Breaking News

దశాబ్దాల సమస్యకు పరిష్కారం.. తహసీల్దార్‌ను భుజాలకెత్తుకున్న రైతులు


గత ఏడాది నవంబర్లో హైదరాబాద్ శివార్లలోని అబ్దుల్లాపూర్‌మెట్ తహసీల్దార్‌పై.. ఆమె ఆఫీసులోనే పెట్రోల్ పోసి తగలబెట్టిన ఘటన గుర్తుందా..? భూవివాదాలు ఈ పరిస్థితికి దారి తీశాయి. గౌరెల్లి గ్రామానికి చెందిన 412 ఎకరాల భూవివాదం తహసీల్దార్ విజయారెడ్డి హత్యకు దారి తీసింది. పెట్రోల్‌తో తహశీల్దార్‌ను తగలబెట్టిన తెలంగాణలోనే ఓ తహసీల్దార్‌ను అభిమానంతో రైతులు భుజాలపై మోశారు. చాలా ఏళ్లుగా రైతులు ఎదుర్కొంటున్న సమస్యకు నెలరోజుల్లోనే పరిష్కారం చూపిన మహబూబాబాద్ తహసీల్దార్‌ పనితీరుకు రైతులు ముగ్ధులయ్యారు. ఆయనపై అభిమానం చాటుకోవడం కోసం పూలవర్షం కురిపించారు, భుజాలపైకి ఎత్తుకొని ఊరేగించారు. వివరాల్లోకి వెళ్తే.. మహబూబాబాద్ మండలంలోని మాధవాపురం, మల్యాల, అమనగల్ గ్రామాలకు చెందిన రైతులు పట్టాదారు పాసుపుస్తకాలు అందక తీవ్ర ఇబ్బందులను ఎదుర్కొంటున్నారు. భూరికార్డుల ప్రక్షాళన చేపట్టినా ఫలితం లేకపోయింది. అక్కడున్న భూములకు, సర్వే నంబర్లకు పొంతన కుదర్లేదు. పట్టాదారు పుసక్తాలు రాకపోవడంతో.. ఇక్కడ రైతులకు రైతు బంధు పథకం వర్తించలేదు. చనిపోయిన వారికి బీమా కూడా అందలేదు. ఇటీవలి కాలంలో మండల పరిధిలో ఏడుగురు రైతులు చనిపోగా.. వారి కుటుంబాలకు బీమా ఇవ్వడం కుదర్లేదు. ఆరు నెలల క్రితం మహబూబాబాద్ తహసీల్దార్‌గా బాధ్యతలు చేపట్టిన రంజిత్ కుమార్ ఈ పరిస్థితి చూసి చలించిపోయారు. ఈ సమస్య పరిష్కారానికి నడుం బిగించారు. సమస్యను పరిశీలించి, క్షుణ్నంగా భూములను సర్వే చేసి ఓ రిపోర్టు రూపొందించి ప్రభుత్వానికి పంపారు. సర్వే నంబర్ల తప్పిదాలను సరి చేయడానికి ప్రభుత్వం అంగీకరించడంతో.. మాధవాపురంలో 900 మందికి, మల్యాలలో 1548 మందికి, అమనగల్‌లో 1400 మందికి పట్టాలు వచ్చాయి. మహబూబాబాద్ ఎంపీ కవిత, ఎమ్మెల్యే శంకర్ నాయక్ చేతుల మీదుగా ఆదివారం నాడు అర్హులకు పట్టాలు ఇప్పించారు. ఈ కార్యక్రమంలో పాల్గొన్న రైతులు తహసీల్దార్‌ను గజమాలతో సత్కరించారు. ఎమ్మెల్యే హ్యాపీ: గత అసెంబ్లీ ఎన్నికల సమయంలో ఎమ్మెల్యే శంకర్ నాయక్ ఎన్నికల ప్రచారం కోసం మాల్యాల గ్రామానికి వచ్చినప్పుడు రైతులు ముళ్ల కంచె వేసి అడ్డుకున్నారు. తమ సమస్య పరిష్కారమయ్యే వరకు ఊళ్లోకి ఏ పార్టీకి చెందిన నాయకుడిని అడుగు పెట్టనీయమన్నారు. ఎన్నికల్లో గెలిచిన వెంటనే మీ సమస్యను పరిష్కరిస్తానని రైతులకు ఎమ్మెల్యే మాటిచ్చారు. తహసీల్దార్ శ్రమించి సమస్యను పరిష్కరించడంతో.. ఎమ్మెల్యే మాట నిలబెట్టుకున్నారు.


By February 03, 2020 at 12:19PM


Read More https://telugu.samayam.com/telangana/news/mahabubabad-tahsildar-solves-pattadar-passbook-issue-hailed-by-farmers/articleshow/73893998.cms

No comments