ణాటకలోని తుమకూరు జిల్లా గుబ్బి నియోజకవర్గ జేడీఎస్ ఎమ్మెల్యే ఎస్.ఆర్.శ్రీనివాస్ రూల్స్ పట్టనట్లు వ్యవహరించారు. తుమకూరు సమీపంలో హైవేపై తన మనవడితో కలిసి సరదాగా ఆటలాడుతూ కనిపించారు. తన కుమార్తె కొడుకుతో ఛార్జింగ్ జీపులో రోడ్డుపై తిరిగారు. ఎమ్మెల్యేగా బాధ్యతాయుతమైన పదవిలో ఉన్న వ్యక్తి ఇలా లాక్డౌన్ నిబంధనలు పాటించకపోవడంపై విమర్శలు వినిపిస్తున్నాయి. అంతేకాదు ఎమ్మెల్యే మనవడితో నిలబడిన రోడ్డులోనే జిల్లా ఎస్పీ కార్యాలయం ఉంది. ఈ ఫోటో సోషల్ మీడియాకు చేరడంతో విమర్శలు వినిపిస్తున్నాయి. ఎమ్మెల్యే తీరుపై నెటిజన్లు మండిపడుతున్నారు. ప్రజలు రోడ్డు మీదకు రావొద్దని జాగ్రత్తలు చెప్పాల్సిన ఎమ్మెల్యేనే ఇలా రోడ్లపై తిరగడం ఏంటని ప్రశ్నిస్తున్నారు. ఎమ్మెల్యే కావడంతో పోలీసులు కూడా ఏమీ చేయలేని పరిస్థితి.
By March 30, 2020 at 10:09AM
No comments