Breaking News

ఢిల్లీ హింస: 27కి చేరిన మృతులు.. మరింత పెరిగే అవకాశం


దేశ రాజధానిలో పౌరసత్వ సవరణ చట్టం (సీఏఏ) వ్యతిరేక, అనుకూల వర్గాల మధ్య జరిగిన ఘర్షణల్లో మృతి చెందినవారి సంఖ్య 27కి చేరింది. హింసాత్మక ఘటనల్లో పెద్దఎత్తున ప్రాణ, ఆస్తినష్టం సంభవించడంతో పరిస్థితిని అదుపుచేయడానికి కేంద్రం రంగంలోకి దిగింది. ఈ బాధ్యతను జాతీయ భద్రత సలహాదారు అజిత్‌ దోవల్‌కి అప్పగించింది. బుధవారం ఉద్రిక్తత కొంత తగ్గినా ఇంటెలిజెన్స్ విభాగానికి చెందిన యువ అధికారి అంకిత్ శర్మ చాంద్ బాగ్‌లోని మురుగు కాలువలో శవమై తేలారు. ఐబీలో సెక్యూరిటీ అసిస్టెంట్‌గా పనిచేస్తున్న శర్మ మంగళవారం సాయంత్రం నుంచి కనిపించకుండా పోయారు. అంకిత్ మిస్సింగ్ వెనుక స్థానిక రాజకీయ నాయకుల హస్తం ఉందని శర్మ కుటుంబసభ్యులు ఆరోపిస్తున్నారు. అయితే, ఐబీ అధికారిని ఆందోళనకారులు తీసుకెళ్లడం తాము చూసినట్టు ఇరుగుపొరుగువారు చెబుతున్నారు. మరోవైపు, ఘర్షణల్లో పలువురు తీవ్రంగా గాయపడటంతో మృతుల సంఖ్య ఇంకా పెరిగే అవకాశం ఉందని హాస్పిటల్ వర్గాలు పేర్కొన్నాయి. పలువురి పరిస్థితి విషమంగా ఉందని తెలిపాయి. బుల్లెట్ గాయాలు, రాళ్లదాడులకు గాయపడిన మొత్తం 183 మంది గురుతేజ్ బహదూర్ హాస్పిటల్‌లో చేరారు. ఇదిలా ఉండగా అల్లర్లను అదుపుచేయడంలో పోలీసుల చర్యలను తప్పుబట్టిన .. తీవ్రంగా మండిపడింది. రోజువారీ విధులు నిర్వహించడానికీ ఎవరైనా పైనుంచి ఆదేశించాలా అని ప్రశ్నించింది. ఇప్పటి వరకు 18 ఎఫ్ఐఆర్‌లను నమోదుచేసిన పోలీసులు.. హింసకు బాధ్యులైన 106 మందిని అదుపులోకి తీసుకున్నారు. ఢిల్లీ ఘటనపై అధికార, విపక్షాల మధ్య మాటల యుద్ధం కొనసాగుతోంది. కేంద్ర హోం మంత్రి అమిత్‌షా తక్షణమే రాజీనామా చేయాలని కాంగ్రెస్‌ డిమాండ్‌ చేసింది. జరిగిన ఘటనలకు ఆయనదే బాధ్యత అని ఇతర విపక్షాలు స్పష్టం చేశాయి. గుజరాత్‌ అల్లర్లను ప్రస్తుత పరిణామాలు గుర్తు చేస్తున్నాయని సీపీఎం వ్యాఖ్యానించింది. అంతేకాదు ఢిల్లీ బాధ్యతను ఎన్‌ఎస్‌ఏకు అప్పగించడాన్ని తీవ్రంగా తప్పుబట్టాయి. అల్లర్ల గురించి నివేదించేందుకు తమకు సమయం కేటాయించాలని కోరుతూ విపక్షాల తరఫున సీపీఎం ప్రధాన కార్యదర్శి సీతారాంఏచూరి రాష్ట్రపతికి లేఖ రాశారు. ఈశాన్య ఢిల్లీలోని పలు ప్రాంతాల్లో జాతీయ భద్రతా సలహాదారు అజిత్ దోవల్ పర్యటించి, స్థానికులతో మాట్లాడారు. వివిధ వర్గాలతో సమావేశమైన దోవల్ వారిలో ఆందోళనలు తొలగించే ప్రయత్నం చేశారు. పోలీసులు తమ పనిని సక్రమంగా నిర్వహించలేదని ఓ బాలిక ఈ సందర్భంగా దోవల్‌కు చెప్పడం విశేషం. ముఖ్యమంత్రి అరవింద్ కేజ్రీవాల్ సైతం అల్లర్లు జరిగిన శివ్ విహార్, కర్వాల్ నగర్ ప్రాంతాల్లో బుధవారం సాయంత్రం పర్యటించారు. హింసాత్మక ఘటనలో ప్రాణాలు కోల్పోయిన కానిస్టేబుల్ రతన్‌లాల్ కుటుంబానికి రూ.కోటి పరిహారం ప్రకటించారు. మరోవైపు, ఢిల్లీలో అదనపు బలగాలను మోహరించారు. ఇప్పటి వరకు 38 కంపెనీల పారామిలటరీ దళాలు ఉండగా వాటిని 47కి పెంచారు.


By February 27, 2020 at 08:39AM


Read More https://telugu.samayam.com/latest-news/india-news/caa-violence-in-delhi-toll-soars-to-27-even-as-violence-ebbs/articleshow/74328074.cms

No comments