Breaking News

Hyderabad: స్తంభాల చుట్టూ ఎల్‌ఈడీ ధగధగలు.. భారీగా కరెంట్ బిల్లు!


నగర సుందరీకరణ మీద జీహెచ్‌ఎంసీ ఫోకస్ పెట్టింది. ఖైరతాబాద్, సికింద్రాబాద్ జోన్లలో మొత్తం 948 వీధి స్తంభాలకు ఎల్‌ఈడీ స్ట్రిప్‌లను ఏర్పాటు చేశారు. రాత్రి పూట ఖైరతాబాద్ ఫ్లై ఓవర్ నుంచి అలా ట్యాంక్ బండ్ మీదుగా వెళ్తుంటే.. రోడ్డుకు ఇరువైపులా ధవళ వర్ణ కాంతులతో ఈ ఎల్‌ఈడీ లైట్లు ఆకట్టుకుంటున్నాయి. ట్యాంక్ బండ్ మీద త్రివర్ణ శోభితంగానూ ఎల్‌ఈడీ స్ట్రిప్‌లను ఏర్పాటు చేశారు. కానీ వీటి కోసం నెలకు రూ.1.70 లక్షలను కరెంట్ బిల్లుల రూపంలోనే చెల్లించాల్సి వస్తోంది. ఖైరతాబాద్‌ జోన్లో 729 స్తంభాలను ఎల్ఈడీ స్ట్రిప్‌లను ఏర్పాటు చేయగా.. సికింద్రాబాద్ జోన్‌లో 219 స్తంభాలకు ఏర్పాటు చేశారు. ఒక్కో ఎల్‌ఈడీ స్ట్రిప్ పొడవు కాస్త అటు ఇటుగా 13 మీటర్లు ఉంటుంది. ఒక్కో పోల్‌కు ఉన్న స్ట్రిప్ కోసం 25 యూనిట్ల విద్యుత్ ఉపయోగిస్తున్నారు. స్ట్రిప్ పొడవును బట్టి నెలకు రూ.3000 నుంచి రూ.4000 వేల వరకు ఒక్కో పోల్‌కు కరెంట్ బిల్లు కట్టాల్సి వస్తోంది. ఈ ఎల్‌ఈడీ స్ట్రిప్‌ల ఏర్పాటు ఆలోచన ఖైరతాబాద్, సికింద్రాబాద్ జీహెచ్ఎంసీ జోన్ల అధికారులదేని జీహెచ్‌ఎంసీ తెలిపింది. వీటిని ఏర్పాటు చేయడం కోసం రెండు జోన్లు రూ.28 లక్షల నుంచి రూ.38 లక్షల వరకు ఖర్చు పెట్టాయని అంచనా. ఆకర్షణీయంగా ఉండటంతో ఈ తరహా ఎల్‌‌ఈడీ స్ట్రిప్‌లను తమ ప్రాంతాల్లోనూ ఏర్పాటు చేయాలని నగరవాసులు కోరుతున్నారు. కానీ ఈ ఎల్‌‌ఈడీ లైట్లు రోడ్ల మీద వెళ్లే వారికి క్షేమకరం కాదని జేఎన్‌టీయూ సివిల్ ఇంజినీరింగ్ విభాగం ప్రొఫెసర్ కేఎం లక్ష్మణ రావు తెలిపారు. వెలుతురు ఎక్కువగా ఉండటంతో వాహనదారులు ఏకాగ్రత కోల్పోతారన్నారు. లైటింగ్ ఎక్కువ ఉన్న వాహనం ఎదురుగా వస్తే.. వాహనదారులు ఇబ్బందులు పడతారన్నారు. వీటి వల్ల విద్యుత్ వినియోగం పెరుగుతుందన్నారు. కొందరు వాహనదారులు కూడా ఇదే తరహా అభిప్రాయం వ్యక్తం చేస్తున్నారు. డ్రైవింగ్ చేసే సమయంలో ఇబ్బంది పడుతున్నామన్నారు.


By February 27, 2020 at 11:21AM


Read More https://telugu.samayam.com/telangana/news/led-light-strips-to-poles-cost-ghmc-rs-1-7-lakh-per-month-power-bills/articleshow/74329626.cms

No comments