Breaking News

అమెరికాలో ఉంగరాలు మార్చుకుంటే.. తెలంగాణలో తాంబూలాలు ఇచ్చుకున్నారు


జిల్లాకు చెందిన యువతికి, వరంగల్ అర్బన్ జిల్లాకు చెందిన యువకుడికి పెళ్లి నిశ్చయమైంది. గురువారం ఇద్దరికీ ఎంగేజ్‌మెంట్ జరిగింది. మామూలుగా అయితే ఇది వార్తేం కాదు. కానీ అమ్మాయి, అబ్బాయి ఇద్దరూ అమెరికాలో రింగులు మార్చుకోగా.. వాళ్ల తల్లిదండ్రులు తెలంగాణలో తాంబూలాలు ఇచ్చిపుచ్చుకున్నారు. ఇది చదువుతుంటే.. ఇటీవల గుజరాత్‌‌కు చెందిన ఓ జంట వీడియో కాల్‌లో ఎంగేజ్‌మెంట్ చేసుకున్న ఘటన గుర్తొచ్చిందా? మన తెలుగువాళ్ల నిశ్చితార్థం వివరాలకు వెళ్తే.. వనపర్తి జిల్లా మదనాపురానికి చెందిన అనురాధ, నాగన్న యాదవ్‌ దంపతుల కుమార్తె సాన్వి శృతి అమెరికాలోని న్యూజెర్సీలో సాఫ్ట్‌వేర్‌ ఉద్యోగం చేస్తోంది. వరంగల్‌ అర్బన్‌ జిల్లా హన్మకొండకు చెందిన శ్రీవాణి, ఐలయ్య యాదవ్‌ దంపతుల కుమారుడు వంశీకృష్ణ కూడా అక్కడే సాఫ్ట్‌వేర్‌ ఉద్యోగం చేస్తున్నాడు. ఇటీవల పెద్దలు వీరికి పెళ్లి సంబంధం కుదిర్చారు. నిశ్చితార్థం చేయాలని భావించారు. కానీ స్వదేశానికి రావడానికి ఇద్దరికీ సెలవులు దొరకలేదు. దీంతో ముహూర్తం ప్రకారం వారికి గురువారం ఆన్‌లైన్ ద్వారానే ఎంగేజ్‌మెంట్ నిర్వహించారు. పంతులు ఫోన్లో మంత్రాలు చదువుతుంటే.. వారిద్దరూ అక్కడ స్నేహితుల సమక్షంలో ఉంగరాలు మార్చుకున్నారు. వారి ఎంగేజ్‌మెంట్‌ను మదనాపురంలోని ఆంజనేయ స్వామి గుళ్లో ఏర్పాటు చేసిన ఎల్‌ఈడీ స్క్రీన్ ద్వారా తల్లిదండ్రులు, బంధువులు తిలకించారు. అమ్మాయి, అబ్బాయి ఉంగరాలు మార్చేసుకోగానే.. ఇక్కడ వారి తల్లిదండ్రులు తాంబూలాలు ఇచ్చిపుచ్చుకున్నారు. లగ్నపత్రిక రాసుకున్నారు. ఏప్రిల్‌లో పెళ్లికి ముహూర్తం పెట్టారు.


By February 28, 2020 at 10:01AM


Read More https://telugu.samayam.com/telangana/news/online-engagement-couple-exchanged-rings-in-us-parents-completes-remaining-rituals-in-telangana/articleshow/74370947.cms

No comments