Breaking News

కేరళ: మూడేళ్ల చిన్నారికి కరోనా వైరస్.. 40కి చేరిన కోవిడ్ కేసులు


దేశంలో కేసులు క్రమంగా పెరుగుతూ ఉండటం ఆందోళనకు గురిచేస్తోంది. తాజాగా, కేరళలో మరో కొత్త కేసు నమోదయ్యింది. మూడేళ్ల చిన్నారికి కోవిడ్ సోకినట్టు నిర్ధారణ పరీక్షల్లో గుర్తించారు. కోచికి చెందిన ఆ బాలుడు ఇటలీ నుంచి వచ్చినట్టు అధికారులు తెలిపారు. తాజా కేసుతో దేశంలో కోవిడ్ బాధితుల సంఖ్య 40కి చేరుకుంది. బాలుడి కుటుంబం మార్చి 7న ఇటలీ నుంచి ఇండియాకు వచ్చినట్టు అధికారులు వెల్లడించారు. దుబాయ్-కోచి విమానంలో మార్చి 7న ఉదయం 6.30 గంటలకు కోచి విమానాశ్రాయనికి చేరుకున్న బాలుడికి స్క్రీనింగ్ పరీక్షలు నిర్వహించామని అన్నారు. పరీక్షల్లో బాలుడికి జ్వరం ఉన్నట్టు బయటపడటంతో తక్షణమే హాస్పిటల్‌కు తరలించి ఐసోలేషన్ వార్డులో చేర్పించారు. ఆ బాలుడి తల్లిదండ్రులను కూడా ఐసోలేషన్ వార్డులో ఉంచి, రక్త నమూనాలు సేకరించి పరీక్షలకు పంపినట్టు తెలిపారు. కేరళలో ఒకే కుటుంబానికి చెందిన ఐదుగురికి కరోనా వైరస్ నిర్ధారణ అయినట్టు ఆదివారం ప్రకటించిన విషయం తెలిసిందే. ఆ రాష్ట్రంలో కరోనా బాధితుల సంఖ్య 9కి చేరుకోగా, వైరస్ సోకిన ముగ్గురు బాధితులు కోలుకుని ఇళ్లకు వెళ్లారు. Read Also: మరోవైపు, కరోనా వైరస్ కేసులు దేశంలోనూ నమోదుకావడంతో కేంద్ర సహా అన్ని రాష్ట్ర ప్రభుత్వాలు అప్రమత్తమయ్యాయి. కోవిడ్‌ను నిరోధించడానికి పటిష్ఠ చర్యలు చేపడుతున్నాయి. తాజాగా, కర్ణాటక ప్రభుత్వం పాఠశాలలకు సెలవులు ప్రకటించింది. బెంగళూరు సౌత్, నార్త్, రూరల్ జిల్లాల్లోని పూర్వ-ప్రాథమిక, ఎల్‌కేజీ, యూకేజీ తరగతలను సోమవారం నుంచి నిలిపివేయాలని, తదుపరి ఆదేశాలు వచ్చేవరకూ నిర్వహించకూడదని ఆదివారం రాత్రి సర్క్యులర్ జారీచేసింది. ఈ ఉత్తర్వులు అన్ని ప్రభుత్వ, ప్రయివేట్ పాఠశాలలకూ వర్తిస్తాయని ప్రాథమిక విద్యా శాఖ మంత్రి ఎస్ సురేశ్ కుమార్ తెలిపారు. అరోగ్య, కుటుంబ సంక్షేమ శాఖ కమిషనర్ విజ్ఞ‌ప్తి మేరకు ఈ నిర్ణయం తీసుకున్నట్టు ఆయన వెల్లడించారు. లిఖితపూర్వకంగా ఇంకా ఆదేశాలు అందకపోయినా, మౌఖికంగా అందినట్టు విద్యా శాఖ వర్గాలు తెలిపాయి. Read Also: వైరస్‌కు ప్రధాన కేంద్రమైన చైనాలో వైరస్ వ్యాప్తి తగ్గుముఖం పట్టింది. ఆదివారం కొత్తగా 40 కేసులు మాత్రమే నమోదయినట్టు జాతీయ ఆరోగ్య కమిషన్ వెల్లడించింది. వైరస్‌ బయటపడిన తర్వాత ఇంత తక్కువ కేసులు నమోదుకావడం ఇదే తొలిసారి. అయితే, కోవిడ్ కారణంగా మరో 22 మంది ఆదివారం ప్రాణాలు కోల్పోయారు. దీంతో మరణాల సంఖ్య 3,119కి చేరింది. చైనాలో 100 ఏళ్ల వయసు పైబడిన వ్యక్తి కరోనా నుంచి కోలుకోవడం విశేషం. అమెరికాలో కరోనా బాధితుల సంఖ్య 500 దాటింది. న్యూయార్క్‌లోనే 100కు పైగా కేసులు నమోదయ్యాయి. ఆదివారం మరో ఇద్దరు మృతిచెందడంతో మరణాల సంఖ్య 21కి చేరింది.


By March 09, 2020 at 10:18AM


Read More https://telugu.samayam.com/latest-news/india-news/three-year-old-boy-confirmed-with-covid-19-in-kerala-coronavirus-case-toll-to-40-in-india/articleshow/74545715.cms

No comments