Breaking News

జర్మనీలో కాల్పులకు తెగబడ్డ దుండగులు.. ఎనిమిది మంది మృతి


తుపాకుల మోతతో జర్మనీలోని హనాన్ నగరం దద్దరిల్లింది. గుర్తుతెలియని వ్యక్తులు రెండు చోట్ల జరిపిన ఈ కాల్పుల్లో 8 మంది మృతి చెందగా మరో ఐదుగురు గాయపడ్డారు. స్థానిక కాలమానం ప్రకారం బుధవారం రాత్రి 10 గంటల తర్వాత నగరంలోని మిడ్‌నైట్ బార్‌లో తొలుత గుర్తు తెలియని వ్యక్తులు కాల్పులకు తెగబడినట్లు పోలీసులు తెలిపారు. దుండగులు పలు రౌండ్లు కాల్పుల అనంతరం అక్కడి నుంచి పరారయినట్లు వెల్లడించారు. అనంతరం ఎరేనా బార్‌లో కాల్పులు తెగబడ్డారు. మిడ్‌నైట్ వద్ద కాల్పుల్లో ముగ్గురు, ఎరేనా వద్ద కాల్పుల్లో ఐదుగురు మృతిచెందారు. కాల్పుల గురించి సమాచారం అందుకున్న హనాన్ పోలీసులు.. ఘటనా స్థలికి చేరుకుని ఆ ప్రాంతాన్ని తమ అధీనంలోకి తెచ్చుకున్నారు. ముష్కరుల కోసం ఆ ప్రాంతాల్లో జల్లెడ పడుతున్నారు. కాల్పుల్లో ఎనిమిది మంది చనిపోయినట్టు పోలీసులు ధ్రువీకరించారు. నిందితుల కోసం గాలిస్తున్నామని, ఘాతుకానికి పాల్పడింది ఎవరో ఇంకా తెలియదని అన్నారు. ఇటీవల జర్మనీలో పలు ఉగ్రదాడులు చోటుచేసుకున్న విషయం తెలిసిందే. బెర్లిన్ నగరంలో 2016 డిసెంబరులో జరిగిన బాంబు పేలుళ్లలో 12 మంది మృతిచెందారు. గతేడాది అక్టోబరులో హాలే నగరంలో జర్మన్లు అత్యంత పవిత్రంగా భావించే యోమ్ కిప్పూర్ రోజున దుండగులు కాల్పులకు తెగబడి ఇద్దర్ని పొట్టనబెట్టుకున్నారు. ఈ ఘటనతో జర్మనీలో మరోసారి నియో-నాజీ హింస పెరుగుతోందని రుజువైంది. అలాగే జూన్‌లో ప్రముఖ రాజకీయ నేత వాల్టేర్ ల్యుబెస్‌కే‌ను ఆయన నివాసంలోనే కాల్చి చంపారు. కాగా, న్యూజిలాండ్ తరహాలో మసీదులో భారీ విధ్వంసానికి ముష్కరులు కుట్ర పన్నినట్టు నిఘా వర్గాలు హెచ్చరించడంతో గత శుక్రవారం జర్మనీ వేర్పాటువాద గ్రూప్‌కి చెందిన 12 మందిని అరెస్ట్ చేశారు.


By February 20, 2020 at 10:12AM


Read More https://telugu.samayam.com/latest-news/international-news/at-least-eight-people-were-killed-in-two-shootings-in-germany/articleshow/74219630.cms

No comments