Breaking News

రైల్లో మహశివుడికి ప్రత్యేక బెర్త్.. క్లారిటీ ఇచ్చిన ఐఆర్‌సీటీసీ


దేశంలో మూడో ప్రయివేట్ రైలు అయిన కాశీ మహాకాళ్ ఎక్స్‌ప్రెస్‌ను ప్రధాని మోదీ ఆదివారం ప్రారంభించిన సంగతి తెలిసిందే. వారణాసి-ఇండోర్‌ నగరాల మధ్య ప్రయాణించే ఈ రైలు ద్వారా మూడు జ్యోతిర్లింగాలు.. ఓంకారేశ్వర్, మహాకాళేశ్వర్, కాశి విశ్వనాథ్‌లను దర్శించుకోవచ్చు. ఈ రైల్లో B5 కోచ్‌లో 64వ నంబర్ సీటును ఓ చిన్నపాటి గుడిగా మార్చేశారు. 64వ నంబర్ సీటును మహాశివుడికి రిజర్వ్ చేశారు. దేవుడి ఫొటోలు, పూలతో ఆ బెర్త్‌ను అందంగా అలకరించారు. ఈ విషయాన్ని నార్త్ రైల్వే అధికార ప్రతినిధి దీపక్ కుమార్ పీటీఐతో తెలిపారు. మహాకాళేశ్వరుడికి ఓ బెర్తును రిజర్వ్ చేశారని వార్తలు వెలువడటం పట్ల ఎంఐఎం అధినేత అసదుద్దీన్ ఒవైసీ స్పందించారు. ట్విట్టర్లో ప్రధాని కార్యాలయాన్ని ట్యాగ్ చేసిన ఆయన.. భారత రాజ్యాంగ పీఠిక ఫొటోను పోస్టు చేశారు. శివుడికి శాశ్వతంగా బెర్త్ కేటాయించే యోచనలో ఉన్నారనే వార్తల పట్ల.. ఇండియన్ రైల్వేస్ అనుబంధ విభాగం ఐఆర్‌సీటీసీ స్పందించింది. కాశీ-మహాకాళ్‌ ఎక్స్‌ప్రెస్‌ సక్సెస్ కావాలని కోరుతూ.. పూజ కోసం 64వ నంబర్ బెర్తుపై పరమశివుడి చిత్రపటాలను సిబ్బంది తాత్కాలికంగా ఉంచారని ఐఆర్‌సీటీసీ స్పష్టం చేసింది. ఆదివారం నాడు రైలు ప్రారంభోత్సవం రోజున ప్రయాణికులను అనుమతించలేదని.. ఈ నెల 20 నుంచి రైలు సేవలు ప్రజలకు అందుబాటులోకి వస్తాయని.. అప్పటి నుంచి శివుడికి బెర్త్ ఉండదని తెలిపింది. ఈ రైల్లో ఆధ్యాత్మిక సంగీతంతోపాటు, ప్రతి కోచ్‌కు ఇద్దరు ప్రయివేట్ గార్డులు ఉంటారు. కేవలం శాకాహారం మాత్రమే అందిస్తారు. ఈ ఏసీ రైలు వారణాసి, ఇండోర్ మధ్య వారానికి మూడుసార్లు ప్రయాణిస్తుంది.


By February 18, 2020 at 12:40PM


Read More https://telugu.samayam.com/latest-news/india-news/irctc-gives-clarification-on-berth-reserved-for-lord-shiva-in-kashi-mahakal-express/articleshow/74187395.cms

No comments