కేరళలో ఒకే కుటుంబానికి చెందిన ఐదుగురికి కోవిడ్

దేశంలో కరోనా మహమ్మారి క్రమంగా వ్యాప్తిచెందుతోంది. గడచిన నాలుగు రోజుల్లో కోవిడ్ బాధితుల సంఖ్య పెరగడం ఆందోళనకు గురిచేస్తోంది. తాజాగా, కేరళలో మరో ఐదుగురికి కోవిడ్ ఉన్నట్టు గుర్తించారు. ఒకే కుటుంబానికి చెందిన ఐదుగురిలో కరోనా వైరస్ గుర్తించినట్టు అధికారులు తెలిపారు. దీంతో దేశంలో కరోనా వైరస్ కేసుల సంఖ్య 39కి చేరింది. కేరళకు చెందిన ఈ కుటుంబం ఇటీవలే ఇటలీలో పర్యటించినట్టు అధికారులు తెలిపారు. దేశంలోనే తొలిసారిగా కోవిడ్ కేసులు కేరళలోనే నమోదయిన విషయం తెలిసిందే. వుహాన్ నుంచి వచ్చిన ముగ్గురు వైద్య విద్యార్థులకు కరోనా వైరస్ నిర్ధారణ కావడంతో వారిని ప్రత్యేకంగా ఐసోలేషన్లో ఉంచి చికిత్స అందజేయడంతో కోలుకున్నారు. అనంతరం హాస్పిటల్స్ నుంచి డిశ్చార్జ్ చేశారు. తాజాగా మరోసారి కలకలం రేగడంతో ప్రభుత్వం అప్రమత్తమయ్యింది. ఉత్తర్ప్రదేశ్లో ఆరు, ఢిల్లీలో మూడు, కేరళలో మూడు, జమ్మూ కశ్మీర్లో మూడు, తెలంగాణ, తమిళనాడులో ఒక్కొక్కరుతోపాటు 16 మంది ఇటలీ పర్యాటకులకు కోవిడ్ ఉన్నట్టు నిర్ధారణ అయ్యింది. దేశంలో ఇప్పటి వరకు 34 కరోనా కేసులు నమోదయినట్టు కేంద్రం ప్రకటించింది. శనివారం నాడు కొత్తగా నమోదైన మూడు కేసుల్లో రెండు లడఖ్, ఒకటి తమిళనాడు. లడఖ్ బాధితులు ఇటీవల ఇరాన్లో పర్యటించగా, తమిళనాడు వాసి ఒమన్లో పర్యటించినట్టు తెలిపింది. స్థానికంగా ప్రాథమిక పరీక్షలు నిర్వహించి, తర్వాత నేషనల్ వైరాలజీ ఇన్స్టిట్యూట్లోనూ పరీక్షిస్తున్నారు. రెండోసారి పాజిటివ్ వస్తేనే కరోనా ఉన్నట్టు నిర్ధారిస్తున్నారు. లడఖ్కు చెందిన ఇద్దరు బాధితులు ఇరాన్ సందర్శనకు వెళ్లినట్టు స్థానిక అధికారులు వెల్లడించారు. వీరిలో ఒకరు ఫిబ్రవరి 26న టెహ్రాన్ నుంచి ఢిల్లీకి చేరుకుని, రెండు రోజుల కిందటే లడఖ్ వచ్చాడు. మరో వ్యక్తి ఫిబ్రవరి 22న ఢిల్లీకి వచ్చి, ఫిబ్రవరి 27న లడఖ్ చేరుకున్నట్టు తెలిపారు. ఇద్దర్నీ లేహ్లోని ఎస్ఎన్ఎం హాస్పిటల్లో ఐసోలేషన్ వార్డులోనే ఉంచి చికిత్స అందజేస్తున్నారు. తమిళనాడుకు చెందిన బాధితుడు (45) మస్కట్లోని ఓ నిర్మాణ రంగ సంస్థలో ఉద్యోగం చేస్తున్నాడు. ఫిబ్రవరి 27న స్వదేశానికి వచ్చినట్టు తమిళనాడు ఆరోగ్య మంత్రి విజయ బాస్కర్ వెల్లడించారు. అతడికి చెన్నైలోని రాజీవ్ గాంధీ గవర్న్మెంట్ జనరల్ హాస్పిటల్లో ఉంచి చికిత్స అందజేస్తున్నట్టు తెలియజేశారు. జమ్మూ కశ్మీర్, పంజాబ్, ఢిలీ, ఉత్తర్ప్రదేశ్లో పలు అనుమానిత కేసులు నమోదవుతున్నాయి. కరోనా బారినపడ్డ పేటీఎమ్ ఉద్యోగి భార్యలో కరోనా వైరస్ లక్షణాలు ఉన్నట్టు గుర్తించిన వైద్యులు.. ఆమెకు ప్రాథమిక పరీక్షలు నిర్వహించారు. నిర్దారణ కోసం పుణేలోని నేషనల్ వైరాలజీ సంస్థకు ఆమె నమూనాలను పంపారు. అతడితో 375 మంది కాంటాక్ట్ అయినట్టు అధికారులు వెల్లడించారు.
By March 08, 2020 at 11:26AM
No comments