Breaking News

తూచ్ 70 లక్షలు కాదు.. కేవలం 2 లక్షల మందితోనే ట్రంప్‌కి స్వాగతం!


అమెరికా అధ్యక్షుడు తొలిసారి భారత పర్యటనకు విచ్చేస్తుండగా ఆయనకు ఘనస్వాగతం పలకడానికి ఏర్పాట్లు ముమ్మరంగా సాగుతున్నాయి. దాదాపు 70 లక్షల మందితో అహ్మదాబాద్‌లో తనకు స్వాగతం చెబుతారంటూ ట్రంప్ ఇటీవల చేసిన వ్యాఖ్యలు చర్చనీయాంశమయ్యాయి. ఈ విషయంలో కేంద్రంలో ఎన్‌డీయే సర్కారుపై ప్రతిపక్షాలు విమర్శలు గుప్పిస్తున్నాయి. నగర జనాభాయే 60 లక్షలైతే అమెరికా అధ్యక్షుడికి 70 లక్షల మంది స్వాగతం పలుకుతారని చెప్పడం విడ్డూరంగా ఉందని కాంగ్రెస్ విమర్శించింది. అయితే, ట్రంప్‌కి స్వాగతం పలకడానికి కేవలం 2 లక్షల మంది మాత్రమే పాల్గొంటారని అధికార వర్గాలు పేర్కొన్నాయి. అహ్మదాబాద్ విమానాశ్రయం నుంచి గాంధీనగర్‌లోని మోతేరా స్టేడియం వరకు గల 22 కిలోమీటర్ల మార్గంలో రెండు లక్షల కన్నా తక్కువ మందే పాల్గొనే అవకాశం ఉందన్నారు. అహ్మదాబాద్ నగర జనాభా దాదాపు 70 లక్షలని ఆయన వ్యాఖ్యానించారు. ‘విమానాశ్రయం నుంచి స్టేడియం వరకు దారిపొడవునా 70 లక్షల మంది స్వాగతం పలుకుతారని మోదీ చెప్పారు.. కాబట్టి భారత పర్యటన కోసం ఎంతో ఉత్తేజంగా ఎదురుచూస్తున్నాను.. మీరందరూ దీన్ని ఆనందిస్తారని ఆశిస్తున్నాను’ అంటూ డొనాల్డ్ ట్రంప్ పేర్కొన్నారు. ‘నమస్తే ట్రంప్’ పేరుతో మోతేరా క్రికెట్ స్టేడియంలో ఫిబ్రవరి 24న భారీ కార్యక్రమాన్ని ఏర్పాటుచేశారు. ఫి ఫిబ్రవరి 24న అహ్మదాబాద్ విమానాశ్రయానికి చేరుకునే ట్రంప్... అక్కడ నుంచి మోదీతో కలిసి రోడ్‌షోలో పాల్గొంటారు. మొత్తం 22 కిలోమీటర్ల మేర ఈ రోడ్‌షో సాగుతుంది. ఈ కార్యక్రమంలో లక్ష నుంచి రెండు లక్షల మంది పాల్గొంటారని భావిస్తున్నామని అహ్మదాబాద్ మున్సిపల్ కమిషనర్ విజయ్ నెహ్రా తెలిపారు. అహ్మదాబాద్‌లో ట్రంప్ మూడు గంటలపాటు గడపనుండగా ఇందుకు గుజరాత్ ప్రభుత్వం దాదాపు రూ.100 కోట్ల ఖర్చుచేస్తోంది. అమెరికా అధ్యక్షుడి ఆతిథ్యం ఇవ్వడంలో బడ్జెట్ గురించి ఆలోచించవద్దని గుజరాత్ సీఎం విజయ్ రూపానీ హామీ ఇచ్చినట్టు ట్రంప్ పర్యటన ఏర్పాట్లలో పాలుపంచుకుంటున్న ఉన్నత వర్గాలు తెలిపాయి. అహ్మదాబాద్ మున్సిపల్ కార్పొరేషన్, అహ్మదాబాద్ అర్బన్ డెవలప్‌మెంట్ అథారిటీ (ఏయూడీఏ) సంయుక్తంగా రహదారులు మరమత్తులు, నగరంలో సుందరీకరణ కోసం రూ.100 కోట్లు ఖర్చు చేస్తున్నాయి. మోతేరా స్టేడియం ప్రారంభించిన తరువాత ట్రంప్ తిరిగి విమానాశ్రయానికి వెళ్లే మార్గంలోని 17 రహదారులు, కొత్తగా ఒకటిన్నర కిలోమీటర్ల రోడ్డు వేయడానికి రూ .60 కోట్లు ఖర్చవుతోంది.


By February 21, 2020 at 08:43AM


Read More https://telugu.samayam.com/latest-news/india-news/only-2-lakh-people-to-greet-us-president-donald-trump-in-ahmedabad/articleshow/74235377.cms

No comments