తొలిసారి భారత్ పర్యటనకు డొనాల్డ్ ట్రంప్.. ఫిబ్రవరి చివరివారంలో

అమెరికా అధ్యక్షుడు తొలిసారిగా వచ్చే నెలలో భారత్ పర్యటనకు రానున్నారు. ఆయన ఫిబ్రవరి 24 నుంచి 26 వరకు మూడు రోజుల పాటు భారత్లో పర్యటిస్తారు. ఈ సమయంలో భారత్, అమెరికాల పలు వాణిజ్య ఒప్పందాలపై సంతకాలు చేయనున్నాయి. అభిసంశన తీర్మానంతో పాటు మరి కొద్ది రోజుల్లో ఎన్నికల ప్రచారం ప్రక్రియ కొద్ది రోజుల్లో ప్రారంభం కానుండటంతో ట్రంప్ పర్యటన ప్రాధాన్యతను సంతరించుకుంది. కాగా, ఇటీవలి కాలంలో భారత్, అమెరికాల మధ్య సంబంధాలు మరింత బలపడగా, ట్రంప్ పర్యటన ఇరు దేశాల మధ్య వ్యూహాత్మక, ఆర్థిక సంబంధాలు మరింత ముందుకు వెళ్లేందుకు దోహపడుతుంది. అలాగే, ద్వైపాక్షి వాణిజ్యంలో మెరుగైన సంబంధాలు కలిగి ఉన్నా.. తరుచూ ఎదురయ్యే సమస్యలను పరిష్కరించడంతో ఇది మరింత బలపడుతుందని భారత వర్గాలు పేర్కొంటున్నాయి. కాగా, ప్రధానిగా మోదీ తొలిసారి బాధ్యతలు చేపట్టిన తర్వాత 2015 గణతంత్ర దినోత్సవ వేడుకలకు అప్పటి అమెరికా అధ్యక్షుడు బరాక్ ఒబామా ముఖ్య అతిథిగా విచ్చేశారు. ఇక, హౌడీ మోదీ తరహాలోనే ట్రంప్ పర్యటన సందర్భంగా భారత్లో భారీ సభ నిర్వహణపై కూడా అక్కడి అధికారులతో సంప్రదింపులు జరుపుతున్నట్లు తెలుస్తోంది. దీనికి అహ్మదాబాద్ వేదికయ్యే అవకాశం ఉందని విశ్వసనీయ వర్గాలు పేర్కొంటున్నాయి. కానీ, దీనిపై ఇంకా తుది నిర్ణయం తీసుకోవాల్సి ఉందని కొందరు అధికారులు తెలిపారు. అయితే, ట్రంప్ పర్యటన కోసం అమెరికా అధికారులు ఢిల్లీలోని ఓ ప్రముఖ హోటల్ను కూడా బుక్ చేసినట్లు సమాచారం. గతంలో భారత్ పర్యటనకు వచ్చిన అమెరికా అధ్యక్షులు బరాక్ ఒబామా, బిల్ క్లింటన్లు బస చేసిన హోటల్లోనే ట్రంప్ కూడా ఉండే అవకాశం ఉందని తెలుస్తోంది.
By January 29, 2020 at 11:47AM
No comments