Breaking News

గ్రే లిస్ట్ నుంచి పాక్ తప్పించుకునే ప్రయత్నం.. ఉగ్రవాది మసూద్ అంశాన్ని లేవనెత్తనున్న భారత్


జైషే మొహమ్మద్ చీఫ్ విషయంలో పాకిస్థాన్‌ను ఇరుకునబెట్టాలని భారత్ భావిస్తోంది. మసూద్ అజార్ తమదేశంలో లేడని గతంలో పలుసార్లు ఫైనాన్సియల్ యాక్షన్ టాస్క్ ఫోర్స్ (ఎఫ్ఏటీఎఫ్) సమావేశంలో చెబుతూ వస్తోంది. తాజాగా, సమావేశంలో ఆదివారం పారిస్‌లో ప్రారంభమైంది. పాకిస్థాన్ అంశం శుక్రవారం చర్చకు రానుంది. ప్రస్తుతం ఎఫ్ఏటీఎఫ్ గ్రే లిస్ట్‌లో ఉన్న పాక్.. ఇందులో నుంచి బయటపడాలంటే తమకు అనుకూలంగా 12 దేశాలు మాట్లాడాలని ఆశలు పెట్టుకుంది. ఉగ్రవాదం విషయంలో ఎఫ్ఏటీఎఫ్ ప్రతిపాదించిన 27 అంశాల్లో పాకిస్థాన్ ఇంకా 13 వాటిలో వెనుకబడి ఉంది. జనవరిలో బీజింగ్ వేదికగా జరిగిన సమావేశంలో పాక్ తీసుకుంటున్న చర్యల్లో 14 అంశాలపై ఎఫ్ఏటీఎఫ్ సంతృప్తి వ్యక్తం చేసింది. మసూద్ అజార్ తమ దేశంలో లేడని, అందుకే అతడిపై ఎఫ్ఐఆర్ నమోదుచేయలేదని పాకిస్థాన్ వాదిస్తోంది. 2019లో 1267 కమిటీ సూచించిన తరువాత జీవనాధార భత్యం కోసం ఐక్యరాజ్యసమితి భద్రతా మండలికి ఇంకా దరఖాస్తు చేయలేదు. ఇప్పటికే లష్కరే తొయిబా చీఫ్ హఫీజ్ సయీద్ తన ఖాతా నుంచి నెలకు రూ.లక్ష తీసుకునేందుకు ఈ కమిటీ అనుమతి ఇచ్చింది. గతేడాది పుల్వామా ఉగ్రదాడి తర్వాత తమ భూభాగంలోని జైషే మహ్మద్ సహా అన్ని తీవ్రవాద సంస్థలపై చర్యలు తీసుకున్నట్టు పాక్ ప్రకటించింది. అంతేకాదు, వారికి సంబంధించిన ఆస్తులు, భవనాలను ప్రభుత్వం స్వాధీనం చేసుకుందని పేర్కొంది. అజార్ సోదరుడు అబ్దుర్ రౌఫ్, ఆయన బంధువు హద్ అజార్ సహా పలువుర్ని నిర్బంధంలోకి తీసుకున్నట్టు వెల్లడించింది. మసూద్ అజార్‌ 2016 నుంచి పాకిస్థాన్ రక్షణలోనే ఉన్నా దీనిపై అధికారింగా ధ్రువీకరించలేదు. తరుచూ తన అనుచరుల కోసం ఆడియో సందేశాలను విడుదలచేసే మసూద్.. పుల్వామా ఉగ్రదాడి తర్వాత మాత్రం సైలెంట్ అయిపోయాడు. ఎలాంటి ఆడియో, వీడియోలను విడుదల చేయలేదు. పాక్ ప్రభుత్వం కూడా అతడు ఎక్కడున్నాడో తమకు తెలియదని అంటోంది. అజార్ ఆచూకీ లేదంటూ 2019 మార్చి నుంచి ప్రభుత్వ వర్గాలు పలుసార్లు వెల్లడించాయి. అయితే, పుల్వామా ఉగ్రదాడి జరిగిన కొద్ది వారాల తర్వాత పాక్ విదేశాంగ మంత్రి షా మహ్మద్ ఖురేషీ ఓ ఇంటర్వ్యూలో మాట్లాడుతూ... జైషే మొహమ్మద్ చీఫ్ మసూద్ అజార్ కచ్చితంగా పాకిస్థాన్‌లో ఉండుంటాడు.. ఆరోగ్యం కూడా బాగులేకపోవచ్చని వ్యాఖ్యానించారు. ఒకవేళ అజార్‌కు వ్యతిరేకంగా భారత్ సాక్ష్యాలు ఇస్తే అతడిపై చర్యలు తీసుకుంటామని పాకిస్థాన్ హామీ ఇచ్చింది. ప్రస్తుతం అనారోగ్యంతో ఉన్న అజార్... ఇంటికే పరిమితమయ్యారని పాక్ మంత్రి పేర్కొన్నారు.


By February 17, 2020 at 10:05AM


Read More https://telugu.samayam.com/latest-news/india-news/india-to-call-out-pakistan-for-claiming-masood-azhar-is-missing-at-fatf-plenary/articleshow/74168488.cms

No comments