Breaking News

యూపీ: 23 మంది పిల్లలను బంధించిన ఉన్మాది.. చివరకు పోలీసుల చేతిలో హతం


ఉత్తర్‌ప్రదేశ్‌లో 23 మంది చిన్నారులను పుట్టిన రోజు వేడుకలు అంటూ పిలిచి ఓ ఇంట్లో బందీలుగా చేసుకున్న వ్యక్తిని పోలీసులు మట్టుబెట్టారు. ఫరుఖాబాద్ జిల్లాలో కలంకలం సృష్టించిన ఈ ఘటనలో నిందితుడిని పోలీసులు గురువారం అర్ధరాత్రి దాటిన తర్వాత కాల్చి చంపారు. అనంతరం పిల్లలను ఆ ఇంటి నుంచి సురక్షితంగా బయటకుతీసుకొచ్చారు. ఫరుఖాబాద్‌ జిల్లా మొహమూద్‌బాద్ పోలీస్ స్టేషన్ పరిధిలోని కథారియా గ్రామానికి చెందిన సుభాష్‌ బాథమ్‌ అనే వ్యక్తి ఓ హత్య కేసులో నిందితుడిగా ఉన్నాడు. తన కుమార్తె పుట్టినరోజు వేడుకల పేరుతో గురువారం మధ్యాహ్నం చుట్టుపక్కల ఇళ్లల్లో ఉండే 23 మంది చిన్నారులను ఆహ్వానించి వారందర్నీ ఇంట్లో బంధించాడు. రాత్రి పొద్దుపోయినా పిల్లలు ఇంటికి రాకవడంతో తల్లిదండ్రులు ఆ ఇంటికి వెళ్లగా వారిపై తుపాకీతో కాల్పులకు పాల్పడ్డాడు. దీంతో ఆందోళన చెందిన పిల్లల తల్లిదండ్రులు పోలీసులకు ఫిర్యాదు చేశారు. రంగంలోకి దిగిన పోలీసులు నిందితుడు ఉన్న ఇంటిని ముట్టడించే ప్రయత్నం చేయగా వారిపై గ్రనేడ్ విసిరి, నాటు తుపాకీతో కాల్పులు జరిపాడు. దీంతో ప్రత్యేక బృందాలు, తీవ్రవాద నిరోధక బృందం అక్కడకు చేరుకుని ఆ ఉన్మాదిని కాల్చి చంపారు. కాన్పూర్ రేంజ్ ఐజీ మోహిత్ అగర్వాల్ ఆధ్వర్యంలో ఈ ఆపరేషన్ కొనసాగింది. ఈ విషయం తీవ్ర ఉత్కంఠకు గురిచేయడంతో యూపీ సీఎం యోగి ఆదిత్యనాథ్‌ సైతం స్వయంగా పరిస్థితిని పర్యవేక్షించడం విశేషం. ఈ ఘటన నుంచి చిన్నారుల క్షేమంగా బయటపడడంతో వారి తల్లిదండ్రులు ఊపిరిపీల్చుకున్నారు. నిందితుడి ఇంటి నుంచి భారీగా ఆయుధాలను స్వాధీనం చేసుకున్నారు. నిందితుడు జరిపిన కాల్పుల్లో ముగ్గురు గాయపడ్డారు. తన కుటుంబానికి ప్రధాన మంత్రి ఆవాస్ యోజన కింద ఇళ్లు, స్వచ్చ్ మిషన్ కింద టాయ్‌లెట్‌ కేటాయించాలని డిమాండ్ చేస్తూ జిల్లా కలెక్టర్‌‌‌కు రాసిన లేఖను నిందితుడు ఆ ఇంటిలో నుంచి విసిరాడు. , ఈ విషయంలో అధికారుల చుట్టూ తిరిగినా వారు పట్టించుకోలేదని ఆరోపించాడు. స్థానికులు తెలిపిన వివరాల ప్రకారం.. నిందితుడు సుభాష్ బాథమ్ ఓ హత్యకేసులో దోషిగా నిరూపితుడై యావజ్జీవ శిక్ష పండింది. అలాగే మరో నాలుగు క్రిమినల్ కేసుల్లో నిందితుడిగా ఉన్నాడు. తన కుమార్తె పుట్టినరోజు వేడుకలు ఉన్నాయంటూ చుట్టుపక్కల ఉండే పిల్లలను పిలిచాడని తెలిపారు. అనంతరం వారిని ఇంట్లో పెట్టి తాళం వేశాడని, ఒక చిన్నారిని మాత్రం వదలిపెట్టి మిగతావారిని బంధించాడన్నారు.


By January 31, 2020 at 08:28AM


Read More https://telugu.samayam.com/latest-news/india-news/nine-hours-hostage-crisis-ends-captor-shot-dead-and-22-kids-rescued-in-uttar-pradesh/articleshow/73789327.cms

No comments