Breaking News

భారీగా ఐఏఎస్‌ల బదిలీలు.. కేసీఆర్ మార్క్ ప్రక్షాళన!


తెలంగాణలో భారీ ఎత్తున ఐఏఎస్ అధికారుల బదిలీ జరిగింది. 60 మంది ఐఏఎస్ అధికారులను బదిలీ చేయగా.. 21 జిల్లాల కలెక్టర్లను కూడా బదిలీ చేయడం గమనార్హం. ఆరుగురికి పోస్టింగులు ఇవ్వలేదు. సీనియర్లు సహా వివిధ శాఖల్లో ఏళ్లుగా పని చేస్తున్న వారందర్నీ ప్రభుత్వ ట్రాన్స్‌ఫర్ చేసింది. ఆదివారం అర్ధరాత్రి దాటాక ఈ మేరకు ఉత్తర్వులు జారీ అయ్యాయి. కేసీఆర్ రెండోసారి అధికారంలోకి వచ్చాక ఈ స్థాయిలో ఐఏఎస్‌ల బదిలీలు జరగడం ఇదే తొలిసారి. పాలనను ప్రక్షాళన చేసే ఉద్దేశంతోనే సీఎం ఈ నిర్ణయం తీసుకున్నారని భావిస్తున్నారు. సమీప భవిష్యత్తులో ఎన్నికలేవీ లేనందున ఇకపై పూర్తి స్థాయిలో పరిపాలనపై ఫోకస్ పెట్టడం కోసం భారీ సంఖ్యలో ఐఏఎస్‌లకు స్థాన చలనం కలిగిందని భావిస్తున్నారు. తెలంగాణ సర్కారు ఇటీవలే పల్లె ప్రగతి కార్యక్రమాన్ని చేపట్టింది. త్వరలోనే పట్టణ ప్రగతి కార్యక్రమాన్ని ప్రారంభించనుంది. ఈ నేపథ్యంలో పల్లె ప్రగతిలో కనబర్చిన పనితీరుతోపాటు పట్టణ ప్రగతి కార్యక్రమాన్ని పరిగణనలోకి తీసుకొని సీఎం కేసీఆర్ బదిలీలు జరిపారని తెలుస్తోంది. 2018 జనవరి 3న 30 మంది ఐఏఎస్ అధికారులను బదిలీ చేశారు. రాష్ట్ర ఎన్నికల ప్రధాన అధికారి (సీఈఓ) రజత్‌ కుమార్‌కు నీటిపారుదల శాఖను అప్పగించారు. జీఏడీ ప్రత్యేక ప్రధాన కార్యదర్శి అధర్‌ సిన్హాను అంతగా ప్రాధాన్యత లేని పశుసంవర్థక, పాడి అభివృద్ధి, మత్స్య శాఖకు బదిలీ చేశారు. చిత్రా రామచంద్రన్‌కు కీలకమైన విద్యాశాఖ అప్పగించారు. చాలా జిల్లాల కలెక్టర్లుగా యువ ఐఏఎస్‌లకు ప్రాధాన్యం దక్కింది. విద్యాశాఖ కార్యదర్శి బి.జనార్దన్‌రెడ్డికి వ్యవసాయ శాఖ కార్యదర్శిగా నియమించారు. గత మూడేళ్లుగా ఈ పదవిలో ఉన్న పార్థసారథిని ఈపీటీఆర్ఐ బాధ్యతలు అప్పగించారు. సీఎం కార్యదర్శి సందీప్‌కుమార్‌ సుల్తానియాకు పంచాయతీరాజ్, గ్రామీణాభివృద్ధి శాఖలు దక్కాయి. పర్యాటక శాఖ కార్యదర్శి బుర్రా వెంకటేశంను బీసీ సంక్షేమ శాఖ కార్యదర్శి, కమిషనర్‌గా నియమించింది. గ్రేటర్‌లోని హైదరాబాద్‌ పరిధిలో.. హైదరాబాద్, మేడ్చల్‌ జిల్లాల కలెక్టర్లను బదిలీ చేశారు. అలాగే హైదరాబాద్‌ జేసీని కూడా ట్రాన్స్‌ఫర్ చేశారు. జీహెచ్‌ఎంసీ నుంచి ఆరుగురు ఐఏఎస్‌లను బదిలీ చేయగా.. నలుగుర్నే కేటాయంచారు. హైదరాబాద్‌ కలెక్టర్‌ మాణిక్‌రాజ్‌ కణ్ణన్‌ను పరిశ్రమల శాఖ కమిషనర్‌గా నియమించగా.. కొత్త కలెక్టర్‌గా వనపర్తి కలెక్టర్‌ శ్వేతామహంతి పేరు ఖరారు చేశారు. మేడ్చల్‌ కలెక్టర్‌ ఎంవీ రెడ్డిని భద్రాద్రి కొత్తగూడెం జిల్లాకు బదిలీ చేయగా.. భూపాలపల్లి కలెక్టర్‌ వి.వెంకటేశ్వర్లును మేడ్చల్ కలెక్టర్‌గా బదిలీ చేశారు. ఆసిఫాబాద్ కలెక్టర్‌గా సందీప్‌కుమార్, నిజామాబాద్ కలెక్టర్‌గా ముషారఫ్ అలీ బదిలీ అయ్యారు. భూపాలపల్లి కలెక్టర్‌గా అబ్దుల్ అజీమ్, జగిత్యాల కలెక్టర్‌గా శరత్, వికారాబాద్ కలెక్టర్‌గా పౌసుమీ బసు బదిలీ అయ్యారు.


By February 03, 2020 at 08:27AM


Read More https://telugu.samayam.com/telangana/news/kcr-govt-transfers-ias-officers-including-seniors-and-district-collectors-major-reshuffle-in-recent-days/articleshow/73887947.cms

No comments