Breaking News

కోవిడ్: 2,858కి చేరిన మృతులు.. 50 దేశాలకు వ్యాపించిన వైరస్


చైనాలోని వుహాన్ నగరంలో వెలుగుచూసిన కొత్తరకం ప్రాణాంతక ఇప్పటికి 50 దేశాలకు వ్యాపించింది. క్రమంగా అన్ని ఖండాలకు వైరస్ విస్తరించడంతో ప్రపంచ ఆరోగ్య సంస్థ తీవ్ర ఆందోళన చెందుతోంది. కరోనా వైరస్ మహమ్మారిని ఎదుర్కొడానికి చర్యలు చేపట్టాలని పదే పదే డబ్ల్యూహెచ్‌ఓ అన్ని దేశాలకు విజ్ఞప్తి చేస్తోంది. కరోనా వైరస్‌తో గురువారం మరో 44 మంది ప్రాణాలు కోల్పోయినట్టు చైనా జాతీయ ఆరోగ్య కమిషన్ వెల్లడించింది. అలాగే మరో 327 కొత్త కేసులు నమోదయ్యాయి. ఇప్పటి వరకు కరోనా వైరస్ వల్ల చైనాలో మొత్తం 2,788 మృతిచెందగా, బాధితుల సంఖ్య 78,824కి చేరింది. ప్రపంచవ్యాప్తంగా మొత్తం కరోనా కేసులు 83,000 దాటగా, మరణాల సంఖ్య కూడా 2,858కి చేరుకుంది. అటు దక్షిణ కొరియాలో గురువారం మరో 256 మంది వైరస్ బారినపడ్డారు. దీంతో అక్కడ బాధితుల సంఖ్య 2,022 దాటింది. అమెరికాలోని ఉత్తర కాలిఫోర్నియా మహిళకు కరోనా వైరస్ ఉన్నట్టు నిర్దారణ కావడంతో ఆమె ఆచూకీ కోసం ఆరోగ్య శాఖ అధికారులు ఆరా తీస్తున్నారు. అమెరికాలో తొలి కరోనా కేసుగా భావిస్తున్నారు. అంతేకాదు, బాధితురాలు విదేశాల్లో పర్యటించకపోయినా ఆమెకు వైరస్ సోకడం విశేషం. ఇరాన్ నుంచి వచ్చే పర్యాటకులను తమ దేశంలోకి ప్రవేశించకుండా న్యూజిలాండ్ తాత్కాలిక నిషేధం విధించింది. గడచిన 14 రోజులుగా ఇరాన్‌లో పర్యటించినవారు న్యూజిలాండ్‌లోకి ప్రవేశించలేరని ఆ దేశ ఆరోగ్య మంత్రి డేవిడ్ క్లార్క్ ఓ ప్రకటనలో తెలిపారు. ఇరాన్‌లో కరోనా వైరస్‌తో మృతిచెందిన వారి సంఖ్య 26కి చేరుకుంది. చైనా తర్వాత ఇక్కడే అధికంగా కరోనా వల్ల ప్రాణాలు కోల్పోయారు. కరోనా వైరస్‌తో ప్రపంచ ప్రఖ్యాత పాప్ బ్యాండ్ ఏప్రిల్‌లో దక్షిణ కొరియాలో నిర్వహించే ఈవెంట్లను రద్దుచేసుకుంది. భారత్‌లో కరోనా వైరస్ ప్రభావం గురించి అమెరికా నిఘా వర్గాలు ఆరా తీస్తున్నాయి. భారత ప్రభుత్వం తీసుకుంటున్న చర్యలు, వైరస్ తీవ్రమైతే పరిస్థితి ఎలా ఉంటుంది తదితర అంశాలను పరిశీలిస్తున్నట్టు విశ్వసనీయ వర్గాలు తెలిపాయి. కరోనా వైరస్‌ను ఎదుర్కొడానికి భారత్ సంసిద్దంగా ఉందని, నాలుగైదు కేసులే నమోదయినట్టు పేర్కొన్నారు. జపాన్, దక్షిణ కొరియా పౌరులకు వీసాలను భారత్ రద్దుచేసింది. ఇరాన్‌లోని పరిస్థితిపై కూడా అమెరికా గూఢచార సంస్థలు ఆరా తీస్తున్నాయి. ఆ దేశ ఆరోగ్య శాఖ సహాయ మంత్రికి వైరస్ సోకడంతో ఇరాన్‌లో పరిస్థితికి అద్దం పడుతోంది. ఇదే అంశంపై అమెరికా విదేశాంగ మంత్రి మైక్ పాంపియో మంగళవారం మాట్లాడుతూ.. ఇరాన్‌లో కరోనా వైరస్ తీవ్రతపై అమెరికా తీవ్ర ఆందోళన చెందుతుందని అన్నారు. వైరస్‌ను నివారించడానికి ఇరాన్ సామర్థ్యం తక్కువగా ఉన్నందున వారు కోరితే సహకరించడానికి అమెరికా సిద్ధంగా ఉన్నట్టు యుఎస్ ప్రభుత్వ వర్గాలు తెలిపాయి.


By February 28, 2020 at 10:27AM


Read More https://telugu.samayam.com/latest-news/international-news/coronavirus-reaches-50-countries-over-83000-affected-deaths-2858/articleshow/74372319.cms

No comments