Breaking News

జంబుకేశ్వరర్ ఆలయంలో బయటపడ్డ గుప్త నిధి.. వందలాది బంగారు నాణేలు!


తమిళనాడులోని ఓ పురాతన ఆలయంలో గుప్త నిధులు వెలుగుచూశాయి. తిరువననైకోవిల్‌లోని అఖిలేండేశ్వరి సమేత జంబుకేశ్వరర్ ఆలయంలో బంగారు నాణేలుతో కూడిన మట్టి కుండ బయటపడింది. ఇందులో 1716 గ్రాముల బరువున్న 500 ఉన్నట్టు అధికారులు తెలిపారు. ఆలయంలో పునఃనిర్మాణ పనులు జరుగుతుండగా బుధవారం ఈ నిధిని గుర్తించారు. అఖిలాండేశ్వరి మందిరం సమీపంలోని ఖాళీ ప్రదేశాన్ని సిబ్బంది శుభ్రం చేస్తుండగా అక్కడ మూతతో ఉన్న ఓ మట్టి కుండ కంటిపడింది. దీనిని బయటకుతీసి తెరవగా అందులో 505 బంగారు నాణేలు కనిపించడంతో ఆశ్చర్యపోయారు. జంబుకేశ్వరర్ ఆలయాన్ని 1,800 ఏళ్ల కిందట చోళులు నిర్మించినట్టు శాసనాలు తెలియజేస్తున్నాయి. ఈ ఆలయ నిర్మాణ రీతి అత్యద్భుతంగా ఉంటుంది. మండపాలు, కొలనులు, గర్భాలయం అత్యంత సుందరంగా ఉంటాయి. ఈ ఆలయానికి పలు రాజవంశాలు వెండి వాహనాలు, బంగారు ఆభరణాలు, భూములను విరాళంగా ఇచ్చి జంబుకేశ్వరర్ స్వామిపై తమ భక్తిని చాటుకున్నారు. విశ్వసనీయ వర్గాల సమాచారం ప్రకారం.. ఆలయ పాలకవర్గం చిన్న చిన్న పునరుదర్దరణ పనులు చేపట్టింది. ఇందులో భాగంగా అఖిలాండేశ్వరి అమ్మవారి మందిరం సమీపంలోని వలై కొట్టం వద్ద సుందరీకరణ పనులు చేపట్టారు. అక్కడ నందవనం అభివృద్ధిచేయడానికి ప్రణాళిక రూపొందించారు. ఈ క్రమంలోనే భూమిని చదును చేస్తుండగా ఓ మట్టి కుండ బయటపడింది. దీని గురించి ఆలయ అధికారులకు సమాచారం ఇవ్వడంతో కుండను బయటకు తీసి తెరిచారు. శ్రీరంగం తాహసీల్దార్ అక్కడకు చేరుకుని నిధిని స్వాధీనం చేసుకున్నారు. పురావస్తు శాఖ అధికారులకు నిధుల గురించి తెలియజేశారు. ఆర్కియాలజీ శాఖ అధికారులు అప్పగించి, వాటిపై ఉన్న చారిత్రక శాసనాలు, చిహ్నాలను గురువారం అధ్యయనం చేయనున్నారు. అమ్మవారి మందిరం వద్ద చెట్లు, పొదలను తొలగించే పనులు జరుగుతుండగా ఏడు అడుగుల లోతులో ఈ నిధి బయపడినట్టు అధికారులు తెలిపారు. ఈ నిధి విలువ దాదాపు రూ.70 లక్షలు ఉంటుందని అంచనా వేస్తున్నారు.


By February 27, 2020 at 09:25AM


Read More https://telugu.samayam.com/latest-news/india-news/pot-of-gold-coins-unearthed-at-thiruvanaikovil-jambukeshwarar-temple-in-tamil-nadu/articleshow/74328481.cms

No comments