Breaking News

అఫ్గన్‌లో రెండు దశాబ్దాల యుద్ధానికి తెర.. అమెరికా, తాలిబన్ల మధ్య శాంతి ఒప్పందం


ఆఫ్గన్‌లో దాదాపు రెండు దశాబ్దాలపాటు సాగిన యుద్ధానికి అమెరికా ముగింపు పలుకుతూ తాలిబన్లతో కుదుర్చుకుంది. 2001 సెప్టెంబరు 11న వరల్డ్ ట్రేడ్ సెంటర్, పెంటగాన్‌పై ఒసామా బిన్ లాడెన్ నాయకత్వంలోని అల్‌ఖైదా ఉగ్రవాదులు మెరుపు దాడులకు పాల్పడటంతో అఫ్గన్‌‌లో అమెరికా సేనలు, సంకీర్ణ బలగాలు సంయుక్తంగా వారిపై పోరాటం ఆరంభించాయి. అప్పటి నుంచి గత పందొమ్మిదేళ్లుగా అఫ్గనిస్థాన్ బాంబులు, తుపాకుల మోతతో దద్దరిల్లుతోంది. ఈ యుద్ధానికి తెరదించుతూ అమెరికా-తాలిబన్ల మధ్య శనివారం శాంతి ఒప్పందం కుదిరింది. ఖతార్‌లోని దోహాలో శనివారం జరిగిన ప్రత్యేక కార్యక్రమంలో అమెరికా ప్రత్యేక ప్రతినిధి జల్మీ ఖాలిల్జాద్‌, తాలిబన్ల ప్రతినిధి ముల్లా బరదర్‌ ఈ ఒప్పందంపై సంతకాలు చేశారు. ఈ కార్యక్రమంలో అమెరికా విదేశాంగశాఖ మంత్రి మైక్‌ పాంపియో, ఖతార్‌ ఉప ప్రధాని షేక్‌ మహ్మద్‌బిన్‌ అబ్దుల్‌ రెహ్మాన్‌, ఖతార్‌లో భారత రాయబారి కుమారన్‌తోపాటు పలు దేశాలకు చెందిన ప్రతినిధులు పాల్గొన్నారు. తాజా, ఒప్పందం ప్రకారం అఫ్గన్‌లో తాలిబన్లు ఉగ్రకార్యకలాపాలను పూర్తిగా నిలిపివేసి, తమ ప్రాంతాల్లో ఇతర ఉగ్రవాద సంస్థలకు ఆశ్రయం కల్పించరాదు. మరోవైపు అమెరికా, దాని మిత్రదేశాల సేనలను 14 నెలల్లోగా అఫ్గనిస్థాన్ పూర్తిగా ఉపసంహరించుకోవాలి. తొలిదశలో 135 రోజుల్లో 8,600 మంది సైనికులను అమెరికా ఉపసంహరిస్తుంది. కానీ, ఈ ఒప్పందం కార్యరూపం దాల్చాలంటే తాలిబన్లు, అఫ్గన్‌ ప్రభుత్వం మధ్య మార్చి 10న జరిగే చర్చలు విజయవంతం కావాలి. ఇరు వర్గాల మధ్య రాజకీయ ఒప్పందం కుదిరితే యుద్ధం ముగుస్తుంది. మార్చి 10న నార్వే రాజధాని ఓస్లోలో అఫ్గన్‌ ప్రభుత్వం, తాలిబన్ల మధ్య చర్చలు జరుగనున్నాయి. ఈ నేపథ్యంలో పరస్పర నమ్మ కం కుదిరేలా తమ వద్ద ఉన్న బందీలను విడుదల చేయనున్నారు. ఐదువేల మంది తాలిబన్లను ప్రభుత్వం.. వెయ్యి మంది అఫ్గన్ సైనికులను తాలిబన్లు విడుదల చేయనున్నారు. శాంతి ఒప్పందం కుదిరిన రోజే తాలిబన్లు దేశవ్యాప్తంగా తమ సైనిక కార్యకలాపాలను నిలిపివేశారు. 11/9 దాడుల తర్వాత అఫ్గన్‌లోని తాలిబన్లపై అమెరికా నేతృత్వంలోని సంకీర్ణ సేనలు, నాటో బలగాలు విరుచుకుపడ్డాయి. ఈ యుద్ధం కోసం అగ్రరాజ్యం ఇప్పటివరకు లక్ష కోట్ల డాలర్లు ఖర్చు చేసింది. దాదాపు 2,400 మంది అమెరికా సైనికులు, వేలాది మంది తాలిబన్లు, ఆఫ్ఘన్‌ సైనికులు, లక్షలాది మంది పౌరులు ప్రాణాలు కోల్పోయారు. దాదాపు 25 లక్షల మంది శరణార్థులుగా మారగా, మరో 20 లక్షల మంది వివిధ ప్రాంతాలకు ప్రాణభయంతో వలస వెళ్లారు. అమెరికా దాటికి ఐదేళ్లలోనే అధికారాన్ని కోల్పోయిన తాలిబన్లు.. పూర్తిగా బలహీనపడ్డారు. దీంతో తప్పనిసరి పరిస్థితుల్లో అమెరికాతో చర్చలకు మొగ్గుచూపారు. అమెరికా, తాలిబన్లకు మధ్యవర్తిత్వం వహించడానికి ఖతార్ ముందుకొచ్చింది. 2011 నుంచి తాలిబన్‌ నేతలకు ఆశ్రయం కల్పిస్తోన్న ఖతార్.. 2013లో వారి కోసం ఒక కార్యాలయాన్ని ప్రారంభించింది. అయితే జెండా విషయంలో వివాదం తలెత్తడంతో అదే ఏడాది దానిని మూసివేశారు. చర్చల ప్రక్రియ కూడా ఆగిపోయాయి. తిరిగి 2018లో మరోసారి అమెరికాతో చర్చలకు సిద్ధమని తాలిబన్లు ప్రకటించారు. ఆ తర్వాత ఇరు వర్గాల ప్రతినిధులు దాదాపు తొమ్మిది విడతలుగా సమావేశమై ఓ అంగీకారానికి వచ్చారు. ఈ ఒప్పందం ప్రకారం 20 వారాల్లో 5,400 మంది సైనికులను ఉపసంహరించుకుంటామని 2019 సెప్టెంబర్‌లో అమెరికా ప్రకటించింది. అయితే కొన్ని రోజులకే తాలిబన్లు అమెరికా సైనికుడిని చంపడంతో చర్చల ప్రక్రియ నుంచి వెనక్కు మళ్లినట్టు ట్రంప్‌ ప్రకటించారు. అయితే, తర్వాత మళ్లీ చర్చలు మొదలై.. తాజాగా శాంతి ఒప్పందానికి దారితీసింది. వియత్నాం యుద్ధం నేర్పిన అనుభవంతో అఫ్గన్‌ విషయంలో అమెరికా పునరాలోచనలో పడింది. రెండు అత్యంత శక్తివంతమైన దేశాల మధ్య సుదీర్ఘకాలం జరిగిన యుద్ధంతో భారీగా ప్రాణ, ఆస్తి నష్టం సంభవించింది. చివరకు అమెరికా, వియత్నాం ఓ అవగాహనకు వచ్చి యుద్ధాన్ని నిలిపివేశాయి. తాజాగా, అఫ్గన్‌లో మహిళలు, మైనార్టీలకు అవకాశాలను మెరుగుపరచి ప్రజాస్వామ్య వ్యవస్థను పునరుద్దరించే ప్రయత్నం చేస్తున్నా తాలిబన్లను నుంచి ముప్పు పొంచి ఉందని అమెరికా భావించింది.


By March 01, 2020 at 08:27AM


Read More https://telugu.samayam.com/latest-news/international-news/us-signs-peace-deal-with-taliban-to-pull-out-troops-end-18-year-war-in-afghanistan/articleshow/74422541.cms

No comments