Breaking News

నిర్భయ దోషులకు ఉరి: ఒక్కొక్కరికీ రూ.20వేలు చెల్లించడానికి తలారీతో ఒప్పందం!


నిర్భయ దోషులకు అన్ని దారులూ మూసుకుపోవడంతో మార్చి 20 ఉరిశిక్ష అమలు దాదాపు ఖాయంగానే కనిపిస్తోంది. ఏదైనా అసాధారణ ఘటన జరిగితే తప్పా దోషులకు తీహార్ జైలులో ఉరిశిక్ష అమలు చేయనున్నారు. ఈ నేపథ్యంలో ఖైదీలను ఉరితీయడానికి తలారిని మీరట్ నుంచి నాలుగోసారి ఢిల్లీకి మంగళవారం తరలించారు. మీరట్ చేరుకున్న అధికారుల బృందం.. ఉరితీసే తలారిన పవన్ జల్లాడ్‌ను భద్రత నడుమ ఢిల్లీకి తీసుకెళ్లింది. ఢిల్లీ పోలీసులు, తీహార్ జైలు అధికారులతో కలిసి పవన్ ఢిల్లీకి చేరుకున్నాడు. నలుగురు దోషులకు శుక్రవారం ఉరిశిక్ష అమలు కానుండగా.. బుధవారం ఇందుకు సంబంధించిన రిహార్సిల్ నిర్వహిస్తున్నారు. ఉరి సిద్ధం చేసిన జైలు అధికారులు.. పీడబ్ల్యూడీ అధికారుల సమక్షంలో దీనిని చేపడతారు. తలారి పవన్‌ కోసం జైలు నెంబరు 3లోని ప్రత్యేక బ్యారక్‌లో ఉండటానికి ఏర్పాట్లు చేశారు. దోషులను ఉరితీసే హ్యాంగింగ్ వెల్‌కు ఈ బ్యారక్ సమీపంలో ఉంటుంది. నలుగురు దోషులను ఉరితీయడానికి పవన్ ఒప్పందం చేసుకుని సంతకం చేశారని, ఉరి తర్వాత దోషులను తనిఖీచేయడానికి అనుమతిస్తామని అధికారులు తెలిపారు. కాగా, ఓ జైల్లో డబ్బులు తనకు తక్కువగా ఇస్తున్నారంటూ మరో జైలులో తలారీగా 2015లో పవన్ జల్లాడ్ చేరి వార్తల్లో నిలిచాడు. అయితే, తలారికి నెలవారీగా వేతనం చెల్లించరని అతడు పేర్కొన్నారు. కేవలం నెలకు రూ.3,000 మాత్రమే చెల్లిస్తారని, అది కూడా ఒక్కసారి ఇవ్వరని పవన్ తెలిపాడు. దేశంలో తలారి వృత్తిని ఎంచుకున్న అతికొద్ది మందిలో పవన్‌ ఒకరు. మరోవైపు, దోషులను ఉరితీయడానికి జైలు అధికారులు మొత్తం ఎనిమిది తాళ్లను సిద్ధం చేశారు. నలుగురుకి నాలుగు తాళ్లు.. అదనంగా మరో నాలుగు అందుబాటులో ఉంచినట్టు అధికారులు వెల్లడించారు. అంతేకాదు, ఉరితీసే తలారికి ఒక్కొక్కరికీ రూ.20,000 చొప్పున చెల్లించనున్నట్టు జైలు వర్గాలు వెల్లడించాయి. ఇదిలా ఉండగా.. చివరి నిమిషంలో ఉరి శిక్ష నుంచి తప్పించుకోవడానికి మరో ఎత్తు వేశారు. ఏకంగా అంతర్జాతీయ న్యాయస్థానాన్ని ఆశ్రయించారు. ఇప్పటికే పిటిషన్లు, క్షమాభిక్ష అభ్యర్థనలతో దోషుల ఉరిశిక్ష అమలు ఇప్పటికే చివరి నిమిషంలో మూడు పర్యాయాలు వాయిదా పడిన నేపథ్యంలో ఈ అంశం సంచలనంగా మారింది. ఉరి శిక్షపై స్టే విధించాలని కోరుతూ నిర్భయ దోషుల్లో ముగ్గురు అంతర్జాతీయ న్యాయస్థానాన్ని (ఐసీజే) ఆశ్రయించారు. అక్షయ్‌ కుమార్, పవన్‌ గుప్తా, వినయ్‌ శర్మ ఐసీజేలో పిటిషన్‌ దాఖలు చేశారు.


By March 18, 2020 at 11:26AM


Read More https://telugu.samayam.com/latest-news/india-news/meerut-hangman-pawan-jallad-to-get-rs-20000-per-execution-for-nirbhaya-convicts-hanging/articleshow/74685921.cms

No comments