Breaking News

చంద్రబాబు తప్పిదం, జగన్‌కు సంకటం.. ఏపీకి రూ.3200 కోట్ల నష్టం!


ఆంధ్రప్రదేశ్ రాష్ట్రం ఆర్థిక ఇబ్బందులతో సతమతం అవుతోన్న సంగతి తెలిసిందే. ఆర్థిక కష్టాల నుంచి బయటపడేందుకు కేంద్రం నుంచి వచ్చే నిధులపై జగన్ సర్కారు భారీ ఆశలు పెట్టుకుంది. కానీ కేంద్రం ఇచ్చే నిధుల్లో రూ.3200 కోట్లు రాష్ట్రానికి దక్కకుండా పోయే పరిస్థితి. 2020 మార్చి 31లోగా నిర్వహించలేకపోతే.. కేంద్రం నుంచి వచ్చే ఈ నిధులు ఆగిపోతాయి. అదే జరిగితే రానున్న కాలంలో గ్రామ పంచాయితీల అభివృద్ధి పనులపై ప్రభావం పడే అవకాశం ఉంది. వాస్తవానికి 2018 ఆగష్టులోనే పంచాయతీ ఎన్నికలు జరగాల్సి ఉంది. కానీ 2019 ఎన్నికల ముందు రిస్క్ తీసుకోవడానికి బాబు సాహసం చేయలేదు. పంచాయతీ ఎన్నికల్లో ఫలితం తమకు వ్యతిరేకంగా వస్తే దాని ప్రభావం అసెంబ్లీ ఎన్నికలపై పడుతుందనే భావనతో నాటి టీడీపీ సర్కారు ఎన్నికలను వాయిదా వేసింది. ఈ నిర్ణయం ప్రభావం పంచాయతీలకు అందే నిధులపై పడింది. మార్చి 15లోగా స్థానిక సంస్థల ఎన్నికలు నిర్వహిస్తామని ఇటీవల జగన్ సర్కారు ప్రకటించింది. కానీ స్థానిక సంస్థల ఎన్నికల కోసం ఎస్సీ, ఎస్టీ, బీసీలకు రిజర్వేషన్లు 59.85 శాతానికి చేరాయి. రిజర్వేషన్లు 50 శాతం దాటడాన్ని సవాల్ చేస్తూ టీడీపీ నేత బి.ప్రతాప్ రెడ్డి హైకోర్టును ఆశ్రయించారు. ప్రస్తుతం ఈ అంశం హైకోర్టులో పెండింగ్‌లో ఉంది. అదీగాక పంచాయతీ ఎన్నికల నిర్వహణకు పాఠశాలల భవనాలను ఉపయోగిస్తారు. టీచర్లు కూడా ఎన్నికల విధుల్లో పాల్గొనాల్సి ఉంటుంది. మార్చి 4 నుంచి 20 వరకు ఇంటర్ పరీక్షలు, మార్చి 23 నుంచి ఏప్రిల్ 10 వరకు పదో తరగతి పరీక్షలు జరగనున్నాయి. ఈ నేపథ్యంలో మార్చి నెలలో పంచాయతీ ఎన్నికలు నిర్వహించడం సాధ్యపడకపోవచ్చు. 14వ ఆర్థిక సంఘం సిఫారసుల మేరకు గ్రామ పంచాయతీలకు నిధుల కేటాయింపులో అధిక ప్రాధాన్యం ఇచ్చారు. గ్రామ పంచాయితీలకు నూరు శాతం గ్రాంట్ మంజూరు చేయాలని 14వ ఆర్థిక సంఘం సిఫారసు చేసింది. దీని ప్రకారం 2018-20 మధ్య రెండు ఆర్థిక సంవత్సరాల్లో ఏపీకి రూ.4,065.79 కోట్లు కేటాయించారు. తొలి విడతగా రూ.858.99 కోట్లు మంజూరు చేశారు. మిగతా మొత్తం రెండో దఫాలో రావాల్సి ఉంది. కానీ పంచాయతీ ఎన్నికలు నిర్వహించకపోవడంతో కేంద్రం నిధులను మంజూరు చేయడం లేదు. మార్చి 31తో 14వ ఆర్థిక సంఘం గడువు ముగిసిపోతుండటంతో.. ఆ తర్వాత ఈ నిధులు ఏపీకి రాకుండా పోయే అవకాశం ఉంది. ఇదే విషయాన్ని పంచాయతీ రాజ్ కార్యదర్శి గోపాల కృష్ణ ద్వివేది హైకోర్టు దృష్టికి తీసుకెళ్లారు.


By February 27, 2020 at 09:50AM


Read More https://telugu.samayam.com/andhra-pradesh/news/ap-to-loss-rs-3200-crores-over-panchayat-raj-polls/articleshow/74328733.cms

No comments